వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి, వినియోగాన్ని పెంపొందించే వ్యూహాలను రూపొందించడానికి వీలుగా ప్రముఖ మిల్లెట్ (శ్రీ అన్న) దేశాల మంత్రుల రౌండ్ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించిన - భారతదేశం


ఢిల్లీలో జరిగిన సమావేశానికి హాజరైన - గయానా, మారిషస్, శ్రీలంక, సూడాన్, సురినామ్, జాంబియా దేశాల మంత్రులతో పాటు గాంబియా, మాల్దీవులు, నైజీరియా దేశాలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధులు


చిరు ధాన్యాలు ఉత్పత్తి చేసే దేశాలు పరస్పరం మరింత సహకరించుకోవాలని కోరిన - కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తోమర్


చిరు ధాన్యాల అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న భారతదేశం ప్రపంచ అవసరాలను తీర్చడానికి చిరుధాన్యాల గ్లోబల్ హబ్‌ గా ఉద్భవించటానికి సిద్ధంగా ఉంది


ఈ సమావేశానికి హాజరైన మంత్రులు తమ దేశాల్లో మిల్లెట్ ఉత్పత్తి, వినియోగానికి సంబంధించిన అనుభవాలు పంచుకున్నారు, ప్రపంచ ఆహార, పోషకాహార భద్రతకు పరస్పరం సహకరించుకోవాలని ప్రతిపాదించారు.

Posted On: 18 MAR 2023 5:42PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన గ్లోబల్ మిల్లెట్స్ (శ్రీ అన్న) సదస్సు ప్రారంభ సమావేశం అనంతరం మిల్లెట్ (శ్రీ అన్న) దేశాల మంత్రుల రౌండ్ టేబుల్‌ సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో గయానా, మారిషస్, శ్రీలంక, సూడాన్, సురినామ్, జాంబియా దేశాలకు చెందిన మంత్రులతో పాటు, గాంబియా, మాల్దీవుల వ్యవసాయ శాఖ శాశ్వత కార్యదర్శి, నైజీరియాలోని మిల్లెట్స్ ప్రోత్సాహక సంస్థ డైరెక్టర్ జనరల్ పాల్గొన్నారు.  సమావేశానికి హాజరైన ప్రతినిధుల బృందానికి  భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి స్వాగతం పలికారు.

2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం (ఐ.వై.ఎం) గా జరుపుకుంటున్న సందర్భంగా ఢిల్లీలో గ్లోబల్ మిల్లెట్స్ (శ్రీ అన్న) సదస్సు రూపంలో భారతదేశం ఈ రోజు మొదటి భారీ ప్రపంచ స్థాయి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.   భారతదేశ చొరవతో 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన ఐక్యరాజ్య సమితి లక్ష్యాలలో ఆహార భద్రత, పోషకాహారం కోసం శ్రీ అన్న (మిల్లెట్స్) గురించి అవగాహన పెంపొందించడం, పరిశోధన, అభివృద్ధి, విస్తరణలో పెట్టుబడులను పెంపొందించడం, ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యతను మెరుగు పరచడానికి భాగస్వాములను ప్రేరేపించడం మొదలైనవి ఉన్నాయి.  ప్రపంచ ఆహార, పోషకాహార భద్రతకు భరోసా కోసం మిల్లెట్లను ప్రోత్సహించడంలో ప్రధాన మిల్లెట్ ఉత్పత్తి చేసే దేశాలు ప్రధాన పాత్ర పోషించాలి.

ఈ రోజు ముందుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ,  ఈ గ్లోబల్ మిల్లెట్ సదస్సును, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్‌, కేంద్ర మంత్రులు శ్రీ పీయూష్ గోయల్, శ్రీ మన్సుఖ్ మాండవీయ, సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి సమక్షంలో ప్రారంభించారు.  ఇతర దేశాలకు చెందిన పలువురు మంత్రులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, తమ దేశాల తరపున సందేశాలు ఇచ్చారు.  ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఐ.వై.ఎం.-2023 పై రూపొందించిన ఒక స్మారక స్టాంప్ ను, ఒక నాణేన్ని ప్రధానమంత్రి ఆవిష్కరించారు.  అతను మిల్లెట్స్ (శ్రీ అన్న) ప్రమాణాలపై ఒక పుస్తకాన్ని కూడా ప్రధానమంత్రి డిజిటల్‌ గా ప్రారంభించారు.  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్‌ - ఐ.సి.ఏ.ఆర్.- సంస్థను గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌ గా కూడా - ప్రధానమంత్రి మోదీ, ఈ సందర్భంగా ప్రకటించారు.

