కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
గత 9 సంవత్సరాలలో కార్మిక విధాన సంస్కరణలు కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, ఆరోగ్య భద్రత కల్పించే సాధికారతను నిర్ధారించాయి : శ్రీ భూపేందర్ యాదవ్
29 కార్మిక చట్టాలు 4 సాధారణ లేబర్ కోడ్ లుగా మార్చబడ్డాయి, 28.93 కోట్ల అసంఘటిత కార్మికులు 400 కంటే ఎక్కువ వృత్తులలో ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదు చేసుకున్నారు, నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్.సి.ఎస్) ప్రారంభించినప్పటి నుండి 1.39 కోట్లకు పైగా ఖాళీలు భర్తీ చేయడం జరిగింది : శ్రీ యాదవ్
Posted On:
22 JUN 2023 5:40PM by PIB Hyderabad
గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం గత 9 సంవత్సరాలలో అసంఘటిత, సంఘటిత రంగాల్లోని కార్మికుల కోసం చాలా చేసిందని, కేంద్ర కార్మిక, ఉపాధి, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు.
కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 9 సంవత్సరాల విజయాలపై ఆయన ఈరోజు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దేశం ఇప్పుడు కార్మిక చట్టాలను మారుస్తోందని, సంస్కరిస్తోందని, సరళీకృతం చేస్తుందనీ, తెలియజేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 29 కార్మిక చట్టాలను 4 సాధారణ లేబర్ కోడ్లు గా మార్చడం జరిగిందని శ్రీ యాదవ్ చెప్పారు. దీనివల్ల కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, ఆరోగ్య భద్రత వంటి వాటి ద్వారా సాధికారత లభిస్తుందని ఆయన వివరించారు.
ఈ-శ్రమ్ పోర్టల్, నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్.సి.ఎస్), ఆత్మ నిర్భర భారత్ రోజ్ గార్ యోజన (ఏ.బి.ఆర్.వై), ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ పథకం (పి.ఎం-ఎస్.వై.ఎం) వంటి కార్మిక సంక్షేమం కోసం ఉద్దేశించిన వివిధ ప్రధాన పథకాల గురించి, అవి కార్మికులకు ఏ విధంగా ప్రయోజనం చేకూర్చాయనే విషయాలను శ్రీ యాదవ్ ప్రత్యేకంగా వివరించారు.
అసంఘటిత కార్మికుల కోసం జాతీయ డేటా-బేస్ ను రూపొందించడానికి ఈ-శ్రమ్ పోర్టల్ కీలకమైన కార్యక్రమాల్లో ఒకటని శ్రీ యాదవ్ చెప్పారు. 400కు పైగా వృత్తులలో పనిచేస్తున్న మొత్తం 28.93 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఈ పోర్టల్ లో నమోదు చేసుకున్నారు. మరిన్ని వృత్తులను కూడా ఇందులో చేర్చనున్నారు. ఎన్.సి.ఎస్. మరియు స్కిల్ ఇండియా పోర్టల్ (సి.ఐ.పి) పోర్టల్ తో ఈ-శ్రమ్ పోర్టల్ ను కూడా అనుసంధానించడం జరిగిందని, ఆయన చెప్పారు.
డిజిటల్ ప్లాట్-ఫారమ్ లలో వివిధ రకాల ఉపాధి సంబంధిత సేవలను అందించడానికి 2015 లో నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్.సి.ఎస్) ను ప్రారంభించడం జరిగిందని, కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 31.05.2023 నాటికి, ఎన్.సి.ఎస్. ప్లాట్- ఫారమ్ లో 3.20 కోట్ల మంది నమోదిత ఉద్యోగార్ధులు, 11.25 లక్షల క్రియాశీల యజమానులతో పాటు, 6.42 లక్షల క్రియాశీల ఖాళీలు ఉన్నాయని ఆయన తెలియజేశారు. ఈ పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచి 1.39 కోట్లకు పైగా ఖాళీలను భర్తీ చేసినట్లు ఆయన చెప్పారు. ఇది ఈ-శ్రమ్, ఉద్యం, స్కిల్ ఇండియా పోర్టల్ (ఎస్.ఐ.పి) తో దీన్ని అనుసంధానించడం జరిగిందని ఆయన తెలియజేశారు.
