ప్రధాన మంత్రి కార్యాలయం

జనవరి 19 న ప్రధాని కర్ణాటక, మహారాష్ట్ర పర్యటన


కర్ణాటకలో రూ.10,800 కోట్లకు పైగా, మహారాష్ట్రలో 38,800 కోట్లకుపైగా పనులకు శ్రీకారం. ప్రాజెక్టుల ప్రారంభం

కర్ణాటకలో కొత్తగా ప్రకటించిన రెవెన్యూ గ్రామాలలో 50 వేలమంది లబ్ధిదారులకు హక్కు పత్రాలు పంపిణీ చేయనున్న ప్రధాని

జల జీవన్ మిషన్ కింద యాద్గిర్ బహుళ గ్రామ త్రాగునీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని

నారాయణ పూర్ ఎడమ కాలువ ‘విస్తరణ, పునర్నవీకరణ, ఆధునీకరణ ప్రాజెక్ట్’ ను ప్రారంభించనున్న ప్రధాని; 3 లక్షలమంది రైతులకు లబ్ధి

కర్ణాటకలో రెండు గ్రీన్ ఫీల్డ్ హైవే అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని; రెండూ సూరత్-చెన్నై ఎక్స్ ప్రెస్ వే లో భాగమే

ముంబయ్ మెట్రో రైల్ లైన్స్ 2ఎ, 7ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని

ముంబయ్ లో ఏడు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, రోడ్డు కాంక్రీట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన; ఛత్రపతి శివాజీ మహారాజ టెర్మినస్ పునరభివృద్ధి

Posted On: 17 JAN 2023 7:09PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జనవరి 19 న కర్ణాటక, మహారాష్ట్రలలో పర్యటిస్తారు. కర్ణాటకలో యాద్గిర్, కలబురుగి జిల్లాల్లో పర్యటిస్తారు. సుమారు 12 గంటల సమయంలో యాద్గిర్ జిల్లా కోడెకల్ లో ప్రధాని నీటిపారుదల, త్రాగునీటి, జాతీయ రహదార్లు తదితర అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనాలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం సుమారు 2.15 కు కలబురుగి జిల్లా మాల్ఖేడ్ చేరుకుంటారు. అక్కడ కొత్తగా ప్రకటించిన రెవెన్యూ గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు హక్కు పత్రాలు పంపిణీ చేస్తారు. అక్కడే నేషనల్ హైవే ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేస్తారు. సుమారు 5 గంటలకు ముంబయ్ లో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనాలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. సుమారు 6.30కి ముంబయ్ మెట్రో రెండు లైన్స్ ప్రారంభించి మెట్రోలో ప్రయాణిస్తారు. 

కర్ణాటకలో ప్రధాని

ఇంటింటికీ కుళాయిల ద్వారా త్రాగు నీరందించాలన్న ప్రధాని దార్శనికతను సాకారం చేయటంలో భాగంగా జల్  జీవన్  మిషన్ కింద యాద్గిర్ బహుళ గ్రామ త్రాగునీటి సరఫరా పథకానికి యాద్గిర్ జిల్లా కోడెకల్ దగ్గర శంకుస్థాపన చేస్తారు.  ఈ పథకం కింద 117 ఎం ఎల్ డి నీటి శుద్ధి ప్లాంట్ నిర్మిస్తారు.  రూ. 2050 కోట్లకు పైగా ఖర్చయ్యే ఈ ప్రాజెక్ట్ ద్వారా యాద్గిర్ జిల్లాలో మూడు పట్టణాలు, 700 గ్రామాలకు పైగా దాదాపు 2.3 లక్షల ఇళ్ళకు త్రాగు నీరు అందుతుంది.   

ఈ కార్యక్రమం కింద ప్రధాని నారాయణ పూర్ ఎడమ కాలువ విస్తరణ, పునర్వీకరణ, ఆధునీకరణ ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్ట్ కాలువల సామర్థ్యం 10,000 క్యూసెక్కులు. ఈ నీటితో 4.5 లక్షల హెక్టార్లకు సాగు చేయవచ్చు.  దీనివలన కలబురిగి, యాద్గిర్, విజయపూర్ జిల్లాలలోని 560 గ్రామాలకు చెందిన మూడు లక్షలమంది రైతులకు లబ్ధి చేకూర్చుతుంది.  ఈ ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు రూ. 4700 కోట్లు.

అదే విధంగా జాతీయ రహదారి 150-సి లో 65.5 కిలోమీటర్ల సెక్షన్ కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఈ ఆరు లేన్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్ ప్రాజెక్ట్, సూరత్ -చెన్నై ఎక్స్ ప్రెస్ వే లో భాగం. దీన్ని దాదాపు రూ. 2,000 కోట్లతో నిర్మిస్తున్నారు.