మంత్రుల స్థాయి రౌండ్ టేబుల్ ప్రారంభ సమావేశంలో శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా, రెండవ అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న భారతదేశం శ్రీ అన్న ప్రచారంలో నిర్వహిస్తున్న పాత్రను ప్రముఖంగా వివరించారు.   గత ఐదు సంవత్సరాలుగా, భారతదేశం 13.71 నుండి 18.02 మిలియన్ టన్నుల మేర చిరుధాన్యాలను ఉత్పత్తి చేస్తోంది.  చిరు ధాన్యాలను ప్రోత్సహించి, చిరుధాన్యాలకు వస్తున్న అదనపు డిమాండును చేరుకోడానికి, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ (డి.ఏ.&ఎఫ్.డబ్ల్యూ) జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్.ఎఫ్.ఎస్.ఎం) క్రింద 2018-19 నుండి 14 రాష్ట్రాల్లోని 212 జిల్లాల్లో పోషక-తృణధాన్యాల (మిల్లెట్స్) సబ్-మిషన్‌ ను అమలు చేస్తోంది.  భారతదేశం 2022-23 ఎగుమతి సంవత్సరంలో (ఏప్రిల్ నుండి నవంబర్ వరకు) 365.85 కోట్ల రూపాయల విలువైన 1,04,146 మెట్రిక్ టన్నుల చిరుధాన్యాలను ఎగుమతి చేసింది.  అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం వేడుకల అనంతరం ఈ ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. 

ఆహారం, సంస్కృతి, సంప్రదాయాల రూపంలో ప్రాచీన పద్ధతుల విలువలను గుర్తించడంలో భారతదేశం ఎల్లప్పుడూ అగ్రగామిగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి పేర్కొన్నారు.   మన సంస్కృతి లాగానే, తృణధాన్యాలలో కూడా, జొన్నలు, సజ్జలు, రాగులు, సామలు, ఊదలు, అరికెలు, కొర్రలు, అండుకొర్రలు, ఒరిగలు వంటి అనేక రకాలు ఉన్నాయి.  శ్రీ అన్న లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి.  మిల్లెట్స్ లో ఒకటి కాదు, అనేక ప్రయోజనాలు ఉన్నాయి.  ఊబకాయాన్ని తగ్గించడంతో పాటు మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.  ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలతో పాటు, అధిక జనాభా కలిగిన దేశాలలో పోషకాహార లోపం ఇప్పటికీ మానవ ఆరోగ్యానికి పెనుముప్పుగా ఉంది.  పోషకాహార లోపంతో పోరాడే వారికి కూడా మిల్లెట్లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి, ఎందుకంటే అవి శక్తితో పాటు ప్రోటీన్‌ తో నిండి ఉంటాయి.

నేడు భారతదేశంలో మిల్లెట్స్ ప్రోత్సహించడానికి చాలా కృషి జరుగుతోంది.  ఉత్పత్తిలో పరిశోధన, ఆవిష్కరణలపై దృష్టి సారించడంతో పాటు, ఎఫ్.పి.ఓ. వంటి రైతు సంఘాలను ప్రోత్సాహించడం జరుగుతోంది, తద్వారా సేకరణ, ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ లను పెంచవచ్చు.  ప్రభుత్వ సహకారంతో మిల్లెట్స్ లో అనేక అంకుర సంస్థలను నిర్వహించడం పట్ల శ్రీ తోమర్ సంతోషం వ్యక్తం చేశారు.  వీరిలో కొందరు మిల్లెట్ కుకీలను తయారు చేస్తుంటే, కొందరు మిల్లెట్ పాన్‌ కేక్‌ లు, దోసలను కూడా తయారు చేస్తున్నారు.  కొన్ని మిల్లెట్ ఎనర్జీ బార్‌ లు, మిల్లెట్ బ్రేక్‌ఫాస్ట్‌ లు తయారు చేస్తున్నాయి.  ప్రపంచ ఆహార, పోషకాహార భద్రత, రైతుల శ్రేయస్సు, మాతృభూమి పునరుజ్జీవనాన్ని నిర్ధారించడానికి 'మైటీ మిల్లెట్స్' భవిష్యత్ ప్రపంచానికి పరిష్కారం.

