రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

బొగ్గు గ్యాసిఫికేషన్ ఆధారిత తాల్చేర్ ఫెర్టిలైజర్స్ ప్రాజెక్ట్ పురోగతిని సమీక్షించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు రసాయనాలు, ఎరువులు మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మరియు కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్


తాల్చేర్ ఫెర్టిలైజర్స్ ప్రాజెక్ట్ భారతదేశంలో అతిపెద్ద మరియు మొట్టమొదటి బొగ్గు గ్యాసిఫికేషన్ ప్లాంట్ అవుతుంది: డాక్టర్ మన్సుఖ్ మాండవియా

ప్లాంట్‌ను సకాలంలో ప్రారంభించడానికి వాటాదారులందరి మధ్య సమన్వయం ఉండాలని సమీక్షా సమావేశం తెలిపింది

"నాలుగు కొత్త యూరియా ఉత్పత్తి ప్లాంట్లతో పాటు అక్టోబర్ 2024 నుండి ప్రారంభమయ్యే తాల్చెర్ ప్లాంట్‌తో యూరియా దిగుమతిపై భారతదేశం ఆధార పడడం గణనీయంగా తగ్గుతుంది"

Posted On: 07 JAN 2023 3:26PM by PIB Hyderabad


"భారతదేశ  వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి ఎరువులు అవసరం. దేశం ప్రస్తుతం దిగుమతులు మరియు ఎరువుల దేశీయ ఉత్పత్తిపై ఆధారపడి ఉంది. గౌరవనీయులైన ప్రధానమంత్రి యొక్క దూరదృష్టితో కూడిన నాయకత్వంలో భారతదేశం ఈ రంగంలో కూడా ఆత్మనిర్భర్‌గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో ఐదు కొత్త ఎరువుల కర్మాగారాలతో భారతదేశం యొక్క దేశీయ యూరియా ఉత్పత్తి పెద్ద వృద్ధిని చూస్తుంది. వీటిలో నాలుగు ప్లాంట్లు ఇప్పటికే పని చేస్తున్నాయి. అయితే తాల్చర్ బొగ్గు గ్యాసిఫికేషన్ ప్లాంట్ అక్టోబర్ 2024 నాటికి పని చేస్తుంది.  కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో ఎఫ్‌సిఐఎల్‌ తాల్చేర్ యూనిట్ పురోగతిని సమీక్షించిన సందర్భంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు రసాయనాలు, ఎరువులు మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈ విషయాన్ని తెలిపారు. గెయిల్ (ఇండియా) లిమిటెడ్ (గెయిల్), రాష్ట్రీయ కెమికల్స్ & ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్‌సిఎఫ్), కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) మరియు ఫెర్టిలైజర్స్  కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌సిఐఎల్) సంస్థల ద్వారా తాల్చర్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (టిఎఫ్‌ఎల్) యూనిట్
పునరుద్ధరణ చేపట్టబడింది.

ఈ సందర్భంగా డాక్టర్‌ మాండవ్య మాట్లాడుతూ.. దేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చడంలో ప్రభుత్వం గణనీయమైన చర్యలు తీసుకుంటోందన్నారు. వాటిలో ఎరువుల రంగం ఒకటి. మన ఎరువుల కర్మాగారాల్లో బొగ్గు గ్యాసిఫికేషన్ వంటి కొత్త సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా మరియు బొగ్గు వంటి మన స్వంత సంపద (వనరులు) ఉపయోగించడం ద్వారా భారతదేశం యూరియా రంగంలో స్వయం సమృద్ధి దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో భారతదేశం యొక్క అతిపెద్ద మరియు మొట్టమొదటి బొగ్గు గ్యాసిఫికేషన్ యూరియా ప్లాంట్ అయిన తాల్చర్ యూనిట్ పురోగతిని భారత ప్రభుత్వం సమీక్షిస్తోంది.

దేశంలోని విస్తారమైన బొగ్గు నిల్వలను ప్రత్యక్షంగా కాల్చే బొగ్గు ప్రాజెక్టుల కంటే పర్యావరణానికి అనుకూలమైన రీతిలో వినియోగించుకోవడం ద్వారా దేశ ఇంధన భద్రతకు భరోసా కల్పించేందుకు ఈ ప్రయత్నం ఒక ముఖ్యమైన ముందడుగు అని డాక్టర్ మాండవ్య అన్నారు.

