శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఈశాన్య భారతం అంకుర సంస్థలకు తన నిగూఢ సామర్థ్యాన్ని అందిస్తుంది: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఉద్ఘాటన
Posted On:
28 MAR 2023 4:41PM by PIB Hyderabad
దేశంలోని అంకుర సంస్థలకు ఈశాన్య భారత ప్రాంతం తన నిగూఢ సామర్థ్యాన్ని అందిస్తుందని కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ, భూవిజ్ఞాన శాఖ, ప్రధాని కార్యాలయ, ప్రజా ఫిర్యాదులు-పెన్షన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల (స్వతంత్ర బాధ్యతగల) సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. “ఈశాన్య భారతంలో అంకుర సంస్థలు-సుస్థిరత-నవ్యావిష్కరణ-వ్యవస్థాపన” అంశంపై ‘నార్త్ ఈస్ట్ రీజినల్ రీసెర్చ్ అండ్ రిసోర్స్ సెంటర్ మిరాండా హౌస్’ నిర్వహించిన రెండు రోజుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈశాన్య భారతం సహజ సిద్ధంగానే ఆవిష్కరణల నిలయమని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. ఈశాన్యంలో అంకుర సంస్కృతికి మహిళలు సదా ముందంజలో ఉంటారని మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అంకుర పర్యావరణాన్ని వ్యవస్థీకృతం చేయడంతో వారు మరింత ఉత్సాహంతో మార్గనిర్దేశం చేస్తున్నారని తెలిపారు.
ఈశాన్యం, అంకుర సంస్థలు, మహిళలకు కేంద్ర ప్రభుత్వం సదా ప్రాధాన్యమిస్తుందని మంత్రి అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో దేశంలోని ఒక ప్రాంతంగా ఈశాన్య భారతం నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్నారు. అయితే, ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈశాన్యాన్ని ఇతర ప్రాంతాలతో సమాన స్థాయికి చేర్చిందన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట బురుజుల నుంచి ప్రసంగించిన సమయంలో “స్టార్టప్ ఇండియా-స్టాండప్ ఇండియా” పిలుపుతో ప్రధాని నరేంద్ర మోదీ అంకుర వ్యవస్థకు ప్రోత్సాహం ఇచ్చారని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తుచేశారు. అందుకు అనుగుణంగా భారతదేశంలో అంకుర సంస్థలు దినదినాభివృద్ధి చెందాయన్నారు. ఈ మేరకు 2014 నుంచి 2022 మధ్య 300-400 స్థాయి నుంచి 8 ఏళ్లలో 90,000కుపైగా పెరిగాయన్నారు. ఇందులో యూనికార్న్ సంస్థల సంఖ్య 100కుపైగా ఉన్నాయని, వీటిలో 36 సంస్థలకు మహిళలు వ్యవస్థాపకులుగా లేదా సహ వ్యవస్థాపకులుగా ఉన్నారని వివరించారు. ఈ విధంగా మహిళలు భాగస్వాముల స్థాయినుంచి నాయకత్వ పాత్రలకు మారారని పేర్కొన్నారు.
భారత అంకుర పర్యావరణ వ్యవస్థ ప్రపంచంలో నేడు 3వ స్థానంలో ఉందని మంత్రి అన్నారు. అలాగే ప్రపంచ ఆవిష్కరణ సూచీ (జీఐఐ)లో భారతదేశం 50 అగ్రదేశాల జాబితాలో స్థానం పొందిందన్నారు. అంతేగాక ప్రపంచంలో అత్యంత అంకుర-హిత దేశాలలో ఒకటి (ఆసియాలో అగ్రగామిగా) ఉందన్నారు. ఇటీవలి కాలంలో అంకుర పర్యావరణ వ్యవస్థలోని సంపోషక, వేగవర్ధక, మూలధన భాగస్వామ్య సంస్థలు ఈశాన్య ప్రాంతంలో భారీగా అంకుర సంస్థల ఏర్పాటుకు దోహదం చేసినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. మరోవైపు 2014-15 నుంచి ఈ ప్రాంత ప్రగతి దిశగా కేంద్రం అనేక ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా అనుసంధానం మెరుగుద్వారా ప్రగతిని వేగరిపరచేందుకు కృషి చేసిందని మంత్రి అన్నారు. మినహాయింపు లేని కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు తమ స్థూల బడ్జెట్ కేటాయింపులలో కనీసం 10 శాతం కేంద్ర రంగ, కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం ఈ ప్రాంతంలో ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు.
ప్రధాని మోదీ 2014 నుంచి ఈశాన్య ప్రాంత పరివర్తనకు శ్రీకారం చుట్టారని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తుచేశారు. తద్వారా నాటికి-నేటికి మధ్య, ఈశాన్యంతో ఢిల్లీకిగల వ్యత్యాసాలను ఆయన తొలగించారన్నారు. ఈశాన్య స్థానిక సంస్కృతులు, భాషలను ఎవరూ పట్టించుకోలేదని ఆయన మాత్రం వీటికి ఎనలేని ప్రాముఖ్యం ఇచ్చారని తెలిపారు. ఈశాన్య ప్రాంత మహిళలు తమ సంప్రదాయంలో భాగంగా ఇప్పటికే సాధికారతసహా వృత్తిపరంగా మరింత చురుగ్గా ఉన్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, కిరణ్ పథకం, ‘క్యూరీ’ కార్యక్రమం, విజ్ఞాన జ్యోతి పథకం, ఫెలోషిప్ సహా బాలికలకు సాధికారత కల్పన వంటి ఇటీవలి పలు కార్యక్రమాలను ఆయన ఏకరవు పెట్టారు.
రాబోయే 25 ఏళ్ల ‘అమృత కాలం’లో ఈశాన్య, హిమాలయ ప్రాంతాలతోపాటు సముద్ర ఆధారిత వనరులద్వారా అపార అవకాశాలు అందివస్తాయని మంత్రి పేర్కొన్నారు. అలాగే “ఈ సదస్సులో చాలామంది యువ మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొని, తమ ఆలోచనలు- అనుభవాలను వివరించారు. మిరాండా మహిళా కళాశాల ఇందుకు వేదిక కావడం విశేషం. ఏదేమైనా అంతరాలను తగ్గించడమే లక్ష్యం… ఆ మేరకు ప్రభుత్వం తరఫున మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా మేం సదా అండగా ఉంటాం” అని ఆయన హామీ ఇచ్చారు.
*****
(Release ID: 1911649)
Visitor Counter : 107