ఆర్థిక మంత్రిత్వ శాఖ

గౌహతి మరియు దిమాపూర్‌ ఇండో-మయన్మార్ సరిహద్దు ద్వారా దేశంలోకి అక్రమంగా తరలించిన రూ. 8.38 కోట్ల విలువైన 15.93 కేజీల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ

Posted On: 13 MAY 2022 1:52PM by PIB Hyderabad

వ్యవస్థీకృత అక్రమ బంగారం రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్న   డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ( డీఆర్ఐ  ) "గోల్డ్ ఆన్ ది హైవే" అనే కోడ్ పేరుతోఅమలు చేసిన మరో ముఖ్యమైన ఆపరేషన్‌లో  ఇండో-మయన్మార్ సరిహద్దు లో  8.38 కోట్ల రూపాయల విలువ చేసే   15.93 కిలోల విదేశీ-మూలాల బంగారాన్ని  స్వాధీనం చేసుకుంది. 2022 మే 12న  గౌహతి మరియు దిమాపూర్‌లో ఈ ఆపరేషన్ ను  డీఆర్ఐ  నిర్వహించింది. 

నిర్దిష్ట ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు  డీఆర్ఐ  అధికారులు మావోమణిపూర్ నుండి  అస్సాంలోని గౌహతి వరకు విడివిడిగా ప్రయాణిస్తున్న రెండు చమురు ట్యాంకర్లు మరియు ఒక ట్రక్కుపై గట్టి  నిఘా పెట్టారు. 2022 మే12   తెల్లవారుజామున  దిమాపూర్ మరియు గౌహతి మధ్య జాతీయ రహదారి వెంబడి వివిధ పాయింట్ల వద్ద ఈ వాహనాలను  ఏకకాలంలో డీఆర్ఐ  అధికారులు అడ్డగించారు. 

 

  

అడ్డగించిన వాహనాలను క్షుణంగా తనిఖీ చేసిన అధికారులు మూడు వాహనాల వేర్వేరు భాగాలలో  కనిపించకుండా  జాగ్రత్తగా దాచిపెట్టిన 15.93 కిలోల బరువున్న 96 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో సిండికేట్‌కు చెందిన ఐదుగురిని అరెస్టు చేసి మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. 

2021-22 ఆర్థిక సంవత్సరంలో డిఆర్‌ఐ 833 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది, దీని విలువ 405 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా  డిఆర్‌ఐ నిఘా పెంచింది.  ఈశాన్య రాష్ట్రాల్లో డీఆర్‌ఐ 102.6 కోట్ల రూపాయల విలువ చేసే దాదాపు 208 కేజీల  బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.  అత్యంత సున్నితమైన ఇండో-మయన్మార్ మరియు భారత్ -బంగ్లాదేశ్ సరిహద్దుల ద్వారా అక్రమంగా బంగారం రవాణా అవుతున్నదని  డీఆర్ఐ గుర్తించింది. 

భారతదేశ ఆర్థిక మూలాలను దెబ్బ తీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను  డీఆర్ఐ సకాలంలో గుర్తించి దాడులు చేసి అక్రమాలను సమర్ధంగా నిరోదిస్తోంది. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని అణచివేసేందుకు డీఆర్ఐ సిద్ధంగా ఉంది. 

 

***



(Release ID: 1825097) Visitor Counter : 108