యూనిట్ పురోగతిని సమీక్షిస్తున్న నేపథ్యంలో  డాక్టర్ మాండవ్య మరియు శ్రీ ప్రధాన్‌కు మోడల్ రూమ్‌లో ప్రాజెక్ట్ యొక్క అవలోకనాన్ని అందించారు. అనంతరం ప్లాంట్ స్థలాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ప్రాజెక్ట్ నిర్మాణం మరియు నిర్మాణ కార్యకలాపాలను సమీక్షించారు. ప్రాజెక్ట్ స్థితిని కూడా గౌరవనీయ మంత్రులు సమీక్షించారు. టిఎఫ్‌ఎల్,పిడిఐఎల్ (ప్రాజెక్ట్ కన్సల్టెంట్) మరియు టిఎఫ్‌ఎల్ ప్రమోటర్ల ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గౌరవనీయులైన మంత్రులు జాతీయ స్థాయిలో ప్లాంట్ యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు మరియు ప్లాంట్‌ను గడువులోగా ప్రారంభించేందుకు పనులు పూర్తి చేయాలని టిఎఫ్ఎల్ మరియు పిడిఐఎల్ అధికారులను ఆదేశించారు. ప్లాంట్‌ను సకాలంలో ప్రారంభించడం కోసం అన్ని వాటాదారుల మధ్య సమన్వయ ప్రయత్నాలపై డాక్టర్ మాండవ్య ఉద్ఘాటించారు.

సంవత్సరానికి 12.7 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటిపిఎ) స్థాపిత సామర్థ్యంతో కొత్త బొగ్గు గ్యాసిఫికేషన్ ఆధారిత యూరియా ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఎఫ్‌సిఐఎల్ యొక్క పూర్వపు తాల్చర్ ప్లాంట్‌ను పునరుద్ధరించాలని టిఎఫ్‌ఎల్‌ని ప్రభుత్వం ఆదేశించింది.

ప్రాజెక్ట్ బొగ్గు గ్యాసిఫికేషన్‌ను ప్రోత్సహిస్తుంది కాబట్టి 2030 నాటికి 100 ఎంటి  బొగ్గును గ్యాసిఫై చేయాలన్న ప్రకటిత లక్ష్యాన్ని చేరుకోవడంలో కూడా ఇది సాయపడుతుంది. ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా ఒడిశా మరియు తూర్పు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు ఊపును అందిస్తుంది, తద్వారా భారతదేశాన్ని ఆత్మ నిర్భర్త వైపు నడిపిస్తుంది.

బొగ్గు ధరలు స్థిరత్వం లేనివి మరియు దేశీయ బొగ్గు సమృద్ధిగా అందుబాటులో ఉన్నందున బొగ్గు గ్యాసిఫికేషన్ ప్లాంట్లు వ్యూహాత్మకంగా ముఖ్యమైనవి. తాల్చర్ ప్లాంట్ యూరియా ఉత్పత్తికి దిగుమతి చేసుకున్న సహజ వాయువుపై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది సహజ వాయువు దిగుమతి బిల్లులో తగ్గింపుకు దారి తీస్తుంది. ఇంకా నిర్మాణంలో ఉన్న తాల్చేర్ యూనిట్‌లో అవలంబించిన గ్యాసిఫికేషన్ ప్రక్రియ నేరుగా బొగ్గు ఆధారిత ప్రక్రియలతో పోలిస్తే మరింత పర్యావరణ అనుకూలమైనది, తద్వారా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సిఒపి) కింద భారతదేశం చేసిన కట్టుబాట్లకు మద్దతు ఇస్తుంది.

దేశీయంగా ఉత్పత్తి చేయబడిన యూరియా లభ్యతను పెంపొందించడానికి మూతబడ్డ ఎఫ్‌సిఐఎల్ మరియు హెచ్‌ఎఫ్‌సిఎల్ యూనిట్ల పునరుద్ధరణ మోడీ ప్రభుత్వ  ప్రధాన అజెండాగా ఉంది. ఎఫ్‌సిఐఎల్/హెచ్‌ఎఫ్‌సిఎల్ యొక్క మొత్తం ఐదు ప్లాంట్ల ప్రారంభం దేశంలో 63.5 ఎల్‌ఎంటిపిఏ దేశీయ యూరియా ఉత్పత్తి సామర్థ్యాన్ని జోడిస్తుంది. ఐదు ప్లాంట్లలో, నాలుగు ప్లాంట్లు అంటే రామగుండం, గోరఖ్‌పూర్, సింద్రీ మరియు బరౌని ఎరువుల ప్లాంట్లు ఇప్పటికే దేశంలో యూరియా ఉత్పత్తిని ప్రారంభించాయి మరియు తాల్చర్ ప్లాంట్ సెప్టెంబర్ 2024 నాటికి ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు.

కేంద్ర ఆరోగ్య మంత్రి చేసిన ఈ ట్వీట్ ద్వారా పర్యటన యొక్క సారాంశాన్ని చూడవచ్చు

***



(Release ID: 1889500) Visitor Counter : 138