హోం మంత్రిత్వ శాఖ

హైదరాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ 74 ఆర్ఆర్ ఐపీఎస్ బ్యాచ్ స్నాతకోత్సవంలో ప్రసంగించిన కేంద్ర హోం మంత్రి, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


దేశ అంతర్గత భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన 36,000 మంది అమరులైన పోలీసులకు నివాళులు అర్పించిన శ్రీ అమిత్ షా

ఐపీఎస్ లో చేరిన 74 ఆర్ఆర్ ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్ ట్రైనీలకు అమృత్ కాల్ బ్యాచ్ గా నామకరణమ్ చేసిన శ్రీ షా
ఫెడరల్ రాజ్యాంగం కింద భారతదేశాన్ని సమైక్యంగా ఉంచడం అఖిల భారత సర్వీసుల బాధ్యత అంటూ అఖిల భారత సర్వీసులను ప్రారంభించినప్పుడు సర్దార్ పటేల్ ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకుని ఆఫీసర్ ట్రైనీలు విధులు నిర్వర్తించాలి.. కేంద్ర హోంమంత్రి

స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత భారతదేశం స్థానికం నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగి చైతన్యవంతం అయ్యింది.. శ్రీ అమిత్ షా

భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన 'పోలీస్ టెక్నాలజీ మిషన్' తో కానిస్టేబుల్ స్థాయి నుంచి డీజీపీ స్థాయి అధికారి వరకు సాంకేతిక సామర్థ్యం పొంది సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు .. శ్రీ అమిత్ షా

అవగాహన, సన్నద్ధత, అమలు అనే మూడు మంత్రాల ఆధారంగా టెక్నాలజీ మిషన్ అమలు..శ్రీ షా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో తీవ్రవాద కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపి, ఉగ్రవాద వ్యతి

Posted On: 11 FEB 2023 4:06PM by PIB Hyderabad

ఈ రోజు హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగిన 74 ఆర్ఆర్ ఐపీఎస్ బ్యాచ్ స్నాతకోత్సవంలో కేంద్ర హోం మంత్రి, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పాల్గొని  ప్రసంగించారు. అమరవీరుల స్మారక చిహ్నం వద్ద దేశ అంతర్గత భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన 36,000 మంది అమరులైన పోలీసు సిబ్బందికి శ్రీ అమిత్ షా నివాళులర్పించారు. 74వ ఆర్ఆర్ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్ల పాసింగ్ అవుట్ పరేడ్ లో తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్, అకాడమీ డైరెక్టర్ శ్రీ ఎఎస్ రాజన్ తదితరులు పాల్గొన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001O7CW.jpg

 

ప్రతిష్టాత్మక ఐపీఎస్ లో ప్రవేశించిన అధికారులను శ్రీ అమిత్ షా అభినందించారు. సాంప్రదాయానికి అనుగుణంగా ఆర్ఆర్ బ్యాచ్ ను అమృత్ కాల్ బ్యాచ్ గా శ్రీ షా నామకరణం చేశారు. దేశానికి ఎదురయ్యే ప్రమాదాన్ని శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులు అంకితభావంతో సమర్ధంగా ఎదుర్కోవడానికి అవసరమైన శక్తి సామర్ధ్యాలు సాధించారని శ్రీ షా అన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతావని అంతర్గత భద్రత పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు. దేశ సేవ లోకి ప్రవేశించడం గర్వకారణంగా భావించాలన్నారు. గత ఏడు దశాబ్దాల కాలంలో భద్రతా రంగం అనేక ఒడిదుడుకులు, సవాళ్ళను ఎదుర్కొందని పేర్కొన్న శ్రీ షా 36,000కి పైగా పోలీసు సిబ్బంది దేశం కోసం ప్రాణ త్యాగం చేశారని అన్నారు.స్వాతంత్ర్యం సిద్దించిన 75 సంవత్సరాల తరువాత భారతదేశం రూపురేఖలు స్థాయి మారాయని శ్రీ షా అన్నారు. స్థానిక స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి చేరిన దేశం చైతన్యవంత దేశంగా మారిందన్నారు. 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002ZOSJ.jpg

