ప్రధాన మంత్రి కార్యాలయం

అస్సాం లో రూ.3,400 కోట్లకు పైగా విలువ చేసే ప్రాజెక్టులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాన మంత్రి


గువాహతి ఎయిమ్స్, మరో మూడు మెడికల్ కాలేజీలు జాతికి అంకితం

‘ఆప్ కే ద్వార్ ఆయుష్మాన్’ ప్రచారోద్యమం ప్రారంభం

అస్సాం అడ్వాన్స్ డ్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ ఇన్ స్టిట్యూట్ కు శంకుస్థాపన

“గత 9 ఏళ్లలో ఈశాన్య భారతంలో గణనీయంగా పెరిగిన సామాజిక మౌలిక సదుపాయాలు”

“ప్రజలకోసం సేవాభావంతో పనిచేస్తున్నాం”

“ఈశాన్య భారత అభివృద్ధి ద్వారా భారత అభివృద్ధి అనే మంత్రంతో ముందుకు సాగుతున్నాం”

“ప్రభుత్వ విధానం, ఆలోచనలు, అంకితభావం ‘జాతి ప్రథమం-ప్రజలు ప్రథమం’ స్ఫూర్తితో తప్ప స్వీయ ప్రయోజనాలకోసం కావు”

“రాచరికం, ప్రాంతీయతత్వం, అవినీతి, అస్థిరత రాజకీయాలు ఆధిపత్యం చెలాయిస్తే అభివృద్ధి అసాధ్యమవుతుంది”

“మా ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు మహిళల ఆరోగ్యానికి ఎంతగానో లబ్ధి కలిగించాయి”

“21 వ శతాబ్ద అవసరాలకు తగినట్టు మా ప్రభుత్వం భారత ఆరోగ్య రంగాన్ని ఆధునీకరిస్తున్నది”

“భారత ఆరోగ్య రక్షణ వ్యవస్థకు అతిపెద్ద ప్రాతిపదిక సబ్ కా ప్రయాస్”

Posted On: 14 APR 2023 2:07PM by PIB Hyderabad

శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అస్సాంలోని గువాహతి లో అస్సాం లో రూ.3,400 కోట్లకు పైగా విలువ చేసే ప్రాజెక్టులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గువాహతి ఎయిమ్స్, మరో మూడు మెడికల్ కాలేజీలను ఈ సందర్భంగా ప్రధాని జాతికి అంకితం చేశారు. అదే విధంగా అస్సాం అడ్వాన్స్ డ్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ ఇన్ స్టిట్యూట్ కు శంకుస్థాపన చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్  ఆరోగ్య యోజన కార్డులను పంచటం ద్వారా ‘ఆప్ కే ద్వార్ ఆయుష్మాన్’ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.   

ఈ సందర్భంగా ప్రధాని సభానుద్దేశించి ప్రసంగిస్తూ,  రొంగలి బిహు శీభ సందర్భాన ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈశాన్య భారతదేశానికి మొట్ట మొదటి ఎయిమ్స్ రావటంతోబాటు అస్సాంలో కొత్తగా మూడు మెడికల్ కాలేజీలు రావటం ఈశాన్య భారతదేశంలో ఆరోగ్య మౌలిక వసతులు  బలోపేతం కావటానికి నిదర్శనమన్నారు. గువాహతి ఐఐటీ తోకలిసి అత్యాధునిక పరిశోధనలు జరిపేందుకు వీలుగా 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన చేశామన్నారు. అస్సాం ప్రజలందరికీ ఆయుష్మాన్ కార్డుల పంపిణీ వేగవంతం చేస్తున్నామని గుర్తు చేశారు. ఈ రోజు చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల వలన అస్సాం తోబాటు పొరుగు రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, మిజోరాం కూడా లబ్ధిపొందుతాయన్నారు.   

గడిచిన 8-9 సంవత్సరాలలో రోడ్డు, రైలు, వాయు మార్గ మౌలిక సదుపాయాలు పెంచటంతో  ఈశాన్య భారతదేశంలో అనుసంధానత పెరగటాన్ని ప్రధాని ప్రస్తావించారు.  కనీవినీ ఎరుగని రీతిలో విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపడటం వల్ల ఈ ప్రాంతంలో భౌతిక మౌలిక వసతులతోబాటు సామాజిక మౌలిక వసతులు కూడా బాగా పెరిగాయన్నారు. రవాణా సదుపాయాలు పెరగటం, వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావటం వలన అందరూ ఈ సౌకర్యాలను వినియోగించుకోగలుగుతున్నారన్నారు.

