ఆర్థిక మంత్రిత్వ శాఖ

హైదరాబాద్ లోని రెండు రహస్య తయారీ ల్యాబ్ లపై నిర్వహించిన దాడుల్లో సుమారు రూ.50 కోట్ల విలువైన 25 కిలోల మెఫెడ్రోన్ ను స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ

Posted On: 26 DEC 2022 5:53PM by PIB Hyderabad

హైదరాబాద్ లో రహస్యంగా  మెఫెడ్రోన్ తయారు చేస్తున్న  రెండు కేంద్రాలపై   డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ రెవెన్యూ (డీఆర్ఐ) అధికారులు దాడులు నిర్వహించారు.  మరియు సూత్రధారి మరియు ఫైనాన్సియర్ ని అరెస్ట్ చేసిన డీఆర్ఐ అధికారులు మెఫెడ్రోన్ అక్రమ తయారీ వ్యవస్థను భగ్నం చేశారు. డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న మెఫెడ్రోన్  గ్రే మార్కెట్ విలువ 49.77 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. 24.885 కిలోల మెఫెడ్రోన్ ను  డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనితో పాటు తయారీకి సిద్ధంగా ఉన్న పదార్థాలు, నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదు, ముడి పదార్థాల విలువ 18.90 లక్షల రూపాయల వరకు ఉంటుంది.  

నిర్దిష్ట ఇంటెలిజెన్స్ ఆధారంగా రంగంలోకి దిగిన  డీఆర్ఐ అధికారులు 2022 డిసెంబర్  21న   సమన్వయంతో ఆపరేషన్ ప్రారంభించారు.  రెండు  ప్రయోగశాలలు అక్రమంగా మెఫెడ్రోన్ తయారు చేసినట్లు అధికారులు గుర్తించి దాడులు చేశారు.  ఈ రెండు ప్రాంతాల్లో మెఫెడ్రోన్ తయారు చేస్తున్న ఏడుగురిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

 

 

విచారణ కొనసాగించిన అధికారులు అక్రమ తయారీ  సూత్రధారి, నిధులు సమకూర్చిన వ్యక్తిని గోరఖ్ వద్ద అరెస్టు చేశారు.నేపాల్ కు  పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా సూత్రధారిని ఆరెస్ట్ చేసిన అధికారులు అతని నుంచి 60 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.  


2016లో ఇండోర్ లో 236 కిలోల ఎఫిడ్రిన్,  యమునా నగర్ లో 667 కిలోల మెఫెడ్రోన్ను  రహస్యంగా తయారు చేస్తున్నారన్న ఆరోపణతో  డీఆర్ఐ అరెస్ట్ చేసిన కొందరు నిందితులు హైదరాబాద్ లో  డీఆర్ఐ అరెస్ట్ చేసిన వారిలో ఉన్నారు.  ఇండోర్ లోని జైలు నుంచి తప్పించుకున్న కేసు, హైదరాబాద్ లో ఓ హత్య కేసు,  వడోదరలో జరిగిన  దొంగతనాల కేసులో కూడా వీరికి సంబంధం ఉంది. 

 మాదకద్రవ్యాల కేసులో ప్రధాన సూత్రధారులు మరియు నేరస్థులు / నిధులు సమకూరుస్తున్న వారిని  పట్టుకోవడంపై దృష్టి సారించాలని హోం మంత్రి మరియు ఆర్థిక మంత్రి అధికారులకు ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ప్రధాన వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకోవడానికి  డీఆర్ఐ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. 
తయారీ కేంద్రాలను నిర్వీర్యం చేసి  మొత్తం డ్రగ్ సిండికేట్ ను అరెస్ట్ చేసిన డీఆర్ఐ అధికారులు నూతన సంవత్సరం, ఆ తర్వాత మాదకద్రవ్యాల సరఫరా చేయడానికి  జరిగిన కుట్రను భగ్నం చేశారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2022 జూలై-ఆగస్టు  లో హర్యానాలోని యమునా నగర్ లో డీఆర్ఐ ఛేదించిన అతి పెద్ద కేసు తర్వాత హైదరాబాద్ కేసు రెండవది. ఈ ఆర్థిక సంవత్సరంలో (2022 నవంబర్ వరకు) 990 కిలోల హెరాయిన్, 88 కిలోల కొకైన్, 10,000 మెథాంఫేటమిన్ మాత్రలు, 2,400 లీటర్ల ఫెన్సెడైల్ దగ్గు సిరప్, ఇతర హానికరమైన ఎన్డిపిఎస్ పదార్థాలను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి మరియు నార్కో టెర్రరిజం సవాలును ఎదుర్కోవటానికి డీఆర్ఐ కట్టుబడి ఉంది



(Release ID: 1886786) Visitor Counter : 125


Read this release in: English , Urdu , Hindi , Marathi