 

దేశానికి స్వాతంత్ర్యం సిద్దించిన తర్వాత ఏర్పాటైన అఖిల భారత సర్వీసుల ప్రారంభ కార్యక్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకుని అధికారులు విధులు నిర్వర్తించాలని శ్రీ షా పిలుపు ఇచ్చారు. ఫెడరల్ రాజ్యాంగం కింద భారతదేశాన్ని సమైక్యంగా ఉంచడం అఖిల భారత సర్వీసుల బాధ్యత అంటూ  అఖిల భారత సర్వీసులను ప్రారంభించినప్పుడు సర్దార్ పటేల్ ఇచ్చిన పిలుపును శ్రీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీ దేశానికి ఎనలేని సేవలు అందించిందన్నారు.  సంస్థ భావితరాలకు స్ఫూర్తిగా ఉంటుందన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003HVJD.jpg

 

సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా  సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీ పనిచేస్తున్నదని కితాబు ఇచ్చిన శ్రీ షా ప్రస్తుతం 41 మంది మహిళలు, భూటాన్, నేపాల్, మాల్దీవులు, మారిషస్ వంటి విదేశాలకు చెందిన 29 మంది అధికారులతో సహా 195 మంది శిక్షణ పొందుతున్నారని అన్నారు.  ఈ బ్యాచ్ కు చెందిన వారిలో ఎక్కువ మంది టెక్నికల్ విభాగంలో ప్రాథమిక శిక్షణ  పూర్తి చేశారని తెలిపారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004JIX4.jpg

 

 ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భవిష్యత్తు సవాళ్ళను ఎదుర్కొనేందుకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉంటుందని గుర్తించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశంలో ' పోలీస్ టెక్నాలాజి మిషన్' ఏర్పాటు చేసారని శ్రీ షా తెలిపారు. సాంకేతిక రంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా  ' పోలీస్ టెక్నాలాజి మిషన్' పనిచేస్తుందన్నారు.  'పోలీస్ టెక్నాలజీ మిషన్' తో కానిస్టేబుల్ స్థాయి నుంచి డీజీపీ స్థాయి అధికారి వరకు సాంకేతిక సామర్థ్యం పొంది సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు అని శ్రీ అమిత్ షా  పేర్కొన్నారు. 'పోలీస్ టెక్నాలజీ మిషన్'   సాంకేతిక పరంగా దేశ పోలీసు యంత్రాంగాన్ని ప్రపంచ స్థాయికి చేరుస్తుంది శ్రీ షా అన్నారు. 
2047లో  స్వాతంత్య్ర శతజయంతి ఉత్సవాలు జరుపుకునే నాటికి దేశం అన్ని రంగాల్లో, ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలవాలన్న లక్ష్యాన్ని దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశించారని కేంద్ర హోం మంత్రి, సహకార శాఖ మంత్రి తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించడం  ప్రతి భారతీయ పౌరుడి బాధ్యత, కర్తవ్యం అని శ్రీ స్పష్టం చేశారు.  శాంతిభద్రతలు, అంతర్గత భద్రత లేకుండా ఏ దేశం అభివృద్ధి సాధించ లేదు అన్న వాస్తవాన్ని గుర్తించి ప్రతి పోలీసు అధికారి తనపై ఉన్న గురుతర  బాధ్యత గుర్తించి విధులు నిర్వర్తించాలని శ్రీ షా సూచించారు. దేశ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే పోలీసు వ్యవస్థ, ప్రజల నమ్మకం పొందిన పోలీసు వ్యవస్థ,సవాళ్ళను ఎదుర్కొనే సామర్థ్యం గల పోలీసు వ్యవస్థ కలిగి ఉన్న దేశం మాత్రమే అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్న శ్రీ షా దేశాభివృద్ధికి  పోలీసు వ్యవస్థ పునాదిగా పనిచేస్తుందని  శ్రీ షా అన్నారు.   