ఉపాధి కల్పనను పెంచడంతో పాటు, కోవిడ్-19 మహమ్మారి యొక్క సామాజిక-ఆర్థిక ప్రభావాన్ని తగ్గించడానికి, 2020-2024 ఆర్థిక సంవత్సరాల కాలానికి 22,810 కోట్ల రూపాయల వ్యయంతో, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈ.పి.ఎఫ్.ఓ) తో అనుసంధానమైన ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన (ఏ.బి.ఆర్.వై) 2020 డిసెంబర్, 30వ తేదీన ప్రారంభించడం జరిగిందని శ్రీ యాదవ్ చెప్పారు.
2023 మే నెల 30వ తేదీ నాటికి 60.40 లక్షల మంది లబ్ధిదారులకు సంబంధించి 1,52,278 సంస్థలు 9382.16 కోట్ల రూపాయల మేర ప్రయోజనాలను క్లెయిమ్ చేశాయని ఆయన చెప్పారు.
అసంఘటిత రంగంలోని కార్మికులకు 60 ఏళ్ల వయస్సు తర్వాత కనీస నెలవారీ పింఛన్ 3,000 రూపాయల మేర హామీతో, 2019 ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభించిన, ప్రధానమంత్రి శ్రమ యోగి మంధన్ (పి.ఎం-ఎస్.వై.ఎం) పథకం కింద, 2023 మే నెల 31వ తేదీ నాటికి దాదాపు 44.33 లక్షల మంది లబ్ధిదారులను నమోదు చేసుకోవడం జరిగిందని శ్రీ యాదవ్ తెలిపారు.
కార్మిక చట్టాల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడం, సమ్మతిని సులభతరం చేయడంతో పాటు, లావాదేవీ ఖర్చులను తగ్గించడం ద్వారా ఫలవంతమైన, సమర్థవంతమైన, వాస్తవ సమయ పరిపాలనని ప్రోత్సహించడానికి శ్రమ్ సువిధ పోర్టల్ (ఎస్.ఎస్.పి) 2014 అక్టోబర్, 16వ తేదీన ప్రారంభించడం జరిగిందని, కేంద్ర మంత్రి తెలిపారు. డి.పి.ఐ.ఐ.టి. కి చెందిన నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ పోర్టల్ (ఎన్.ఎస్.డబ్ల్యూ.ఎస్) తో కూడా ఏకీకృతం చేయడం జరిగింది. దీంతో, ఇది, ఎన్.ఎస్.డబ్ల్యూ.ఎస్.లో సింగిల్ సైన్-ఆన్ పై కార్మిక చట్టాల ప్రకారం లైసెన్స్ లు, రిజిస్ట్రేషన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి పెట్టుబడిదారులను అనుమతిస్తుంది.
గత 9 సంవత్సరాల్లో కార్మిక చట్టాల కింద డీక్రిమినైజేషన్, ప్రసూతి ప్రయోజనం, ఎస్.సి. / ఎస్.టి. ఉద్యోగార్ధుల సంక్షేమం, బీడీ, సినీ, బొగ్గు తదితర రంగాలకు చెందిన కార్మికులకు కార్మిక సంక్షేమ పథకం వంటి వివిధ విధాన సంస్కరణల గురించి కూడా శ్రీ యాదవ్ ప్రత్యేకంగా పేర్కొన్నారు. జీవించి ఉన్న ఇద్దరు పిల్లల తల్లులకు ప్రకటించిన వేతనంతో కూడిన ప్రసూతి శలవులను 12 వారాల నుంచి 26 వారాలకు, ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లులకు 12 వారాలకు పెంచినట్లు ఆయన చెప్పారు. కమీషనింగ్ లేదా దత్తత తీసుకునే తల్లులకు మొదటిసారి 12 వారాల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు లభిస్తాయని ఆయన తెలియజేశారు.
