మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
రేపు గౌహతిలో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ అధ్యక్షతన జరగనున్న 8 ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు
పోషకాహార లోపం సమస్యల పరిష్కారం, మహిళలు మరియు పిల్లల అభివృద్ధి, సాధికారత మరియు రక్షణ కోసం వ్యూహాత్మక కార్యక్రమాల రూపకల్పన కోసం ప్రాంతీయ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత వర్గాలతో చర్చలు
నాడు పోస్టు చేయడమైనది:
09 APR 2022 10:35AM by PIB Hyderabad
రేపు ( 2022 ఏప్రిల్ 10) గువాహటి లో కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ అధ్యక్షతన ఈశాన్య ప్రాంత ప్రాంతీయ సదస్సు జరగనున్నది. సదస్సులో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మిజోరం, మేఘాలయ, సిక్కిం మరియు నాగాలాండ్ రాష్ట్రాలు, సంబంధిత వర్గాల ప్రతినిధులు పాల్గొంటారు. ఇటీవల ప్రారంభించిన 3 మిషన్లు- పోషణ్ 2.0, వాత్సల్య మరియు శక్తి పథకాలు పూర్తి స్థాయిలో సమర్థంగా అమలు జరిగేలా చూసేందుకు అమలు చేయాల్సిన చర్యలను రూపొందించేందుకు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రాతీయ సదస్సులను నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత వర్గాలతో సమావేశాలను నిర్వహిస్తోంది. మంత్రిత్వ శాఖ గువాహటి లో మూడవ ప్రాంతీయ సదస్సు ను ఏర్పాటు చేసింది. అంతకుముందు, మొదటి సదస్సు ఏప్రిల్ 2న చండీఘర్, రెండవ సదస్సు ఏప్రిల్ 4న బెంగళూరు లో జరిగాయి.
అసమానతలు లేకుండా దేశం సమగ్రంగా సంపూర్ణంగా అభివృద్ధి సాధించేందుకు భారతదేశ జనాభాలో 67.7% వరకు ఉన్న మహిళలు, పిల్లలకు సాధికారత , రక్షణ కల్పించడం తో పాటు వారు సురక్షితమైన భద్రత చర్యలను అమలు చేయాల్సి ఉంటుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఇటీవల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం మూడు రక్షణ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది. మిషన్ పోషణ్ 2.0, మిషన్ శక్తి మరియు మిషన్ వాత్సల్య .కార్యక్రమాలను మిషన్ మోడ్ లో అమలు చేయాలనీ మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ మూడు మిషన్లను 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి అంటే 2021-22 నుంచి 2025-26 వరకు అమలు చేస్తారు. కేంద్ర ప్రాయోజిత పథకాలుగా ఈ మూడు మిషన్లు అమలు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యయ భాగస్వామ్య నిబంధనల ప్రకారం ఖర్చు-భాగస్వామ్య ప్రాతిపదికన అమలు చేస్తాయి. పథకం మార్గదర్శకాలు ఇప్పటికే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేయడం జరిగింది.
లింగ సమానత్వం మరియు పిల్లల కేంద్రీకృత చట్టం, విధానాలు మరియు కార్యక్రమాలను రూపొందించడం, మహిళలు పిల్లలకు వివక్ష, హింసకు తావులేని వాతావరణాన్ని సరసమైన, విశ్వసనీయమైన మార్గాల ద్వారా కల్పించి, మహిళలు పిల్లల కోసం రాష్ట్రాలు అమలు చేస్తున్న కార్యక్రమాల్లో లోపాలు సవరించాలన్న లక్ష్యంతో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పనిచేస్తోంది. దీనికోసం అన్ని మంత్రిత్వ, విభాగాలను సమన్వయం చేయవలసి ఉంటుంది. కార్యక్రమాలను అమలు చేసే బాధ్యత కలిగి ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్ర పాలిత ప్రాంతాల సహకారంతో లభించినప్పుడు మాత్రమే ఈ లక్ష్యాలను సాధించేందుకు అవకాశం కలుగుతుంది.
మూడు మిషన్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలకు అవగాహన కల్పించి, పథకాలు లక్ష్యాల మేరకు అమలు జరిగేలా చూడాలన్న ఉద్దేశంతో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. సహకార సమాఖ్య స్ఫూర్తి తో రానున్న అయిదు సంవత్సరాల కాలంలో మూడు మిషన్లను అమలు చేసి దేశంలో మహిళలు, పిల్లలకు అండగా నిలవాలని మంత్రిత్వ శాఖ భావిస్తోంది.
సమీకృత పోషకాహారం అందించడం లక్ష్యంగా మిషన్ పోషణ్ 2.0 అమలు జరుగుతుంది. పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులలో పోషకాహార లోపం సమస్యలు పరిష్కరించడానికి ఈ కార్యక్రమం ద్వారా చర్యలను అమలు చేయడం జరుగుతుంది. దీనికోసం పోషకాహారం అందించేందుకు వ్యూహాత్మక చర్యలను అమలు చేసి, ఆరోగ్యం,సంరక్షణ మరియు రోగనిరోధక శక్తిని పెంపొందించే పద్ధతులను అభివృద్ధి చేయడానికి మరియు ప్రోత్సహించడానికి మిషన్ పోషణ్ ద్వారా అవసరమైన చర్యలు అమలు జరుగుతాయి. అంగన్వాడీ సేవలు, కౌమార బాలికల పథకం మరియు పోషణ్ అభియాన్ పోషణ్ 2.0 దాని పరిధిలోకి వస్తాయి.
మహిళలు తమ జీవితంలో వివిధ దశలలో అభివృద్ధి సాధిస్తున్న సమయంలో అనేక సమస్యలు, సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది. అభివృద్ధిని నిరోధించే ఆటంకాలను, సంకెళ్లను తొలగించి సమగ్ర సంరక్షణ, భద్రత, రక్షణ, పునరావాసం మరియు సాధికారత ద్వారా మహిళలకు ఏకీకృత పౌర-కేంద్రీకృత జీవితచక్రం సహకారాన్ని మిషన్ శక్తి అందిస్తుంది. మిషన్ శక్తి కి అనుబంధంగా 'సంబల్' మరియు ' సామర్త్య' అనే రెండు ఉప పథకాలు అమలు జరుగుతాయి. మహిళల భద్రత మరియు భద్రత కోసం "సంబల్" ఉప పథకం, మహిళల సాధికారత కోసం "సామర్త్య" ఉప పథకం అమలు జరుగుతాయి.
దేశంలోని ప్రతి బిడ్డకు ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన బాల్యాన్ని అందించడం, పిల్లల అభివృద్ధికి సున్నితమైన, సహాయక మరియు సమకాలీకరించబడిన పర్యావరణ వ్యవస్థను పెంపొందించడం, జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 అమలు చేయడంలో రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు సహకారం అందించడం, ఎస్ డిజి లక్ష్యాలను సాధించడం లక్ష్యంగా మిషన్ వాత్సల్య అమలు జరుగుతుంది. చట్టబద్ధమైన సంస్థలు, సేవా కార్యక్రమాల వ్యవస్థలు, సంస్థాగత సంరక్షణ/సేవలు, సమాజ ఆధారిత సంరక్షణ, అత్యవసర ఔట్రీచ్ సేవలు, శిక్షణ మరియు సామర్థ్యం పెంపుదల మిషన్ వాత్సల్య లో భాగంగా అమలు జరుగుతాయి.
***
(రిలీజ్ ఐడి: 1815212)
సందర్శకుల సూచీ సంఖ్య : : 182