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0055QJ9.jpg

 

2025 నాటికి భారత్ ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, 2047 నాటికి భారత్ పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చేయాలని  లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2014లో ప్రపంచ ఆర్థిక ర్యాంకింగ్ లో  లో 11వ స్థానంలో ఉన్న భారతదేశం  కేవలం ఎనిమిదేళ్ల వ్యవధిలోనే ఐదో స్థానానికి చేరిందని వెల్లడించిన శ్రీ షా లక్షాన్ని సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు.   2027 నాటికి భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసిందని శ్రీ షా తెలిపారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006BXPA.jpg

 

రాజ్యాంగ విలువలు గౌరవిస్తూ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని శిక్షణ పూర్తి చేసుకున్న అధికారాలకు శ్రీ షా సూచించారు. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా మూడు వ్యవస్థలు దేశానికి అవసరమని అన్నారు. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజలు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, దేశానికి 30 నుంచి 35 సంవత్సరాల పటు సేవ చేసే అధికార యంత్రాంగం మూడు స్తంభాలుగా ఉంటాయని అన్నారు. 'ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వేసే అధికారం ప్రజలకు ఉంటుంది. అయిదేళ్ల పాటు దేశాభివృద్ధికి పనిచేసి  పదవీ కాలం ముగిసిన తర్వాత తిరిగి ప్రజల మద్దతు కోసం ప్రజా ప్రతినిధులు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, 30-35 సంవత్సరాల వరకు నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేసే అదృష్టం అఖిల భారత సర్వీసుల అధికారులకు మాత్రమే ఉంటుంది' అని శ్రీ షా అన్నారు. రానున్న 25 సంవత్సరాలు దేశానికి అత్యంత ప్రధానమైన సంవత్సరాలని శ్రీ షా అన్నారు. ఈ కాలంలో శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులపై  దేశ అంతర్గత భద్రతను రక్షించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్న శ్రీ షా ఈ బాధ్యతను నిర్వర్తించడానికి అధికారులు చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేయాలని పిలుపు ఇచ్చారు. ' రానున్న 25 సంవత్సరాలు' సంకల్ప సిద్ధి' సంవత్సరాలుగా ఉంటాయన్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007F4JM.jpg

 

ఎనిమిదేళ్ల క్రితం దేశ అంతర్గత భద్రత ఆందోళనకరంగా ఉండేదని  జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాద ఘటనలు, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు, వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో పెరుగుతున్న హింస రూపంలో  మూడు ప్రధాన సవాళ్లు ఎదురయ్యాయని  కేంద్ర హోం మంత్రి, సహకార మంత్రి తెలిపారు. ' 8 ఏళ్ల తర్వాత ఈ మూడు సవాళ్లను చాలా వరకు ఎదుర్కోవడంలో ప్రభుత్వం విజయం సాధించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాద ఘటనలు గణనీయంగా తగ్గాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు తిరుగుబాటు సంస్థలతో శాంతి ఒప్పందం కుదిరింది.  రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలను పరిష్కరించడం ద్వారా 8,000 మందికి పైగా తీవ్రవాదులు  తిరిగి ప్రధాన స్రవంతిలోకి వచ్చారు.' అని షా వివరించారు. భద్రతా వ్యవస్థను పటిష్టం చేసి, వామపక్ష తీవ్రవాద సమస్యకు కారణమైన నాయకత్వాన్ని అణచి వేయడం తో వామపక్ష తీవ్రవాద సమస్య ప్రస్తుతం 46 జిల్లాలకు మాత్రమే పరిమితం అయ్యిందని అన్నారు. గతంలో 96 జిల్లాల్లో వామపక్ష తీవ్రవాద సమస్య ఉండేదన్నారు.  శాంతి స్థాపనతో ఈశాన్యంలో కొత్త శకానికి నాంది పలికిందని ఆయన అన్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008AE91.jpg

 

పిఎఫ్ఐని నిషేధించడం ద్వారా భారతదేశం ప్రపంచానికి విజయవంతమైన ఉదాహరణను చూపించిందని శ్రీ షా అన్నారు.' దేశంలోని అన్ని రాష్ట్రాల కేంద్ర సంస్థలు, పోలీసులు ఒకే రోజులో విజయవంతంగా ఆపరేషన్ చేసి పీఎఫ్ ఐ వంటి సంస్థను నిషేధించడంలో విజయం సాధించారు. ఇది మన ప్రజాస్వామ్య పరిపక్వత, శక్తిని తెలియజేస్తుంది.' అని అన్నారు.  