గతంలో పాలకులు చిన్న చిన్న పనులకు కూడా ఘనత తమదేనని చాటుకుంటూ నిస్సహాయులైన  ప్రజలను మోసం చేశారని చెబుతూ ప్రజలు దైవంతో సమానమని అభివర్ణించారు. ప్రధాన భూమికి దూరంగా ఉన్న ఈశాన్య భారతదేశాన్ని గత పాలకులు విస్మరించి దూరంగా పెట్టారని విమర్శించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం సేవాభావంతో ముందుకు రావటం వలన ఈశాన్య భారతదేశానికి దగ్గరైందని చెప్పారు. సేవ చేయాలనుకున్నప్పుడు దూరం ఒక సమస్య కాబోదన్నారు.

ఈశాన్య ప్రాంత ప్రజలు అభివృద్ధిని అందుకుంటూ ముందుకు సాగటం సంతోషంగా ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు. “ఈశాన్య భారత అభివృద్ధి ద్వారా భారత అభివృద్ధి అనే మంత్రంతో ముందుకు సాగుతున్నాం”  అన్నారు. ఈ అభివృద్ధి ఉద్యమంలో కేంద్ర ప్రభుత్వం ఒక మిత్రునిగా, ఒక సేవకునిగా వ్యవహరిస్తోందని ప్రధాని అభిప్రాయపడ్డారు.

ఈశాన్య ప్రాంతం సుదీర్ఘ కాలంగా ఎదుర్కుంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ, “రాచరికం, ప్రాంతీయతత్వం, అవినీతి, అస్థిరత రాజకీయాలు ఆధిపత్యం చెలాయిస్తే అభివృద్ధి అసాధ్యమవుతుంది” అన్నారు. ఆరోగ్య రక్షణ రంగంలోనూ అదే జరిగిందన్నారు.50 లలో ఎయిమ్స్ ఏర్పాటు కాగా,  దేశంలోని ఇతర ప్రాంతాలలో ఏర్పాటు చేయటానికి ఎలాంటి కృషీ జరగకపోవటాన్ని ప్రధాని గుర్తు చేశారు. ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పే హయాంలో కొంత కృషి జరిగినప్పటికీ, 2014 తరువాతనే ఈ దిశలో పనులు ముందుకు సాగాయన్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం 15 ఎయిమ్స్ మీద పనిచేయటం మొదలైందన్నారు. వాటిలో చాలా చోట్ల కోర్సులు కూడా మొదలయ్యాయన్నారు. ప్రభుత్వం తన లక్ష్యాలను నెరవేర్చే క్రమంలోనే గువాహతి ఎయిమ్స్ కూడా ప్రారంభించిందని చెప్పారు.

గత ప్రభుత్వ్యయాలు అనుసరించిన విధానాల వలన దేశంలో  డాక్టర్ల కొరత ఏర్పడిందని, దానివలన నాణ్యమైన వైద్య సౌకర్యాల అందుబాటుకు అవరోధం కలిగిందని అన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో వైద్య రంగ మౌలిక సదుపాయాలకు, వైద్య నిపుణుల సంఖ్య పెంచటానికి  ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిచ్చిందన్నారు. 2014 కు ముందు కేవలం 150 మెడికల్ కాలేజీలు ఉండగా గత 9 ఏళ్లలో దాదాపు 300 మెడికల్ కాలేజీలు పనిచేయటం మొదలైందన్నారు. అదే విధంగా ఎంబీబీఎస్ సీట్లు కూడా రెట్టింపై లక్షకు చేరాయని, పీజీ సీట్లు 110 శాతం పెరిగాయని  గుర్తు చేశారు. దేశంలో వైద్య విద్యను విస్తరించటానికి నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పాటు చేయటం ద్వారా రిజర్వేషన్లు కూడా అమలు చేసి వెనుకబడిన కుటుంబాలవారు కూడా డాక్టర్లు కావాలన్న కలను సాకారం చేసుకోగలిగారన్నారు. ఈ ఏడాది బడ్జెట్ లో భాగంగా 150 నర్సింగ్ కాలేజీలు ప్రకటించామన్నారు. ఈశాన్య భారత దేశంలో గత 9 ఏళ్లలో మెడికల్ కాలేజీలు, సీట్లు రెట్టింపయ్యాయని చెప్పారు. మరెన్నో  కాలేజీల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.

కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉండటం వల్లనే వైద్య, ఆరోగ్య రక్షణ రంగాలలో మెరుగుదల కనబడుతోందన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానం, ఆలోచనలు, అంకితభావం ‘జాతి ప్రథమం-ప్రజలు ప్రథమం’ స్ఫూర్తితో తప్ప స్వీయ ప్రయోజనాలకోసం కావని ప్రధాని స్పష్టం చేశారు. అందుకే, ప్రభుత్వం దృష్టి  వోట్ బాంక్ మీద లేదని, ప్రజల సమస్యలు తగ్గించటం మీదనేనని చెప్పారు.   ఆర్థిక వనరులు లేక చికిత్స చేయించుకోలేని నిరూపేదల గురించి తెలుసునని చెబుతూ, వారికోసం ఆయుష్మాన్ యోజన ఉందని గుర్తు చేశారు. దీనివలన రూ. 5 లక్షల వరకూ ఉచిత వైద్యం అందుతుందన్నారు. అదే విధంగా 9,000 జన్ ఔషధీ కేంద్రాలు కూడా అందుబాటు ధరలో మందులు అందిస్తున్నాయని గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో ఉచిత డయాలసిస్ సెంటర్ ఏర్పాటుతోబాటు స్టెంట్ లు, మోకాలిచిప్ప మార్పిడిలో వాడే ఇంప్లాంట్ల ధరల మీద పరిమితి విధించటాన్ని కూడా ప్రధాని గుర్తు చేశారు. త్వరగా రోగాన్ని నిర్థారించేందుకు, మెరుగైన చికిత్స అందించేందుకు 1.5 లక్షల వెల్  నెస్ సెంటర్లు కృషిచేస్తున్నాయి. దేశంలో పేద ప్రజల ఆరోగ్య సవాళ్లను ఎదుర్కునే క్రమంలోనే ‘ప్రధానమంత్రి క్షయ ముక్త భారత్ అభియాన్’ నడుస్తోంది. పరిశుభ్రత, యోగా, ఆయుర్వేదం ద్వారా ముందస్తు ఆరోగ్య రక్షణను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.  

ప్రభుత్వ పథకాల విజయాన్ని ప్రస్తావిస్తూ, ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కటం తన అదృష్టమని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆయుష్మాన్ భారత్, పిఎం జన్ ఆరోగ్య యోజన ను ఆయన ఉదాహరించారు. వీటివలన ప్రజలకు ధైర్యం కలగటంతోబాటు  వారు రూ. 80,000 కోట్ల మేరకు ఆదాయ చేసుకోగలిగారన్నారు.  జన్ ఔషధీ కేంద్రాల వలన మధ్య తరగతి ప్రజలు దాదాపు 20 వేల కోట్లు ఆదాయ చేసుకున్నారని కూడా ప్రధాని చెప్పారు.స్టెంట్లు, మోకాలి చిప్ప మార్పిడి పరికరాల ధరలు నామమాత్రంగా ఉండేట్టు చేయటం వలన రూ.13 వేల కోట్లు ఆదాయ అవుతున్నాయన్నారు. ఉచిత డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుతో మూత్ర పిండాల వ్యాధి పీడితులకు 500 కోట్ల మేరకు ఆదాయ అయిందని కూడా ప్రధాని వెల్లడించారు. అస్సాంలో కోటి ఆయుష్మాన్  భారత్  కార్డుల పంపిణీ మొదలైందని, ఇది కూడా మరింత సొమ్ము ఆదా చేస్తుందని అన్నారు.

ఆరోగ్య రంగంలో తీసుకున్న చర్యల ద్వారా మహిళాసంక్షేమానికి ప్రభుత్వం చేసిన కృషిని ప్రధాని వివరించారు. మహిళలు తమ ఆరోగ్యం కోసం ఖర్చు చేయటానికి వెనకాడుతూ వస్తారని గుర్తు చేస్తూ, మరుగుదొడ్ల అవసరం మీద చేసిన ప్రచారం వలన అనేక రోగాల బారినుంచి కాపాడినట్టయిందన్నారు. ఉజ్జ్వల కనెక్షన్ల వలన పొగ సంబంధ వ్యాధుల నుంచి బైటపడ్డారని ప్రధాని అభిప్రాయపడ్డారు. జల్ జీవన్ మిషన్ వలన నీటి సంబంధ వ్యాధుల నుంచి, మిషన్ వాక్సినేషన్ వలన తీవ్ర మైన వ్యాధులనుంచి విముక్తి లభించిందని ప్రధాని గుర్తు చేశారు. ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి మాతృ వందన పథకం, నేషనల్ న్యూట్రిషన్ మిషన్ వలన ఆరోగ్యాలు మెరుగుపడ్డాయన్నారు.

21 వ శతాబ్ద అవసరాలకు తగినట్టు ప్రభుత్వం భారత ఆరోగ్య రంగాన్ని ఆధునీకరిస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్, డిజిటల్ హెల్త్ ఐడీలను ప్రస్తావిస్తూ ప్రజల ఆరోగ్య రికార్డులు ఒక్క క్లిక్ లో అందుబాటులో ఉంచటం ద్వారా మెరుగైన ఆస్పత్రి సేవలకు దోహదం చేస్తున్నామన్నారు. ఇప్పటిదాకా 38 కోట్ల హెల్త్ కార్డుల పంపిణీ జరిగిందని. ఈ-సంజీవని ద్వారా 10 కోట్ల సంప్రదింపులు జరిగాయని చెప్పారు.  

