సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

యువత భవితే లక్ష్యంగా  మోదీ ప్రభుత్వం బాటలు!


ఇందుకు ఎనిమిదిన్నరేళ్లుగా కృషి జరిగిందన్న

కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్..యు.పి.లోని గజ్రౌలాలో “కొత్త యువ ఓటర్లతో సంవాదం”కార్యక్రమంలో మంత్రి ప్రసంగం

యువతభుజస్కందాలపై దేశ ప్రగతి: డాక్టర్ జితేంద్ర సింగ్ సృజనాత్మక రంగాలు, స్టార్టప్‌లలో కొత్త ప్రాజెక్టులకోసం ఉత్తరప్రదేశ్ యువతకు

సైన్స్- టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ద్వారా సహాయంపైహామీ.. సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి మండలి,బయోటెక్నాలజీ శాఖ ద్వారా సీడ్ఫండింగ్‌తో సాయం అందిస్తామని వెల్లడి

Posted On: 27 DEC 2022 6:05PM by PIB Hyderabad

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు యువతలో కొత్త ఆశలను నింపాయని కేంద్ర సైన్స్-టెక్నాలజీ శాఖ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశ యువత భవితకోసం ప్రభుత్వం గత ఎనిమిదిన్నర ఏళ్లలో అనేక మార్గాలను సృష్టించిందని అన్నారు. స్వతంత్ర హోదాతో కూడిన సహాయమంత్రిగా భూగోళ శాస్త్రాలు, ప్రధాని కార్యాలయ వ్యవహారాలు, సిబ్బంది, ప్రజా సమస్యలు, పెన్షన్ల వ్యవహారాలు, అణుశక్తి, అంతరిక్ష శాఖలను ఆయన పర్యవేక్షిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, గజ్రౌలాలోని వెంకటేశ్వర యూనివర్సిటీలో “కొత్త యువ వోటర్లతో సంవాదం” పేరిట జరిగిన కార్యక్రమంలో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ప్రపంచ దేశాల కూటమిలో భారతదేశ ఖ్యాతి పెరిగిందని, భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి, అనుసంధానం కావడానికి ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆసక్తిగా చూస్తోందని అన్నారు.

 

 

ప్రపంచం మొత్తం భారతదేశ యువతవైపు ఆశాభావంతో చూస్తోందని. ఎందుకంటే యువతే దేశానికి అభివృద్ధి ఛోదక శక్తి అని, భారతదేశం ప్రపంచ వృద్ధికి ఛోదకశక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ ఒక యువ స్నాతకోత్సవ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ఈ సందర్భంగా ఉటంకించారు. విశాల దృక్పథానికి, భావిస్ఫోరక కార్యక్రమాలకు, ప్రగతిశీల అభిప్రాయాలకు నవభారతదేశం ప్రసిద్ధి చెందిందని అన్నారు, మన దేశ అభివృద్ధి యువత భుజస్కందాలపై ఆధారపడి ఉందని అన్నారు.

అనేక దశాబ్దాలుగా దేశంలో అస్థిర ప్రభుత్వాలు, సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయని, ఇవి భారత భవిష్యత్తుపై ప్రజల్లోనే కాకుండా ప్రపంచత దేశాల్లో కూడా భయాందోళనలకు కారణమయ్యాయని జితేంద్ర సింగ్ యువ ఓటర్లకు గుర్తు చేశారు. కానీ, 2014లో, భారతదేశంలోని ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, విధానాల్లో పని సంస్కృతిలో ఈ ప్రభుత్వం సుస్థిరతను తీసుకువచ్చిందని, మార్పుకు బలమైన పునాది వేసిందని అన్నారు.

2015 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఎర్రకోట బురుజునుంచి "స్టార్ట్-అప్ ఇండియా స్టాండ్ అప్ ఇండియా" కోసం ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని, దీనితో భారతదేశం భవిష్యత్తు దార్శనికతకు పూర్తి విశ్వసనీయత ఏర్పడిందని అన్నారు. దీని ఫలితంగా భారతదేశంలో 2014లో కేవలం 350గా ఉన్న స్టార్టప్‌ల సంఖ్య 2022లో 85 యునికార్న్‌ స్థాయి సంస్థలతో కలసి మొత్తం 80,000కి పెరిగిందని అన్నారు.

“ఈ శతాబ్దాన్ని భారతదేశం వశం చేయడానికి, మనదేశ యువత విద్యతో పాటు నైపుణ్యంలోనూ సమానంగా ప్రావీణ్యం పొందడం అత్యవసరం” అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. విద్యార్థులు తమ నైపుణ్యాలతో సృజనాత్మక మార్గంలో మొదటి అడుగు వేస్తున్నారని అన్నారు. ఇక రేపటి వారి ప్రయాణం మరింత సృజనాత్మకంగా ఉంటుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.

యువత నైపుణ్యాభివృద్ధికి, కొత్త సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. 1950వ సంవత్సరంలో దేశంలో తొలి పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐ.టి.ఐ.) నిర్మాణం తర్వాత ఏడు దశాబ్దాల్లో కేవలం 10 వేల ఐ.టి.ఐ.లు మాత్రమే ఏర్పాటయ్యాయని, అయితే, గత ఎనిమిదేళ్ల మోదీ ప్రభుత్వ హయాంలో దేశ వ్యాప్తంగా దాదాపు 5 వేల ఐ.టి.ఐ.లు ఏర్పడ్డాయని అన్నారు. గత 8 సంవత్సరాల్లో ఐ.టి.ఐ.లో 4 లక్షలకు పైగా కొత్త సీట్లు అందుబాటులోకి వచ్చాయని కేంద్రమంత్రి అన్నారు.

భారతదేశ పారిశ్రామిక విజయంలో పారిశ్రామిక శిక్షణా సంస్థల పాత్ర గొప్పదని జితేంద్ర సింగ్ అన్నారు. కోడింగ్, కృత్రిమ మేధోపరిజ్ఞానం (ఎ.ఐ.), రోబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్, డ్రోన్ సాంకేతక పరిజ్ఞానం, టెలీమెడిసిన్ వంటి కొత్త కోర్సులను ఐ.ఐ.టి.లు అందిస్తున్నన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.

సృజనాత్మక రంగాలు, స్టార్ట్-అప్‌లకు సంబంధించిన కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి వీలుగా ఉత్తరప్రదేశ్ యువతకు తన అజమాయిషీలోని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ద్వారా అన్ని విధాలా సహాయాన్ని అందిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. టెక్నాలజీ అభివృద్ధి మండలి, బయోటెక్నాలజీ శాఖ నుంచి సీడ్ ఫండింగ్ ద్వారా సహాయం అందిస్తామని డాక్టర్ జితేంద్ర సంగ్ అన్నారు.

 

<><><>



(Release ID: 1886994) Visitor Counter : 125


Read this release in: English , Urdu , Hindi , Tamil