ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

వర్చువల్ విధానంలో 'స్వస్త్ సబల్ భారత్' సదస్సు ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అవయవదానం ప్రజా ఉద్యమంగా సాగాలి .. డాక్టర్ మాండవీయ


అందరి శ్రేయస్సు కోరే మన సంస్కృతిలో అవయవదానం అంతర్భాగంగా ఉంది . డాక్టర్ మాండవీయ

Posted On: 03 SEP 2022 4:14PM by PIB Hyderabad

అవయవదానం , నేత్ర దానం అంశాలకు సంబంధించిన అంశాలు, సమస్యలు చర్చించి సమస్య పరిష్కార మార్గాలను రూపొందించేందుకు ఏర్పాటైన  'స్వస్త్ సబల్ భారత్'  సదస్సును కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ రోజు ప్రారంభించారు.  వర్చువల్ విధానంలో జరిగిన సదస్సు ప్రారంభ కార్యక్రమంలో  సిక్కిం గవర్నర్ శ్రీ గంగా ప్రసాద్ పాల్గొన్నారు..ముఖ్యమైన అంశాలపై సదస్సును నిర్వహించడం పట్ల డాక్టర్ మాండవీయ తన ప్రారంభ ఉపన్యాసం లో హర్షం వ్యక్తం చేశారు. ' వ్యక్తిగత శ్రేయస్సుతో పాటు ఇతరుల శ్రేయస్సును ఆలోచించడం మన సంస్కృతిలో భాగంగా ఉంది. అవయవ దానం కూడా ఇటువంటి ఉదార ఆలోచనతో ముడిపడి ఉంది' అని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు.  మానవతా దృక్పథంతో ప్రజలు అవయవ దానం చేసేలా చూసేందుకు ప్రజా ఉద్యమం ప్రారంభం కావాలని ఆయన అన్నారు. 'అవయవ దానం చేసేలా ప్రజలను ఒప్పించడం ప్రభుత్వం లేదా స్వచ్చంధ సేవా సంస్థలకు సాధ్యం కాదు. ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే ఈ ఉద్యమం విజయవంతం అవుతుంది.' అని మంత్రి అన్నారు. 

అవయవదానం నేత్ర దానం అంశాలపై జాతీయ స్థాయిలో ప్రజా ఉద్యమం ప్రారంభించి విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని డాక్టర్ మాండవీయ కోరారు. అవయవ దానం కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూసేందుకు  తమ మంత్రిత్వ శాఖ అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. 

దధీచి దేహ దాన సమితి పోషకుడు శ్రీ అలోక్ కుమార్, దధీచి దేహ దాన సమితి అధ్యక్షుడు శ్రీ హర్ష్ మల్హోత్రా, భారతదేశంలో అవయవ/శరీర దానాలపై కృషి చేస్తున్న CVOTER ఫౌండేషన్ వ్యవస్థాపక డైరెక్టర్  శ్రీ యశ్వంత్ దేశ్‌ముఖ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు  డాక్టర్ సహజానంద, నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజషన్ కి చెందిన డాక్టర్  రజనీష్ సహాయ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.



(Release ID: 1856544) Visitor Counter : 136