మరుగున పడి, మరిచిపోయిన ఈ సూపర్ ధాన్యాన్ని గుర్తించాలని శ్రీ తోమర్ ప్రపంచ నాయకులను కోరారు.  ఐ.వై.ఎం-2023 ని సాగుదారు, వినియోగదారు, వాతావరణం యొక్క మొత్తం ప్రయోజనం కోసం దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని, భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది.  ప్రపంచ ఆహార మంత్రులతో చాలా ఉపయోగకరమైన పరస్పర చర్యల కోసం ఎదురు చూస్తున్నట్లు శ్రీ తోమర్ చెప్పారు.  ప్రధాన మిల్లెట్స్ ఉత్పత్తి చేసే దేశాల మధ్య మరింత సన్నిహిత సంబంధాలను తీసుకురావడానికి, ఇప్పుడు పంచుకున్న ఈ అనుభవాలు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మిల్లెట్‌ల ఉత్పత్తి, వినియోగం, బ్రాండింగ్‌ ను ప్రోత్సహించడంలో తమ దేశాల అనుభవాలను ప్రధాన మిల్లెట్ ఉత్పత్తి దేశాల నుండి వచ్చిన మంత్రులు పరస్పరం తెలియజేసుకున్నారు.  ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్ల ఉత్పత్తి, వినియోగం, విలువ, ప్రాసెసింగ్ ను పెంపొందించడానికి చాలా చేయాల్సి ఉంది.  ప్రపంచ ఆహార ధాన్యాల పట్టిక లో మిల్లెట్ల ను తీసుకురావడంలో భారతదేశం పోషిస్తున్న ప్రధాన పాత్రను నాయకులందరూ ప్రశంసించారు, భారత దేశ సాంకేతిక మద్దతు కోసం ఎదురు చూస్తున్నారు.  వీరంతా ప్రధాన మిల్లెట్‌ లను ఉత్పత్తి చేసే దేశాల మధ్య సన్నిహిత సంబంధానికి మొగ్గు చూపారు.  మెరుగైన మిల్లెట్ రకాలకు చెందిన మంచి విత్తనాలను అందించాలని, చిన్న తరహా యాంత్రీకరణ, సామర్థ్యాన్ని పెంపొందించడంలో భారతదేశం సహాయం చేయాలని, అన్ని దేశాలు కోరాయి. 

ప్రజలను గోధుమల వ్యసనం నుండి విముక్తి చేసి, వారి దేశాల్లో దేశీయ మిల్లెట్ పంటలను ప్రోత్సహించాలని ఆయా దేశాల మంత్రులందరూ తీర్మానించారు.  చిరుధాన్యాలను ప్రాధాన్యతా పంటలుగా ప్రకటించాలని, అంతర్జాతీయ సమావేశాలన్నింటిలో ఎజెండా పెట్టుకోవాలని వారు సూచించారు.  అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం ద్వారా ఏర్పడిన అవగాహన కారణంగా గయానా వంటి సాంప్రదాయ చిరుధాన్యాలను సాగు చేయని కొన్ని దేశాలు మిల్లెట్ సాగుకు మారాయి.  ఆయా దేశాలకు అవసరమైన పూర్తి విజ్ఞానం, సాంకేతికత, సామర్థ్య నిర్మాణాన్ని అందిస్తామని భారతదేశం హామీ ఇచ్చింది.

ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ తో పాటు, భారత వ్యవసాయ పరిశోధనా మండలి కి చెందిన సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.  వివిధ మిల్లెట్ ఉత్పత్తి దేశాలకు చెందిన మంత్రులు, ఇతర ప్రముఖులకు సంయుక్త కార్యదర్శి (ఐ/సి) ధన్యవాదాలు తెలియజేశారు. 

 

 

*****



(Release ID: 1908621) Visitor Counter : 140