యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

'మేరీ మాటి మేరా దేశ్' ప్రచారంలో భాగంగా ఇప్పటి వరకు 17 లక్షలకు పైగా మొక్కలు నాటారు: శ్రీమతి మీతా రాజీవ్‌ లోచన్

Posted On: 22 AUG 2023 5:47PM by PIB Hyderabad

'మేరీ మాటి మేరా దేశ్' ప్రచారం కింద ఇప్పటి వరకు 17 లక్షలకు పైగా మొక్కలు నాటారని కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర యువజన వ్యవహారాల విభాగం కార్యదర్శి శ్రీమతి మీతా రాజీవ్‌ లోచన్ చెప్పారు. 25 వేలకు పైగా అమృత వాటికలు రూపొందించినట్లు కూడా వెల్లడించారు. భోపాల్‌లో ఆమె పర్యటిస్తున్నారు.

'మేరీ మాటి మేరా దేశ్' ప్రచారంలో 4 కోట్ల మందికి పైగా పంచప్రాణ్ ప్రమాణం చేశారని, యువత చురుగ్గా పాల్గొంటున్నారని శ్రీమతి మీతా ఆర్ లోచన్ వెల్లడించారు.

భోపాల్‌లోని తాత్యా తోపే స్టేడియంలో ఏర్పాటు చేసిన 'మేరీ మాటి మేరా దేశ్' రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న శ్రీమతి మీతా రాజీవ్‌ లోచన్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.

పంజాబ్ బెటాలియన్‌కు చెందిన అమరవీరుడు కెప్టెన్ దేవాశిష్ శర్మ మాతృమూర్తి శ్రీమతి నిర్మల శర్మను శ్రీమతి మీతా రాజీవ్‌ లోచన్‌ సన్మానించారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర క్రీడలు & యువజన సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ పి నరహరి, పీఐబీ, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, నేషనల్ సర్వీస్ స్కీమ్, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌ అధికారులు సహా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మధ్యప్రదేశ్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా, మొదటి రోజున, 'మేరీ మాటి మేరా దేశ్ అభియాన్' కింద భోపాల్‌లోని 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్‌'లో జరుగుతున్న కార్యక్రమాలను శ్రీమతి మీతా రాజీవ్ లోచన్ పరిశీలించారు. ఆ విద్యాసంస్థ ప్రాంగణంలో నిర్మించిన అమృత వాటికను ప్రారంభించారు. నేషనల్ సర్వీస్ స్కీమ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆమె సందర్శించి, ఒక రుద్రాక్ష మొక్కను నాటారు. 

***



(Release ID: 1951586) Visitor Counter : 121