వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ప్రజా పంపణీ వ్యవస్థ కింద భారతదేశంలో 19.79 కోట్ల రేషన్ కార్డుల డిజిటలీకరణ


ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ పరికరాల ఏర్పాటు ద్వారా చౌక ధరల దుకాణాల్లో (ఎఫ్‌పీఎస్‌లు) 100% ఆటోమేషన్

లక్ష్యిత ప్రజా పంపణీ వ్యవస్థ ద్వారా బలవర్థక బియ్యాన్ని పంపిణీ చేస్తున్న 27 రాష్ట్రాలు/యూటీలు

Posted On: 24 MAR 2023 5:45PM by PIB Hyderabad

జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద ఇప్పటి వరకు జారీ చేసిన మొత్తం 19.79 కోట్ల రేషన్ కార్డులను ప్రజా పంపిణీ వ్యవస్థ సంస్కరణల ప్రకారం డిజిటలీకరించారు. అన్ని రాష్ట్రాలు/యూటీలు పారదర్శకత పోర్టల్/పీడీఎస్‌ పోర్టల్‌ను కూడా అభివృద్ధి చేశాయి.

ప్రజా పంపణీ వ్యవస్థ (పీడీఎస్‌) సంస్కరణల కింద ఎఫ్‌పీఎస్‌ల్లో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈపోస్‌) పరికరాలను ఏర్పాటు చేయడం ద్వారా, దాదాపు 100% (5.34 లక్షల ఎఫ్‌పీఎస్‌ల్లో దాదాపు 5.33 లక్షలు) చౌక ధరల దుకాణాల (ఎఫ్‌పీఎస్‌లు) ఆటోమేషన్ సాధించడం జరిగింది. లబ్ధిదారుల వేలిముద్ర ప్రమాణీకరణ, లావాదేవీ సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో సేకరించడం కోసం ఈ ఆటోమేషన్ జరిగింది. దేశవ్యాప్తంగా కేటాయించిన మొత్తం ఆహార ధాన్యాల్లో దాదాపు 95%ను, లబ్ధిదారుల వేలిముద్రలు/ఆధార్ ప్రమాణీకరణ తర్వాత ఈపోస్‌ పరికరాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతోంది.

జాతీయ ఆహార భద్రత చట్టం కింద లక్ష్యిత ప్రజా పంపిణీ వ్యవస్థ (టీపీడీఎస్‌) మొత్తానికి, భారత ప్రభుత్వ ఇతర సంక్షేమ పథకాల (ఓడబ్ల్యూఎస్‌) ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2024 సంవత్సరం నాటికి దశల వారీగా బలవర్థక బియ్యాన్ని సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా దశల వారీగా ఈ కార్యక్రమం అమలు ప్రణాళిక ఈ కింది విధంగా ఉంటుంది:

దశ-I: మార్చి 2022 నాటికి భారతదేశం మొత్తానికి ఐసీడీఎస్‌, పీఎం-పోషణ్‌ వర్తింపు

దశ-II: దశ-Iతో పాటు, 2023 నాటికి, కుంగుబాటు సమాచారంపై (మొత్తం 291 జిల్లాలు) అన్ని ఆశావహ, అధిక భారం ఉన్న జిల్లాల్లో టీపీడీఎస్‌, ఓడబ్ల్యూఎస్‌

దశ-III:  దశ-IIతో పాటు, మార్చి 2024 నాటికి దేశంలోని మిగిలిన జిల్లాలకు వర్తింపు

ప్రస్తుతం 27 రాష్ట్రాలు/యూటీలు టీపీడీఎస్‌ ద్వారా బలవర్ధక బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాయి. 05.03.2023 నాటికి, దశ II కింద, టీపీడీఎస్‌ ద్వారా సుమారు 95.72 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) బలవర్ధక బియ్యం పంపిణీ జరిగింది.

జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నిజమైన లబ్ధిదారులకు ఆధార్ ప్రమాణీకరణ ద్వారా ఆహారధాన్యాల పంపిణీ కోసం దాదాపు 100% చౌక ధరల దుకాణాలు ఈపోస్‌ పరికరాలను కలిగి ఉన్నాయి. అమలులో ఎలాంటి సమస్య ఎదురు కాలేదు.

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీమతి సాధ్వి నిరంజన్ జ్యోతి ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

*****



(Release ID: 1910508) Visitor Counter : 110


Read this release in: English , Urdu , Odia , Tamil