శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఢిల్లీలోని జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ కేంద్ర కార్యాలయంలో అంకుర సంస్థలకు అండగా ‘ఇన్ క్యుబేషన్ సెంటర్’ ప్రారంభించిన మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


సాంకేతిక పరిజ్ఞాన ఫలితాలను పెద్ద ఎత్తున పరిశ్రమలకు తీసుకువెళుతున్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థగా ఎన్ ఆర్ డీసీ పాత్రను మెచ్చుకున్న మంత్రి

ఆఫ్రికా, ఆసియా దేశాలకు సాంకేతిక పరిజ్ఞాన బదలీ సేవలు అందించటం లక్ష్యంగా పనిచేయాలని ఎన్ ఆర్ డీసీ కి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపు

1953 లో ఏర్పాటైన తరువాత ఢిల్లీలోని జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన తొలి మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ : అమిత రస్తోగి

Posted On: 31 DEC 2022 5:59PM by PIB Hyderabad

సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి ( స్వయం ప్రతిపత్తి), ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి ( స్వయం ప్రతిపత్తి), పీఎంవో, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణు విద్యుత్, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్  ఈ రోజు ఢిల్లీలోని జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ కేంద్ర కార్యాలయంలో  అంకుర సంస్థలకు  అండగా ‘ఇన్ క్యుబేషన్ సెంటర్’  ప్రారంభించారు.

ఎన్ ఆర్ డీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కమొడోర్ (రిటైర్డ్)  అమిత్  రస్తోగి, ఆయన యావత్ బృందం డాక్టర్ జితేంద్ర సింగ్ కు స్వాగతం పలికింది. 1953 లో ఏర్పాటైన తరువాత ఢిల్లీలోని జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన తొలి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అని కూడా ఈ సందర్భంగా వారు మంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు.

2015 ఆగస్టు 15 న ఎర్రకోట నుంచి ప్రధాని స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా ప్రకటించిన తరువాత ఎన్ ఆర్ డీసీ తనను తాను మార్చుకుంటూ సాంకేతిక పరిజ్ఞాన ఫలితాలను పెద్ద ఎత్తున పరిశ్రమలకు తీసుకువెళుతున్న ఏకైక జాతీయ స్థాయి ప్రభుత్వ రంగ సంస్థగా రూపొందటం పట్ల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ హర్షం వ్యక్తం చేశారు. అంకుర సంస్థలకు ఈ కార్పొరేషన్ అండగా నిలబడుతూ ఐపి ఫైలింగ్ లాంటి విషయాలలో సహకరించటమే కాకుండా ఎన్ ఆ డీసీ కేంద్ర కార్యాలయం. సి ఎస్ ఐ ఆర్- ఐ ఎం ఎం టి , టెక్నాలజీ అభివృద్ధి నిధి, తొలిదశ అంకుర సంస్థలకు సీడ్ ఫండింగ్ ద్వారా ఇన్ క్యుబేషన్ సహాయం చేస్తున్నదన్నారు.

దేశంలో పెద్ద ఎత్తున వస్తున్న అంకుర సంస్థల పర్యావరణంలో జాతీయ స్థాయి బాధ్యత తీసుకుంటూ ఒకే చోట అంకుర సంస్థల అవసరాలన్నీ తీర్చగలిగేలా ఎదగాలని డాక్టర్ జితేంద్ర సింగ్ కోరారు.  సంస్థలో టీ ఆర్ ఎల్ మదింపు, ఐపి ఎక్స్ ఛేంజ్, డిజైన్ క్లినిక్, నమూనా ఇన్ క్యుబేషన్ కేంద్రం లాంటివి అందుబాటులో ఉండేట్లు చూడాలని కోరారు.   భారత సాంకేతిక పరిజ్ఞానానికి ప్రపంచ మార్కెట్ లభించేలా చూడటానికి ఆఫ్రికాఆసియా దేశాలకు సాంకేతిక పరిజ్ఞాన బదలీ సేవలు అందించటం లక్ష్యంగా పనిచేయాలని ఎన్ ఆర్ డీసీ కి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపు నిచ్చారు.  

కమొడోర్ (రిటైర్డ్) అమిత్  రస్తోగి  మంత్రి సమక్షంలో ఇచ్చిన ప్రజెంటేషన్ లో యూనీఫోర్ అనే భారతీయ యూనికార్న్ సంస్థకు 2008 లో సాంకేతిక సహకారంతోబాటు  ఎన్ ఆర్ డీసీ రూ.30 లక్షల సహాయం అందించిన విషయం ప్రస్తావించారుతాను, తన బృందం తమ సంస్థను సాంకేతిక పరిజ్ఞాన బదలీలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థలలో ఒకటిగా తీర్చిదిద్దగలమని శ్రీ రస్తోగీ ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కు హామీ ఇచ్చారు.

 

అంకుర సంస్థల తొలిదశలో ఎన్ ఆర్ డీసీ అనేక సౌకర్యాలు కల్పిస్తోందని, అనేక లబ్ధి పథకాల ద్వారా నిధులు సమకూర్చటం, శిక్షణ ఇవ్వటం, ఐపి పొందటంలో సహకరించటం లాంటి పనులు చేస్తోందని రస్తోగీ చెప్పారు.   గడిచిన  ఏడాది కాలంలో సంస్థ మూడు ఇన్ క్యుబేషన్ సెంటర్లు, ఒక ఔట్ రీచ్ సెంటర్ ఏర్పాటు చేసింది. మరో ఔట్ రీచ్ సెంటర్ 2023 జనవరిలో గువాహతిలో  ప్రారంభానికి సిద్ధమైంది. ఇది ఈశాన్య ప్రాంత అంకుర సంస్థలను ప్రోత్సహిస్తుంది. ఎన్ ఆర్ డీసీ ఇప్పటివరకూ 10,000 అంకుర సంస్థలకు ఐపి ఫైలింగ్, ఇన్ క్యుబేషన్, స్టార్టప్ రిజిస్ట్రేషన్ లో సహాయం అందించింది.  

పౌర అవసరాలకోసం  రక్షణ, అణు సాంకేతిక పరిజ్ఞానాలలోకి కూడా ఎన్ ఆర్ డీసీ ప్రవేశించింది.  మేడిన్   ఇండియా కు అండగా విదేశాలతో సంబంధాలు పెంచుకుంటోంది.  ఆ విధంగా భారత ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ పెరిగేలా కృషి చేస్తోంది. పరిశోధనా సంస్థలకూ, పరిశ్రమకూ మధ్య వారధిలా పనిచేస్తూ 220 పరిశోధనా సంస్థలతోనూ, యూనివర్సిటీలతోనూ అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది.  ఎన్ ఆర్ డీసీ  2021 లో తన విశాఖ యూనిట్ కు ఉత్తమ సాంకేతిక పరిజ్ఞాన పురస్కారం, నవకల్పన సహకార కేంద్రం పురస్కారం సాధించింది.                                                                                           

                                                <><><><><>

 


(Release ID: 1887821) Visitor Counter : 155