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో తీవ్రవాద కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపి,  ఉగ్రవాద వ్యతిరేక చట్టాల అమలు కోసం పటిష్ట వ్యవష్టకు తోడు అన్ని సంస్థలకు సాధికారత కల్పించి, రాజకీయ సంకల్పం వల్ల  దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గాయని  శ్రీ షా పేర్కొన్నారు.  దేశంలో  ఇంటర్ పోల్ సాధారణ సమావేశం, తీవ్రవాద కార్యకలాపాలకు నిధులు స్తంభింపచేయడం సదస్సుల నిర్వహణతో దేశ భద్రతా సంస్థల సామర్థ్యం ప్రపంచానికి తెలిసింది అని  శ్రీ అమిత్ షా అన్నారు.  ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి  ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో నిపుణులు మానవ వనరులు, లాజిస్టిక్ కొరతను ని పూరించడానికి ప్రయత్నాలు ప్రారంభించామని  ఆయన అన్నారు. 

శిక్షణ పూర్తి చేసుకుని పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తించే సమయంలో  ఐసిజెఎస్, క్రిమినల్ జస్టిస్  ప్రధాన స్తంభాలైన ఈ -కోర్టు, ఈ -జైలు, ఈ -ఫోరెన్సిక్, ఈ -ప్రాసిక్యూషన్, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ (సిసిటిఎన్) తో రంగాల్లో నైపుణ్యం సాధించి  ఐసిజెఎస్ తో అనుసంధానం చేయాల్సి ఉంటుందన్నారు.  దేశంలో అన్ని రాష్ట్రాలకు ఎన్ఐఏ విస్తరిస్తోందని తెలిపిన శ్రీ షా  అంతర్జాతీయ మాదకద్రవ్యాలు, ఉగ్రవాదంతో సంబంధం ఉన్న నేరస్థులను అణచివేసేందుకు ఎన్ఐఏ, ఎన్సీబీ విస్తరణ చాలా ముఖ్యమైన చర్య అని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో టెర్రరిజం, మాదకద్రవ్యాలు, ఆర్థిక నేరాలు వంటి నేరాలకు సంబంధించిన జాతీయ డేటాబేస్ అభివృద్ధి చేస్తున్నామని తెలిపిన శ్రీ షా . ఫింగర్ ప్రింట్ డేటాబేస్ తయారీ కోసం నాఫిస్ (నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం)ను కూడా ప్రారంభించామని తెలిపారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సి) ను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం  సైనికులకు గృహవసతి  ఆరోగ్యాన్ని అందించే  పథకాలు ప్రారంభించిన ప్రభుత్వం కుటుంబాలతో  ఎక్కువ సమయం గడిపేలా చూసేందుకు అనేక ఇతర పథకాలను ప్రారంభించిందని కేంద్ర హోంశాఖ మంత్రి వివరించారు.

' ప్రపంచవ్యాప్తంగా భద్రతా వ్యవస్థ పని విధానం మారుతోంది. ఒక పోలీస్ వ్యవస్థగా కాకుండా బహుముఖ పోలీస్ వ్యవస్థగా భద్రతా వ్యవస్థ మారింది' అని  శ్రీ షా వ్యాఖ్యానించారు. గతంలో మాదిరిగా ఈశాన్య ప్రాంత తీవ్రవాదం, మతపరంగా సున్నిత ప్రాంతాలు లాంటి అంశాలకు కాకుండా సైబర్ నేరాలు , సమాచార దుర్వినియోగం, తప్పుడు సమాచారం వ్యాప్తి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి పనిచేయాల్సి ఉంటుందన్నారు.  గతంలో  ఉగ్రవాదం, తీవ్రవాదం, రోజువారీ పోలీసింగ్ వంటి సవాళ్లు ఉండేవని, కానీ ఇప్పుడు టెర్రర్ ఫైనాన్స్, నార్కో టెర్రర్, ఫోర్త్ జనరేషన్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ వంటి బహుముఖ సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. .  సవాళ్లను ఎదుర్కోడానికి పోలీసు యంత్రాగాన్ని  బలోపేతం చేయడానికి అధికారులు కొత్త విధానాన్ని రూపొందించాల్సి ఉందన్నారు. దేశ ఆర్థిక ప్రయోజనాల రక్షణ, పేదల మానవ హక్కుల పరిరక్షణ, సాక్ష్యం ఆధారిత దర్యాప్తు, సాక్ష్యం ఆధారిత ఫోరెన్సిక్ సైన్స్, మాదకద్రవ్యాలు, సైబర్, ఆర్థిక నేరాలు, ఉగ్రవాద సంబంధాలను ఛేదించడం వంటి అంశాలపై  పోలీసు వ్యవస్థ దృష్టి సారించాలని శ్రీ షా సూచించారు.