గత తొమ్మిదేళ్లలో ఈ.ఎస్.ఐ.సి. లో జరిగిన ప్రధాన పరిణామాలను కూడా కేంద్ర మంత్రి ప్రముఖంగా పేర్కొన్నారు. ఈ.ఎస్.ఐ.సి. పథకం అమలులో ఉన్న జిల్లాల సంఖ్య 2014 సంవత్సరంలో 393 ఉండగా, ప్రస్తుతం 611 కి పెరిగింది. 2014 లో 2.03 కోట్ల మంది ఐ.పి. లు మరియు 7.89 కోట్ల మంది లబ్ధిదారులతో పోలిస్తే ప్రస్తుతం బీమా ప్రయోజనం పొందుతున్న వ్యక్తులు మరియు లబ్ధిదారులు వరుసగా 3.10 కోట్లు మరియు 12.03 కోట్ల మంది ఉన్నారు. ఆసుపత్రుల సంఖ్య 2014 లో 151 ఉండగా, ప్రస్తుతం 161 కి పెరిగింది. అదేవిధంగా డిస్పెన్సరీలు కూడా 1418 నుంచి 1502 కి పెరిగాయి. వైద్య కళాశాలలు తొమ్మిదేళ్ల క్రితం నాలుగు ఉండగా ఇప్పుడు 8 ఉన్నాయి. ఎం.బి.బి.ఎస్. సీట్ల సంఖ్య 2014 లో 400 ఉండగా, ఇప్పుడు 950 కి పెరిగింది. 2014 లో ఎం.డి. / ఎం.ఎస్. సీట్ల సంఖ్య 60 ఉండగా, ప్రస్తుతం 275 కి పెరిగింది. డి.ఎన్.బి. బ్రాడ్ స్పెషాలిటీ సీట్లు ఇప్పుడు 81 ఉన్నాయి, అయితే 2014 లో ఒక్క సీటు కూడా లేదు. 2019 లో చందా రేటు 6.5 శాతం ఉండగా, ప్రస్తుతం 4 శాతానికి తగ్గించడం జరిగింది. ఈ.ఎస్.ఐ.సి. భవిష్యత్తు విస్తరణలో భాగంగా, 202 కొత్త డిస్పెన్సరీలు, 89 కొత్త ఆసుపత్రులతో, అదనంగా 10,120 పడకలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ.పి.ఎఫ్.ఓ.లో ముఖ్య పరిణామాలను ఆయన ప్రధానంగా వివరిస్తూ - ఈ.పి.ఎఫ్.ఓ. సభ్యత్వాలు 2014-15లో 15.84 కోట్లు ఉండగా, 2021-22 నాటికి 27.73 కోట్లకు పెరిగాయని చెప్పారు. అదే విధంగా, పరిష్కారం పొందిన క్లెయిమ్ ల విషయానికి వస్తే, 2014-15లో 130.21 లక్షల రూపాయల మేర క్లెయిమ్ లు పరిష్కరించగా, ఇది ప్రస్తుతం 390.97 లక్షలకు పెరిగింది. ఇంకా, 2014-15 లో 8.61 లక్షల సంస్థల్లో అమలు కాగా, 2021-22 లో సంస్థల సంఖ్య 18.65 లక్షలకు పెరిగింది. 2014-15 లో పెన్షనర్ల సంఖ్య 51.04 లక్షలుగా ఉండగా 2021-22 లో 72.73 లక్షలకు పెరిగింది. 2014 లో ప్రారంభించిన యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యు.ఏ.ఎన్) , ఈ.పి.ఎఫ్.ఓ. చేపట్టిన ప్రధాన సంస్కరణల్లో ఒకటని, శ్రీ యాదవ్ చెప్పారు. దీనిలో ప్రతి పి.ఎఫ్. సభ్యునికి యు.ఏ.ఎన్. కేటాయించడం జరుగుతుంది. చందాదారుని బహుళ పి.ఎఫ్. ఖాతా నంబర్లకు ఇది గొడుగు ఖాతాగా పనిచేస్తుంది, ఒకే నెంబర్ ద్వారా అన్ని సేవలను విస్తరిస్తుంది; ఈ.పిఎఫ్. చందాదారులకు ఈ-పాస్బుక్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది దీని ద్వారా పిఎఫ్. ఖాతాలోని బ్యాలెన్స్ ను ఆన్లైన్ లో తనిఖీ చేయవచ్చు; ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చందాల ఇ-కలెక్షన్, దీని ఫలితంగా యజమానులకు సమయం, శ్రమ, డబ్బు ఆదా అవుతాయి; పింఛన్ దారుల కోసం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించడానికి పింఛన్ దారులు భౌతికంగా బ్యాంకు శాఖలు లేదా పి.ఎఫ్. కార్యాలయాల్లో ఉండాలనే ఆవశ్యకతను తొలగించింది; పి.ఎఫ్. చందాదారుల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు ఆన్-లైన్ ఈ.పి.ఎఫ్.ఐ.జి.ఎం.ఎస్. పోర్టల్ ని పునరుద్ధరించారు. 2017లో యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్ (యు.ఎం.ఏ.ఎన్,జి) ప్లాట్ఫారమ్ లో ఈ.పి.ఎఫ్.ఓ. సేవలను కూడా జోడించడం జరిగింది. ఇందులో సభ్యులు తమ ఈ-పాసు పుస్తకాన్ని వీక్షించవచ్చు, వారు తమ క్లెయిమ్లను పొందుపర్చవచ్చు / ట్రాక్ చేయవచ్చు.
*****
(Release ID: 1934703)