భారత ఆరోగ్య రక్షణ వ్యవస్థలో మార్పుకు కు అతిపెద్ద  ప్రాతిపదిక  సబ్ కా ప్రయాస్ (అందరి  కృషి) అని చెబుతూ, కరోనా సంక్షోభ  సమయంలో అది ఋజువైందన్నారు. భారతదేశంలో పెద్ద ఎత్తున, అత్యంత వేగంగా , సమర్థ వంతంగా సాగిన టీకాల కార్యక్రమాన్ని యావత్ ప్రపంచం అభినందించటాన్ని ప్రధాని ప్రస్తావించారు. మారుమూల ప్రాంతాలకు సైతం టీకాల కార్యక్రమం చొచ్చుకు పోవటానికి ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, స్వదేశీ టీకాలు తయారు చేసిన ఫార్మా రంగం చేసిన కృషిని అభినందించారు. ఇలాంటి మహా యజ్ఞం పూర్తి కావటానికి సబ్ కా ప్రయాస్ (అందరి కృషి) దోహదం చేసిందన్నారు. అందరూ ఈ స్ఫూర్తితో ముందుకు నడవాలని , తద్వారా ఆరోగ్యవంతమైన, సుసంపన్నమైన  భారత్ ను కొత్త శిఖరాలకు చేర్చాలని పిలుపునిస్తూ ప్రధాని తన ప్రసంగం ముగించారు.

అస్సాం గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా, ముఖ్యమంత్రి శ్రీ హిమంత  బిశ్వాస్ శర్మ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ పవార్, అస్సాం మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

గువాహతిలోని ఎయిమ్స్  పనిచేయటం ప్రారంభం కావటం అస్సాం చరిత్రలోనే కాదు, యావత్ ఈశాన్య ప్రాంతానికి ఒక  మైలురాయి అవుతుంది. దేశ వ్యాప్తంగా ఆరోగ్య రంగ మౌలిక వసతులు పటిష్ఠ పరచాలన్న ప్రధాని లక్ష్యంలో ఇది భాగం కూడా. 2017 మే లో ప్రధాని దీనికి శంకుస్థాపన చేశారు. 1120 కోట్లకు పైగా వ్యయంతో  నిర్మించిన ఈ అత్యాధునిక ఆస్పత్రిలో 30 ఆయుష్ పడకలు సహా మొత్తం 750 పడకలున్నాయి. ఏటా 100 ఎంబీబీఎస్ సీట్లు కూడా ఇచ్చే వీలుంటుంది.

ప్రధాని జాతికి అంకితం చేసిన మూడు మెడికల్  కాలేజీలలో నల్బరి లోని  రూ.615 కోట్లతో నిర్మించిన  నల్బరి మెడికల్ కాలేజ్, నాగావ్ లోని రూ.600 కోట్లతో నిర్మించిన  నాగావ్ మెడికల్ కాలేజ్, కోక్రజార్ లోని రూ. 535 కోట్లతో నిర్మించిన   కోక్రజార్ మెడికల్ కాలేజ్ ఉన్నాయి. ఒక్కో ఆస్పత్రిలో 500 పడకలతో అత్యవసర సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒక్కో మెడికల్ కాలేజ్ లో ఏటా 100 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను చేర్చుకునే అవకాశముంది.

ప్రధాని లాంఛనంగా ప్రారంభించిన ‘ఆప్ కే ద్వార్ ఆయుష్మాన్’  ప్రతి ఒక్కరినీ  సంక్షేమ కార్యక్రమాలు చేరాలన్న ఆకాంక్షలో భాగం.  దీనివలన సంక్షేమ కార్యక్రమాలు 100 శాతం ప్రజలకు చేరినట్టవుతుంది. ఈ సందర్భంగా ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన  కార్డుల పంపిణీ జరిగింది. అస్సాం అడ్వాన్స్ డ్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ ఇన్ స్టిట్యూట్ ప్రధాని ఆత్మ నిర్భర్ భారత్, మేకిన్  ఇండియా దార్శనికతకు నిదర్శనం. టెక్నాలజీని ఆరోగ్య రంగంలో ఎక్కువగా వాడుకోవటం కూడా కనిపిస్తోందస్తన్నారు. దీన్ని 546 కోట్లతో నిర్మించ తలపెట్టారు.

 

 

 

***

DS/TS



(Release ID: 1916837) Visitor Counter : 142