ఆయుష్
azadi ka amrit mahotsav

ఎక్కువ మంది ప్రజలకు ఆయుష్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు జాతీయ ఆయుష్ మిషన్ ద్వారా మౌలిక సదుపాయాలు పటిష్టం చేయనున్న రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు


జాతీయ ఆయుష్ మిషన్ 2023 రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులు

Posted On: 19 MAY 2023 5:19PM by PIB Hyderabad

ఎక్కువ మంది ప్రజలకు ఆయుష్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు జాతీయ ఆయుష్ మిషన్ ద్వారా మౌలిక సదుపాయాలు పటిష్టం చేయడానికి అమలు చేయాల్సిన చర్యలను జాతీయ ఆయుష్ మిషన్ 2023 రౌండ్ టేబుల్ సమావేశంలో  రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులు చర్చించారు.రెండు రోజుల పాటు జరిగిన జాతీయ ఆయుష్ మిషన్ 2023 సదస్సులో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులు పాల్గొన్నారు.సదస్సులో కేంద్ర ఆయుష్,ఓడరేవులు, నౌకా రవాణా, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్‌తో పాటు ఉత్తరప్రదేశ్ నుంచి  శ్రీ దయా శంకర్ మిశ్రా, మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి   శ్రీ రామ్ కిషోర్ కవ్రే, జార్ఖండ్ రాష్ట్ర ప్రతినిధి శ్రీ  బన్నా గుప్తా,  మిజోరం నుంచి   డాక్టర్ ఆర్. లాల్తంగ్లియానా,అరుణాచల్ ప్రదేశ్ నుంచి శ్రీ అలో-లిబాంగ్,   అస్సాం కి చెందిన  శ్రీ కేశబ్ మహంత, నాగాలాండ్ నుంచి  శ్రీ ఎస్. పంగ్న్యు ఫోమ్, జమ్మూ  కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్  సలహాదారు శ్రీ రాజీవ్ రాయ్ భట్నాగర్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ సర్బానంద సోనోవాల్ ఆయుష్ అభివృద్ధికి చర్యలు అమలు జరగాలన్నారు.పురాతన  జ్ఞానం అయిన ఆయుష్ వైద్య విధానానికి తగిన ప్రచారం కల్పించి వైద్య విధానం ప్రజలకు చేరేలా చూడాలన్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు యోగాకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రజలకు యోగ ప్రయోజనాలు తెలిసేలా చూడడానికి ప్రచారం కల్పించి అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023లో ఎక్కువ మంది ప్రజలు పాల్గొనేలా చూడాలని శ్రీ సర్బానంద సోనోవాల్ కోరారు. 

ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్ మాట్లాడుతూ దేశంలో  ఆయుష్ ఆరోగ్య సంరక్షణ కేంద్రాల పెరిగిందన్నారు. ఈ కేంద్రాల ద్వారా ప్రజలు ఆయుష్ ఆరోగ్య సేవలు పొందుతున్నారు ఆయన తెలిపారు.ఎక్కువ మంది ప్రజలకు  సమగ్ర ఆయుష్ వైద్య సేవలు అందేలా చూసేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో ఆయుష్ ఆరోగ్య సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసిందని ఉత్తరప్రదేశ్‌ ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీ దయాశంకర్ మిశ్రా తెలిపారు. ఆయుష్ సేవలు అందించేందుకు 552 ప్రభుత్వ ఆసుపత్రులను గుర్తించి ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. 

మూలికలు, ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి తమ  ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిందని మధ్యప్రదేశ్ ఆయుష్ (ఇంచార్జి) మంత్రి రామ్ కిషోర్ కవ్రే తెలిపారు. 90% హెచ్‌డబ్ల్యుసిలను నెలకొల్పడానికి ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యంలో 90% లక్ష్యాలు సాధించామని తెలిపారు.   50% ఆసుపత్రి లక్ష్యాలను సాధించామని తెలిపిన మంత్రి  వెల్‌నెస్ సెంటర్‌లతో 5000 డిస్పెన్సరీలను నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. 

ఆయుష్ అనేది వైద్య శాస్త్రం మాత్రమే కాదని  రోజువారీ జీవన విధానంలో భాగంగా ఉంటుందని జార్ఖండ్ ఆరోగ్య మంత్రి శ్రీ బన్నా గుప్తా అన్నారు. వివిధ ఔషధ మొక్కలపై పరిశోధన చేయడానికి జార్ఖండ్‌కు పరిశోధనా కేంద్రాన్ని మంజూరు చేయాలని ఆయన కోరారు. జార్ఖండ్‌లో మెడికల్ టూరిజం అభివృద్ధికి గల అవకాశాలు పరిశీలించాలని కోరారు. 

మాదకద్రవ్యాల వినియోగదారుల కోసం ఆయుష్ పునరావాస కార్యక్రమం ప్రారంభించడానికి తమ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని అస్సాం ఆరోగ్య మంత్రి శ్రీ కేశబ్ మెహంతా తెలిపారు.200 మంది సిహెచ్ఓ ల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల  ఆరోగ్య మంత్రులు తమ రాష్ట్రాల్లో  మారుమూల ప్రాంతాల్లో హెచ్‌డబ్ల్యుసిలను స్థాపించడానికి చేస్తున్న కృషిని వివరించారు.  మానవ వనరుల అవసరాలను వారు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. 

ఈ సమావేశంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ  వైద్య రాజేష్ కోటేచా, ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి కవితా గార్గ్, జాతీయ ఆయుష్ మిషన్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కవితా గార్గ్ జాతీయ  ఆయుష్ మిషన్, నామ్ ద్వారా ఆయుష్ సేవలు అందించడానికి  అవసరమైన  మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే అవకాశాలను  కవితా గార్గ్ వివరించారు. 

***


(Release ID: 1925665)