ప్రధాన మంత్రి కార్యాలయం

రాజస్థాన్ లో భగవాన్ శ్రీ దేవ్ నారాయణ జీ 1111 వ అవతరణ మహోత్సవంలో ప్రసంగించిన ప్రధాని


విష్ణు మహాయాగంలో మందిర దర్శనం, పరిక్రమ, పూర్ణాహుతి నిర్వహణ

దేశ నిరంతర అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం భగవాన్ దేవ్ నారాయణ జీ ఆశీస్సులు కోరిన ప్రధాని

“ భారతదేశాన్ని భౌగోళికంగా, సాంస్కృతికంగా, సామాజికంగా, సైద్ధాంతికంగా విభజించటానికి విఫల యత్నం జరిగింది.”

“భారతీయ సమాజపు బలం, స్ఫూర్తి దేశ శాశ్వతత్వాన్ని కాపాడుతున్నాయి”

“భగవాన్ దేవ్ నారాయణ చూపిన మార్గమే ‘సబ్ కా సాథ్’ ద్వారా ‘సబ్ కా వికాస్’, దేశం ఇప్పుడు అనుసరిస్తున్న మార్గం అదే”

“ నిర్లక్ష్యానికి గురైన ప్రతి వర్గాన్నీ సాధికారం చేయటానికి దేశం కృషి చేస్తోంది”

“దేశ రక్షణ కావచ్చు, సంస్కృతి పరిరక్షణ కావచ్చు గుర్జర్ సామాజిక వర్గం అన్నీ వేళలా రక్షకుల పాత్ర పోషించింది”

“గుర్తింపుకు నోచుకోని వీరులను గౌరవిస్తూ, నవ భారత్ తన తప్పిదాలను దిద్దుకుంటోంది”

Posted On: 28 JAN 2023 2:11PM by PIB Hyderabad

రాజస్థాన్ లోని  భిల్వారాలో భగవాన్ శ్రీ దేవ్ నారాయణ జీ 1111 వ అవతరణ మహోత్సవంలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు.  విష్ణు మహాయాగంలో మందిర దర్శనం, పరిక్రమ, పూర్ణాహుతి నిర్వహణలో పాల్గొన్న అనంతరం ప్రధాని ఒక వేప మొక్క నాటారు. యజ్ఞశాలలో జరుగుతున్న విష్ణు మహాయాగంలో పూర్ణాహుతి కూడా జరిపారు. “రాజస్థాన్ ప్రజలు భగవాన్ దేవ్ నారాయణ్ జీ ని పూజిస్తారు. ఆయన భక్తగణం  దేశమంతటా విస్తరించి ఉంది. ప్రజాసేవకు గాను ఆయన చేసిన పనులను ప్రజలు ఎన్నటికీ మరువరు” అన్నారు.    

ఈ సందర్భంగా సభ నుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు.  తాను ప్రధానిగా అక్కడకు రాలేదని, భగవాన్ శ్రీ దేవ్ నారాయణ జీ ఆశీస్సులు పొందటానికి ఒక యాత్రికునిగా మాత్రమే వచ్చానన్నారు. యజ్ఞ శాలలో జరుగుతున్న పూర్ణాహుతిలో పాల్గొనగలిగినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడికి వచ్చిన అందరు యాత్రికులలాగానే తాను కూడా భగవాన్ శ్రీ దేవ్ నారాయణ్ జీ ఆశీస్సులు పొందటానికి వచ్చానని, దేశ నిరంతర అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం భగవాన్ దేవ్ నారాయణ జీ ఆశీస్సులు కోరానని చెప్పారు.  

