హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.1003 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన అమిత్‌షా


భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అహ్మదాబాద్‌ను పూర్తిగా అభివృద్ధి చేయాలన్నదే మా నిబద్ధత: అమిత్ షా
అభివృద్ధిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం: అమిత్ షా

‘ఏక్ పేడ్ మా కే నామ్’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు కేవలం నినాదం మాత్రమే కాదు. ఇది ఒక ప్రజా ఉద్యమం: అమిత్ షా

భవిష్యత్ తరాల కోసం 100 రోజుల్లో 3 మిలియన్ల మొక్కలు నాటుతామని ఏఎంసీ హామీ: అమిత్ షా


మన జీవితకాలంలో మనం విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్‌కు సమానమైన ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడానికి అవసరమైనన్ని చెట్లను నాటాలి: అమిత్ షా

Posted On: 18 AUG 2024 5:33PM by PIB Hyderabad

కేంద్ర హోం మంత్రి, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు గుజరాత్‌లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.1003 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. గుజ‌రాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర ప‌టేల్‌తో పాటు ప‌లువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజ‌ర‌య్యారు.

అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమాలకు ముందు ఆయన అహ్మదాబాద్‌లోని తల్తేజ్‌లో 'ఆక్సిజన్ పార్క్'ను ప్రారంభించారు. వేజల్పూర్‌లో 'మిషన్ 3 మిలియన్ ట్రీ స్కీమ్' కింద మొక్కలను నాటారు. మకర్బరలో నూతనంగా నిర్మించిన స్విమ్మింగ్ పూల్, జిమ్‌ను కూడా ప్రారంభించారు.
 

ప్రారంభోత్సవం, అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి.. ఈ రోజు అహ్మదాబాద్ నగరంలో ప్రారంభమవుతున్న అభివృద్ధి పనుల్లో గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో రూ.730 కోట్ల విలువైన పనులను చేస్తున్నామని, మిగిలినవి మరో రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో ఉన్నాయని అన్నారు. తాను లోక్‌సభ ఎంపీగా ఉన్న గత ఐదేళ్లలో గాంధీనగర్ నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్, గుజరాత్ ప్రభుత్వం ఏడాదికి రూ.5,000 కోట్ల కంటే తక్కువ విలువైన అభివృద్ధి పనులు చేయని ఒక్క సంవత్సరం ఒకటి కూడా లేదని అన్నారు. గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం అభివృద్ధిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోందన్నారు.

ప్రజా పనుల్లో భాగంగా గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో జాతికి అంకితం చేసిన 21 ప్రాజెక్టుల్లో నాలుగు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశామని.. మరో రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో 18 ప్రాజెక్టులను ప్రారంభించామని, రెండింటికి శంకుస్థాపనలు చేశామని అమిత్ షా తెలిపారు. పారిశుద్ధ్యం, ప్రజారోగ్యానికి సంబంధించిన అభివృద్ధి పనులు, పిల్లలకు మంచి వేదిక కల్పించే సంస్థను ప్రారంభించడం, పర్యావరణ పరిరక్షణకు ఆక్సిజన్ పార్కును అంకితం చేయడం వంటివి ఇందులో ఉన్నాయి.

భవిష్యత్ తరాల కోసం 100 రోజుల్లో 30 లక్షల మొక్కలు నాటాలని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంకల్పించిందని ఆయన తెలిపారు. ఈ ప్రశంసనీయమైన కార్యక్రమంతో తనకు సన్నిహిత సంబంధం ఉందని ఆయన అన్నారు. ప్రతి సొసైటీ చైర్మన్‌కు, కార్యదర్శికి, ప్రతి గ్రామ సర్పంచ్‌కు, ప్రతి మునిసిపల్ కౌన్సిలర్‌కు, ఇతర ప్రజా ప్రతినిధులకు లేఖలు రాసి ఫోన్లు చేసినట్లు వెల్లడించారు. అహ్మదాబాద్ వాసులు తమ సొసైటీలో, సమీపంలోని ఖాళీ స్థలాల్లో, పిల్లల పాఠశాలల్లో వారి కుటుంబ సభ్యులసంఖ్యకు అనుగుణంగా మొక్కలు నాటాలని కోరారు. మన జీవితకాలంలో మనం విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్‌కు సమానంగా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడానికి అవసరమైనన్ని చెట్లను నాటాలని ఆయన కోరారు. వాహనం, శరీరం, ఏసీ, విద్యుత్తు దీపాల ద్వారా మనం ఉత్పత్తి చేసే కార్బన్ డయాక్సైడ్ మొత్తాన్నీ తగ్గించటమే లక్ష్యంగా, ప్రతి పౌరుడూ సాగాలని, కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గిస్తూ ఆక్సిజన్‌ను పెంచాలని సూచించారు. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ రెండూ భూమికి, మానవ మనుగడకు తీవ్రమైన ముప్పు అని ఆయన పేర్కొన్నారు.

