గనుల మంత్రిత్వ శాఖ
గనుల తవ్వకం రంగంలో 'ఆత్మనిర్భర్ భారత్'
Posted On:
29 JUL 2024 3:09PM by PIB Hyderabad
ఖనిజ ఉత్పత్తిని పెంచడం ద్వారా మొత్తం ఖనిజ వినియోగంలో దేశీయ గనుల తవ్వకం వాటాను పెంచడానికి, గనుల తవ్వకం రంగంలో 'ఆత్మనిర్భర్ భారత్'ను సాధించటానికి గనుల మంత్రిత్వ శాఖ వివిధ చర్యలు చేపట్టింది.
ఖనిజ ఉత్పత్తిని పెంచడం, గడువు ప్రకారం గనుల్లో కార్యకలాపాలు ప్రారంభించటం.. గనుల తవ్వకం రంగంలో ఉపాధి, పెట్టుబడులను పెంచటం..ఖనిజ వనరుల అన్వేషణ, వేలాన్ని వేగవంతం చేయటం అనే లక్ష్యాలతో గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టానికి(ఎంఎండీఆర్ చట్టం, 1957) సవరణలు చేశారు. ఇవి 28.03.2021 నుంచి అమల్లోకి వచ్చాయి. గనుల వేలంలో అంతిమ వినియోగ పరిమితులను తొలగించడం, అనుసంధానంగా ఉన్న విద్యుత్ కేంద్రం అవసరాన్ని తీర్చిన తరువాత వార్షిక ఉత్పత్తి మొత్తంలో 50% వరకు విక్రయించడానికి క్యాప్టివ్ గనులను అనుమతించడం, ఖనిజ రాయితీల బదిలీపై ఆంక్షలను తొలగించడం వంటి కొన్ని కీలక సవరణలు ఇందులో ఉన్నాయి.
హైటెక్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, రవాణా, రక్షణతో సహా అనేక రంగాల పురోగతికి అవసరమైన కీలకమైన, లోతులో దొరికే ఖనిజాల అన్వేషణ, ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో ఎంఎండీఆర్ సవరణ చట్టం, 2023 ద్వారా ఎంఎండీఆర్ చట్టం, 1957ను మరింత సవరించారు. ఈ సవరణలు 17.08.2023 నుండి అమలులోకి వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా 2015లో వేలం విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి దేశంలో మొత్తం 385 ఖనిజ క్షేత్రాలను వేలం వేశారు. వీటిలో 50 గనుల్లో ఇప్పటికే ఉత్పత్తి జరుగుతోంది.
ఈ సవరణలు కీలక ఖనిజాల ఉత్పత్తిని పెంచడంలో కీలక పాత్ర పోషించాయి. ఉదాహరణకు.. 2014-15లో 12.9 కోట్ల టన్నులుగా ఉన్న ఇనుప ఖనిజం ఉత్పత్తి 2022-23 నాటికి 25.8 కోట్ల టన్నులకు, సున్నపురాయి ఉత్పత్తి 2014-15లో 29.5 కోట్ల టన్నుల నుంచి 2022-23 నాటికి 40.6 కోట్ల టన్నులకు పెరిగింది .
గనుల తవ్వకం & క్వారీయింగ్ రంగ స్థూల విలువ జోడింపు (జీవీఏ) దేశ జీడీపీలో 2 శాతం ఉంది. విలువ పరంగా చూసినట్లయితే ఈ రంగ వాటా 2014-15లో రూ.2,90,411 కోట్ల నుంచి 2022-23లో రూ.3,18,302 కోట్లకు పెరిగింది.
ఈ మేరకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
***
(Release ID: 2038820)