భగవాన్ 1111 వ అవతరణ దినోత్సవ ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ, వారం రోజులుగా జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు, వాటిలో గుర్జర్లు చురుగ్గా పాల్గొనటాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ సామాజిక వర్గంలోని ప్రతి ఒక్కరి కృషినీ అభినందిస్తున్నానన్నారు.భారతదేశం కేవలం ఒక భూభాగం కాదని, మన నాగరకత, సంస్కృతి, సమరసతల  వ్యక్తీకరణ అని వ్యాఖ్యానించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మారలేక అనేక సంస్కృతులు నశించి పోగా, భారతీయ నాగరకత మాత్రం మళ్ళీ కోలుకున్నదన్నారు.  భారతదేశాన్ని భౌగోళికంగా,  సాంస్కృతికంగా, సామాజికంగా, సైద్ధాంతికంగా విభజించటానికి ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు.

భారతీయ సమాజపు బలం, స్ఫూర్తి దేశ శాశ్వతత్వాన్ని కాపాడుతున్నాయని చెబుతూ, నేటి భారతదేశం ఉజ్జ్వల భవిష్యత్తుకు పునాదులు వేస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. వెయ్యేళ్ళ భారత యాత్రలో సమాజ బలం పాత్ర గురించి ప్రస్తావిస్తూ, చరిత్రలోని ప్రతి కాలంలోనూ సమాజంలో నుంచి పుట్టిన బలమే ప్రతి ఒక్కరికీ మార్గదర్శనం చేస్తుందని చెప్పారు.

భగవాన్ శ్రీ దేవ్ నారాయణ్ ఎప్పుడూ  పేద ప్రజల సంక్షేమానికే పెద్దపీట వేశారని ప్రధాని గుర్తుచేసుకున్నారు.   ప్రజా సంక్షేమానికి, సేవకు శ్రీ దేవ్ నారాయణ్ ఎంతగా అంకిత భావంతో కృషి చేసేవారో చెబుతూ మానవతకు ఆయన ప్రాధాన్యమిచ్చేవారన్నారు. భగవాన్ దేవ్ నారాయణ చూపిన మార్గమే ‘సబ్ కా సాథ్’ ద్వారా ‘సబ్ కా వికాస్’ అని,  దేశం ఇప్పుడు అనుసరిస్తున్న మార్గం అదేనని ప్రధాని అన్నారు. గడిచిన 8-9 ఏళ్లలో దేశం అన్నీ వర్గాలవారినీ స్వయం సమృద్ధం చేయటానికి ఎంతగానో కృషి చేస్తోందన్నారు. పేదలకు రేషన్ అందుబాటు మీద పెద్ద ఎత్తున అనిశ్చితి ఉన్న కాలాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఈ రోజు ప్రతి లబ్ధిదారునికీ పూర్తి రేషన్ ఉచితంగా అందజేస్తున్న విషయం ప్రస్తావించారు. వైద్య చికిత్సకు సంబంధించిన అనేక సమస్యలను ఆయుష్మాన్ భారత్ పరిష్కరించిందని  ప్రధాని అన్నారు. నిరుపేదల  ఇళ్ళు, మరుగుదొడ్లు, గ్యాస్ కనెక్షన్, విద్యుత్ లాంటి సమస్యలకు కూడా పరిష్కారం కనుక్కుంటామన్నారు. బాంకుల ద్వారాలు అందరికీ తెరచే ఉన్నాయని, ఆ విధంగా ఆర్థిక సమ్మిళితి  సాధించామని ప్రధాని వ్యాఖ్యానించారు.

నీటి విలువ రాజస్థాన్ ప్రజలకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని ప్రధాని అన్నారు.  స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచినా 3 కోట్ల కుటుంబాలకు మాత్రమే కుళాయిల ద్వారా నీరందుతోందని, 16 కోట్ల కుటుంబాలు రోజూ నీటికోసం పోరాడక తప్పటం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ కృషి ఫలితంగా గడిచిన మూడున్నరేళ్లలో 11 కోట్ల కుటుంబాలకు కుళాయిల ద్వారా నీరందుతోందన్నారు. సాగునీటి సరఫరాకు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ దేశ వ్యాప్తంగా కృషి జరుగుతోందన్నారు. పిఎం కిసాన్ సమ్మాన్  నిధి పథకం ద్వారా రాజస్థాన్ రైతులకు 15 వేలకోట్లు రూపాయల నగదు బదలీ జరిగిందన్నారు.