పోలీసు బలగాలు ప్రజలకు  అందుబాటులో ఉంటూ  జవాబుదారీతనంతో పనిచేస్తూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని శ్రీ అమిత్ షా అన్నారు.  జ్ఞానం, నైపుణ్యాలు, విధానం మధ్య సమతుల్యత తీసుకురావడం ద్వారా పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.  నూతన శక్తిని, నమ్మకాన్ని పెంపొందించడం ద్వారా జవాబుదారీతనంతో పోలీసులు పని చేయవచ్చునని శ్రీ షా అన్నారు.   స్థానిక భాష, భౌగోళికం, సంస్కృతిని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే  పోలీసులు శాంతిభద్రతల పరిష్కారానికి పని చేయాల్సి  ఉంటుందని ఆయన అన్నారు.  ప్రజలు, ప్రజల హక్కులకు రాజ్యాంగం ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తించి రాజ్యాంగం, చట్టం లోని అన్ని క్లాజులను అర్థం చేసుకుని పోలీసులు విధులు నిర్వర్తించాలని శ్రీ షా సూచించారు. 
ఆఫీసర్ ట్రైనీలు తమ వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలని శ్రీ షా సూచించారు.  అధికారులు ప్రజల నమ్మకాన్ని చూరగొని మానవత్వాన్ని నిలుపుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సంక్షేమం, సంక్షేమ చర్యలను మెరుగుపరచడం, వారితో సున్నితంగా వ్యవహరించడం, పోలీసు సామర్థ్యాన్ని పెంపొందించడం, వారి విధానం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత  అధికారులపై ఉందన్నారు.
 అవగాహన, సన్నద్ధత, అమలు  అనే మూడు మంత్రాల ఆధారంగా టెక్నాలజీ మిషన్ అమలు జరుగుతుంది అని   కేంద్ర హోంశాఖ తెలిపారు. శిక్షణ పొందుతున్న అధికారులందరూ ఈ మిషన్ లో తమ వంతు పాత్ర పోషించి మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.  ఒత్తిళ్లకు లొంగకుండా , కీర్తి కండూతికి  దూరంగా ఉండాలని మంత్రి అన్నారు. కింది స్థాయిలో ఉన్న వ్యక్తి హక్కులు, మనోభావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. అధికారులందరూ ఐపిఎస్ అధికారులుగా మాత్రమే కాకుండా  రాబోయే 25 సంవత్సరాల కాలంలో స్వాతంత్ర్యం శతాబ్ది సంవత్సరానికి పునాది వేసే బాధ్యతను కూడా నిర్వర్తించాలని  శ్రీ షా అన్నారు.
75 ఏళ్ల నుంచి 100 ఏళ్ల వరకు 'సంకల్ప సే సిద్ధి' కర్తవ్య మార్గంలో అంతర్గత భద్రత పరిరక్షణ  బాధ్యత కూడా అధికారులపై ఉందన్నారు.నవ భారతదేశ నిర్మాణం కోసం  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో జరుగుతున్న కృషికి ప్రతి ఒక్కరూ సహకరించి  దేశ ఐక్యత, సమగ్రత కోసం పనిచేయాలని శ్రీ అమిత్ షా అన్నారు.

***



(Release ID: 1898378) Visitor Counter : 175