నూటికి నూరుశాతం అందరికీ ప్రభుత్వ పథకాలు అందాలన్న ప్రధాని లక్ష్యానికి అనుగుణంగా రికార్డు కాని  1475  ఆవాసాలను కొత్త రెవెన్యూ గ్రామాలుగా గుర్తించి ప్రకటించారు. ఇవి కలబురుగి, యాద్గిర్, రాయిచూర్, బీడర్, విజయపుర జిల్లాల్లోనివి.  కలబురుగి  జిల్లా సేద్యం తాలూకా మాల్ఖేడ్ గ్రామంలో ప్రధాని కొత్తగా ప్రకటించిన రెవెన్యూ గ్రామాల అర్హులైన లబ్ధిదారులకు హక్కు పత్రాలు అందజేస్తారు. హక్కు పత్రాలు అందుకునే 50 వేల మందికి పైగా లబ్ధిదారులలో  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన పేద బడుగు బలహీన వర్గాలవారే ఎక్కువ.  ఇది ఒక విధంగా ప్రభుత్వం వైపు నుంచి లాంఛనపూర్వకమైన  గుర్తింపు లాంటిది. దీనివలన త్రాగునీరు, విద్యుత్, రోడ్లు లాంటి ప్రభుత్వ సేవలు అందుకోగలుగుతారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారి నెంబర్ 150 సి లో 71 కిలోమీటర్ల సెక్షన్ కు శంకుస్థాపన కూడా చేస్తారు. ఈ ఆరు వరుసల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ప్రాజెక్ట్ కూడా చెన్నై-సూరత్  ఎక్స్ ప్రెస్ వేలో భాగమే. దీన్ని రూ. 2100 కోట్లకు పైగా  వ్యయంతో నిర్మిస్తున్నారు. సూరతు-చెన్నై ఎక్స్ ప్రెస్ వే ఆరు రాష్ట్రాల గుండా – గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రవరదేశ్, తమిళనాడు గుండా వెళుతుంది. ఇప్పుడున్న 1600 కిలోమీటర్ల  దూరాన్ని 1270 కిలోమీటర్లకు తగ్గిస్తుంది.

ముంబయ్ లో ప్రధాని

రూ.38,800 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనాలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. నగర ప్రాంతాల్లో నిరాటంకంగా ప్రయాణం సాగించటానికి వీలయ్యేట్టు చేయటం ప్రధాని ప్రాధామ్యాలలో ఒకటి. దీనికి అనుగుణంగా రూ.12,600 ఖర్చుతో నిర్మించిన ముంబయ్ మెట్రో రైల్ లైన్స్ 2 ఎ, 7 ను ఆయన జాతికి అంకితం చేస్తారు.  ఈ రెండు లైన్ లకు 2015 లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.  ముంబై 1 మొబైల్ యాప్ ను కూడా ప్రధాని ఈ సందర్భంగా ఆవిష్కరిస్తారు.  ఈ యాప్ వలన ప్రయాణం సులభతరమవుతుంది. దీన్ని మెట్రో స్టేషన్ల ఎంట్రీ గెట్ దగ్గర చూపిస్తే చాలు. యుపి ఐ ద్వారా టికెట్ల కొనుగోలుకు ఈ డిజిటల్ చెల్లింపు విధానం పనికొస్తుంది.   నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ ( ముంబయ్ 1)  తొలిదశలో మెట్రో కారిడార్స్ లో వాడతారు. ఆ తరువాత క్రమంగా లోకల్ రఇళు, బస్సుల వంటి స్థానిక రవాణా సాధనాలకు విస్తరిస్తారు. అప్పుడిక రకరకాల కార్డులు వెంట తీసుకువెళ్ళాల్సిన అవసరముండదు.

రూ.17,200 కోట్లతో నిర్మించే మురుగునీటి శుద్ధిప్లాంట్లకు  ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఈ ప్లాంట్లను మలద్, భందుప్, వెర్సోవా, ఘట్కోపర్, బాంద్రా, ధరవి, వొర్లి లో నెలకొల్పుతున్నారు.  వీటి మొత్తం సామర్థ్యం దాదాపు 2460 ఎం ఎల్ డి.  

ముంబయ్ లో ఆరోగ్య మౌలికసదుపాయాలు బలోపేతం చేయటానికి ప్రధాని 20 హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ థాకరే ఆప్లా దవాఖానాలు ప్రారంభిస్తారు. ఈ సరికొత్త చొరవ వలన ప్రజలకు  వైద్య పరీక్షలు, మందులు, నిర్థారణ వంటివి పూర్తిగా ఉచితంగా అందుతాయి. ముంబయ్ లో మూడు ఆస్పత్రుల- 360 పడకల భందుప్ మల్టీ స్పెషాలిటీ మున్సిపల్ ఆస్పత్రి, 306 పడకల గోరేగావ్ సిద్ధార్థనగర్ ఆస్పత్రి, 152 పడకల ఓషివారా మెటర్నిటీ హోమ్ పునరభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.  దీనివల్ల లక్షలాది మంది నగర పౌరులకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.

ముంబయ్ లో దాదాపు 400 కిలోమీటర్ల రోడ్డు కాంక్రీట్ పనులను ప్రధాని ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టును రూ.6100 కోట్లతో చేపడతారు. ముంబయ్ లో 2050 కిలోమీటర్ల రోడ్డులో 1200 కిలోమీటర్ల మేర కాంక్రీట్ వేయటమో, పాక్షికంగా వేయటమో జరిగింది. అయితే, మిగిలిన సుమారు 850 కిలోమీటర్ల రోడ్లు బాగా గుంటలు పడి  రవాణాకు అవరోధంగా తయారయ్యాయి. ఈ సవాలును అధిగమించటానికే రోడ్డు కాంక్రీట్ చేసే పనిసాగుతోంది. దీనివలన వేగం పెరగటంతోబాటు భద్రత కూడా పెరుగుతుంది. మురుగునీటి పారుదల కూడా మెరుగుపడు, పదే పదే తవ్వాల్సిన అవసరం తప్పుతుంది.

ఛత్రపతి శివాజీ మహారాజ టెర్మినస్ పునరభివృద్ధి పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్ట్ కు రూ.1800 కోట్లకు పైగా ఖర్చవుతుంది. పి ఎం స్వనిధి యోజన కింద లక్ష మందికి పైగా లబ్ధిదారులకు ఆమోదిత రుణాల బదలీని కూడా ప్రధాని  ప్రారంభిస్తారు.  

***



(Release ID: 1892001) Visitor Counter : 146