ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రితో జపాన్ విదేశీ, రక్షణ శాఖా మంత్రుల భేటీ


జ‌పాన్ మంత్రుల‌ను స్వాగతించి, మంగ‌ళ‌వారంనాటి 2 +2 స‌మావేశ చర్చల కోసం ఆలోచ‌న‌ల్ని పంచుకున్న ప్రధాని

కీల‌క ఖ‌నిజాలు, సెమీ కండక్టర్లు, రక్షణ రంగ త‌యారీలో స‌న్నిహిత స‌హ‌కారాన్ని ప్రతిపాదించిన ప్రధాని

Posted On: 19 AUG 2024 10:16PM by PIB Hyderabad

జ‌పాన్ విదేశాంగ మంత్రి శ్రీమ‌తి యోకో క‌మికావా, జ‌పాన్ రక్షణ మంత్రి శ్రీ మినోరు కిహారా భార‌త‌ ప్రధాని శ్రీ న‌రేంద్ర మోదీతో ఆగ‌స్టు 19, 2024న భేటీ అయ్యారు. భార‌త‌, జ‌పాన్ దేశాల మధ్య విదేశీ, రక్షణ మంత్రిత్వ శాఖ‌ల స్థాయి మూడో ద‌ఫా 2+2 స‌మావేశాన్ని నిర్వహించ‌డానికి జ‌పాన్ విదేశాంగ మంత్రి శ్రీమ‌తి కమికావా, రక్షణ శాఖ మంత్రి శ్రీ కిహారా భార‌త‌దేశంలో పర్యటిస్తున్నారు.

 

జ‌పాన్ దేశ మంత్రుల‌కు ప్రధాని స్వాగ‌తం ప‌లికారు. ప్రాంతీయంగాను, ప్రపంచ వ్యవహారాల్లోనూ పెరుగుతున్న సంక్లిష్టత నేప‌థ్యంలో, భార‌త‌, జ‌పాన్ దేశాల మధ్య సంబంధాలు బ‌లోపేత‌మ‌వుతున్న త‌రుణంలో 2+2 స‌మావేశాల నిర్వహణ ప్రాధాన్యతను ప్రధాని ప్రత్యేకంగా గుర్తు చేశారు.

 

విశ్వసనీయ స్నేహితులుగా గుర్తింపు పొందిన‌ భార‌త‌, జ‌పాన్ దేశాల స‌న్నిహిత స‌హ‌కారంపై ప్రధాని త‌న ఆలోచ‌న‌ల్ని జ‌పాన్ మంత్రుల‌తో పంచుకున్నారు. ముఖ్యంగా కీల‌క ఖ‌నిజాలు, సెమీ కండ‌క్టర్లు, రక్షణ రంగ త‌యారీపైన ఆయ‌న త‌న ఆలోచ‌న‌ల్ని తెలియ‌జేశారు.

 

ముంబాయి – అహ్మదాబాద్ హైస్పీడ్‌ రైల్ ప్రాజెక్టుతోపాటు వివిధ ద్వైపాక్షిక స‌హ‌కారం రంగాల‌పైన సాధించిన ప్రగతి గురించి వారు తెలుసుకున్నారు. ఇరుదేశాల‌కు పరస్పర ప్రాధాన్యత క‌లిగిన ప్రాంతీయ‌, ప్రపంచ సమస్యలపైనా వారు త‌మ అభిప్రాయాల‌ను ఇచ్చిపుచ్చుకున్నారు.

ఇండో ప‌సిఫిక్‌, అంత‌కు మించిన విష‌యాల్లో శాంతిని, స్థిర‌త్వాన్ని, సౌభాగ్యాన్ని ప్రోత్సహించడంలో భార‌త‌, జ‌పాన్ దేశాల‌ భాగ‌స్వామ్యం పోషిస్తున్న కీల‌క పాత్రను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

 

భార‌త‌దేశం, జ‌పాన్ దేశాల మధ్యన ఆర్ధిక స‌హ‌కార బ‌లోపేత ప్రాధాన్యతను ప్రధాని నొక్కి చెప్పారు. ఇరు దేశాల ప్రజల మధ్యన సంబంధాల బ‌లోపేతం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. భార‌త్‌, జ‌పాన్ దేశాల ప్రధాన మంత్రుల మధ్య త్వరలో జ‌పాన్ లో నిర్వహించే శిఖ‌రాగ్ర స‌ద‌స్సు చెప్పుకోదగ్గ మంచి ఫ‌లితాల‌నిస్తుందనే ఆకాంక్షను ప్రధాని శ్రీ న‌రేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 



(Release ID: 2047182) Visitor Counter : 19