ప్రధాన మంత్రీ, గుజ‌రాత్ బిడ్డ అయిన శ్రీ న‌రేంద్ర మోదీ దేశ ప్రజలకు 'ఏక్ పేడ్ మా కే నామ్ (తల్లి పేరు మీద ఒక మొక్క)' నాటాలని పిలుపునిచ్చినట్లు శ్రీ అమిత్ షా గుర్తు చేశారు. తల్లి బతికి ఉంటే ఆమెతో పాటు చెట్టు నాటాలని, ఆమె చనిపోతే ఆమె ఫోటోతో ఆ చెట్టును నాటాలని చెప్పారు. తల్లుల రుణాన్ని తీర్చుకునేందుకు ఇంతకంటే మంచి మార్గం లేదు అని అన్నారు.

మున్సిపల్ కార్పోరేషన్ ఎన్ని ఆక్సిజన్ పార్కులు, ఎన్ని మియావాకి అడవులను నిర్మించినా.. ఎన్ని చెట్లను నాటినా, అహ్మదాబాద్‌లోని ప్రతి పౌరుడు ఒక చెట్టును నాటితే, వాటి సంఖ్య అనేక రెట్లు పెరుగుతుందన్న కేంద్ర మంత్రి.. 'ఏక్ పెడ్ మా కే నామ్' కార్యక్రమంలో పాల్గొనాలని అహ్మదాబాద్ వాసులకు విజ్ఞప్తి చేశారు. మనమందరం ఒక మొక్కను నాటడం మన బాధ్యతగా భావించాలని ఆయన అన్నారు. మన ఎత్తుకు చెట్టు చేరే వరకు చిన్నపిల్లాడిలా చూసుకోవడం ద్వారా ఈ పనిని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఇది కేవలం తల్లి పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న నినాదం కాదని, ఇది ప్రజా ఉద్యమం అని ఆయన అన్నారు.

60 ఏళ్ల తర్వాత దేశ ప్రజలు ఒక వ్యక్తిని మూడోసారి ప్రధానిని చేశారని, ఈ ఘనత నరేంద్ర మోదీకి దక్కిందని అమిత్ షా అన్నారు. అహ్మదాబాద్‌లో మొత్తం మూడు లోక్ సభ స్థానాలు, గుజరాత్ 25 స్థానాలు మోదీ గెలుచుకున్నారని వ్యాఖ్యానించారు.


అహ్మదాబాద్ భవిష్యత్తు ఆధారిత అభివృద్ధి, అభివృద్ధి చెందిన అహ్మదాబాద్ తమ సంకల్పమని అన్నారు. పొగ లేని, ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, ప్రతి ఒక్కరికీ ఆరోగ్య కార్డు ఉన్న నగరంగా అహ్మదాబాద్ ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లలో అటువంటి నగరాన్ని నిర్మించాలన్న ప్రతిజ్ఞను నెరవేరుస్తామని, అహ్మదాబాద్‌ను ప్రపంచ నగరాల్లో అగ్రస్థానానికి తీసుకురావడానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థ అందమైన స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లను నిర్మించిందని, యోగాసనాలు నేర్పించడానికి మంచి ఏర్పాట్లు చేసిందని తెలిపారు. జిమ్‌ను ఉచితంగా, స్విమ్మింగ్‌ను నామమాత్రపు రుసుముతో, యోగాసనాలను ఉచితంగా నేర్చుకోవచ్చని అన్నారు. అందమైన చెరువులు, ఆక్సిజన్ పార్కులను కూడా ఏర్పాటు చేశారు. 

 

***



(Release ID: 2046612) Visitor Counter : 46