గో సేవను సామాజిక సేవా మార్గంగానూ, సామాజిల స్వావలంబన గానూ  చూడాలన్న భగవాన్ దేవ్ నారాయణ్ ప్రచారోద్యమాన్ని ప్రస్తావిస్తూ, దేశమంతటా గో సేవ పట్ల ఎక్కువమంది ఆకర్షితులవుతున్నారన్నారు. పాడి  పశువులను మన గ్రామీణ  ఆర్థిక వ్యవస్థలో ఒక భాగం చేసుకున్నామని అది మన సంప్రదాయంలో కలిసిపోయిందని ప్రధాని గుర్తు చేశారు. అందుకే మొదటి సారిగా కిసాన్ క్రెడిట్ కార్డులను పశుగణాభివృద్ధికి కూడా విస్తరించామన్నారు. గోబర్ధన్ పథకం ద్వారా వ్యర్థాలనుంచి సంపద సృష్టించగలుగుతున్నామని కూడా ప్రధాని చెప్పారు

తేజాజీ మొదలు పాబూజీ దాకా, గోగాజీ మొదలు రామ్ దేవ్ జీ దాకా,  బప్పా రావల్ మొదలు మహారాణా ప్రతాప్ దాకా స్థానిక నాయకులు, పూజ్యులు ఈ ప్రాంతం వారు దేశానికి  మార్గదర్శనం చేశారని ప్రధాని గుర్తు చేసుకున్నారు. గుర్జార్ లు సాహసాలకూ, దేశభక్తికీ పెట్టింది పేరని దేశ రక్షణ కావచ్చు, సంస్కృతి పరిరక్షణ కావచ్చు గుర్జర్ సామాజిక వర్గం అన్నీ వేళలా రక్షకుల పాత్ర పోషించిందని ప్రధాని అభినందించారు.  బైజోలియా కిసాన్ ఉద్యమాన్ని నడిపిన విజయ్ సింగ్ పాతిక్ గా పేరుపొందిన క్రాంతివీర్ భూప్  సింగ్ గుర్జార్ ను ఉదహరించారు. కొత్వాల్ ధన్ సింగ్ జీ, జోగ్ రాజ్ సింగ్ జీ అందించిన సేవలను కూడా ప్రధాని ప్రస్తావించారు. గురజార్ మహిళల ధైర్యసాహసాలను ప్రధాని గుర్తు చేసుకుంటూ రాం ప్యారీ గుర్జార్, పన్నా ధాయ్ లకు   నివాళులర్పించారు. అలాంటి ఎంతోమందిని కోల్పోవటం మన దురదృష్టమన్నారు. చరిత్రలో స్థానం దక్కని అలాంటివారిని ఇప్పుడు స్మరించుకుంటూ గతంలో జరిగిన తప్పిదాలను దిద్దుకుంటున్నామన్నారు.

ప్రధాని తన ప్రసంగం ముగిస్తూ, తామర పువ్వు మీద వెలసిన భగవాన్ దేవ్ నారాయణ్ జీ 1111 వ అవతరణోత్సవం జరుపుకుంటున్న తరుణంలోనే భారతదేశం జీ-20 అధ్యక్ష బాధ్యతలు నెరపటం యాదృచ్ఛికమన్నారు. కమలం భూమిని మోస్తున్న చిహ్నం జీ-20 లోగోగా ఉండటాన్ని పోల్చి చూపారు. ఈ సందర్భంగా సామాజిక శక్తికి ఆయన ఘనంగా నివాళులర్పించారు

కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్, ప్రధాన అర్చకుడు శ్రీ మలశేరి డుగ్రీ ,  ఎంపీ శ్రీ సుభాస్ చంద్ర  బహేరియా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  .

*****

DS/TS



(Release ID: 1894387) Visitor Counter : 168