యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

మరింత సమర్థంగా యాంటీ డోపింగ్ పరీక్షలను నిర్వహించేందుకు ఉపయోగపడే అరుదైన ఆరు రసాయన రిఫరెన్స్ మెటీరియల్‌లను ఆవిష్కరించిన శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్


ఈ ఆవిష్కరణలతో యాంటీ డోపింగ్ రంగంలో భారతదేశం స్వావలంబన సాధిస్తుంది... శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్

Posted On: 03 APR 2022 1:46PM by PIB Hyderabad

యాంటీ డోపింగ్ పరీక్షల నిర్వహణ రంగంలో నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ ( ఎన్ డి టి ఎల్ ) పెద్ద ముందడుగు వేసింది. యాంటీ డోపింగ్ పరీక్షల నిర్వహణలో  వినియోగించే పదార్థాలలో  ఆరు అరుదైన రసాయన  పదార్థాలను  ( రిఫరెన్స్ మెటీరియల్స్) ( ఆర్ఎం) స్వదేశీ  పరిజ్ఞానంతో దేశీయంగా  సంస్థ అభివృద్ధి చేసింది.డోపింగ్ పరీక్షలను నిర్వహించేందుకు  ప్రపంచవ్యాప్తంగా వాడా గుర్తింపు పొందిన పరిశోధనా సంస్థలు స్వచ్ఛమైన ఈ రసాయనాలను వినియోగిస్తున్నాయి. ఈ ఆరు అత్యంత అరుదైన రసాయన పదార్ధాలను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నిపెర్)-గౌహతి మరియు సిఎస్ ఐ ఆర్ -ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (ఐఐఎం )జమ్మూ సహకారంతో  నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ  ఒక సంవత్సరం కంటే తక్కువ కాలంలో  అభివృద్ధి చేసింది. 

  నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ పాలకమండలి 15వ వార్షిక సమావేశంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ ఆరు ఆర్ఎంలను విడుదల చేశారు. కార్యక్రమంలో క్రీడల శాఖ కార్యదర్శి శ్రీమతి సుజాత చతుర్వేది క్రీడల మంత్రిత్వ శాఖ సీనియర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఆర్ఎం లను  కొన్ని పరిశోధనాశాలలు మాత్రమే అభివృద్ధి చేయగలిగాయి. ఆర్ ఏం లను అభివృద్ధి చేసిన సంస్థల జాబితాలో ఇప్పుడు దేశానికి చెందిన నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ స్థానం సంపాదించింది. రిఫరెన్స్ మెటీరియల్స్ ను అభివృద్ధి చేసిన సంస్థలను శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ అభినందించారు.  నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ అభివృద్ధి చేసిన  రిఫరెన్స్ మెటీరియల్స్ ప్రపంచంలో పూర్తి అందుబాటులో లేవని మంత్రి అన్నారు అయితే,యాంటీ డోపింగ్ పరీక్షణ నిర్వహణకు  వాడా గుర్తింపు పొందిన అన్ని పరిశోధన సంస్థలకు వీటి అవసరం ఉంటుందని మంత్రి వివరించారు. ప్రస్తుతం భారతదేశం వీటిని కెనడాఆస్ట్రేలియా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదని మంత్రి పేర్కొన్నారు.  ఆరు పదార్ధాలను స్వదేశంలో అభివృద్ధి చేసి  శాస్త్రీయ రంగంలో భారతదేశం పెద్ద అడుగు ముందుకు వేసిందని మంత్రి అన్నారు.  ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణం జరగాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును సాకారం చేసే దిశలో ఈ పదార్ధాల అభివృద్ధి జరిగిందని అన్నారు. త్వరలో వీటిని ఇతర దేశాలకు ఆరు ఆర్ఎంల ఎగుమతి ప్రారంభమవుతుందని మంత్రి అన్నారు. 

అత్యంత అరుదైన రసాయన పదార్ధాలు అందుబాటులోకి రావడంతో క్రీడా రంగంలో నిషేదిత పదార్ధాలను వినియోగించకుండా చూసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు మరింత పటిష్టంగా అమలు జరుగుతాయని శ్రీ ఠాకూర్ అన్నారు. క్రీడల రంగంలో వివిధ దేశాల మధ్య స్నేహ సంబంధాలు బలపడే దిశగా రిఫరెన్స్ మెటీరియల్స్ దోహద పడతాయని అన్నారు. 

రిఫరెన్స్ మెటీరియల్స్ అభివృద్ధి చేసేందుకు రెండు జాతీయ శాస్త్రీయ సంస్థలతో గత ఏడాది    నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.  20 రిఫరెన్స్ మెటీరియల్స్ ను దేశంలో అభివృద్ధి చేసి ఉత్పత్తి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించి 2-3 సంవత్సరాల లోగా వీటిని స్వదేశీ పరిజ్ఞానంతో దేశీయంగా ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. దశలవారీగా నిషేధిత పదార్థాలకు సంబంధించిన 20 రిఫరెన్స్ మెటీరియల్‌లను అభివృద్ధి చేయాలని మూడు సంస్థలు నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం నిధులతో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 

సిఎస్ ఐ ఆర్ -ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ , ఐఐఎం జమ్మూ సహకారంతో అభివృద్ధి చేసిన ఆరు రిఫరెన్స్ పదార్థాలను   మంత్రి ప్రారంభించారు. అంతకుముందు నిపీర్ గౌహతి తో కలిసి  నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ 2021లో రెండు రిఫరెన్స్ మెటీరియల్ ను అభివృద్ధి చేసింది.  ఈ రెండు రిఫరెన్స్ పదార్ధాలను వాడా గుర్తింపు పొందిన ఇతర పరిశోధన సంస్థలకు భారతదేశం అందించింది. 

ఈ రిఫరెన్స్ మెటీరియల్స్‌ను ప్రారంభించడం వల్ల దేశంలో డోపింగ్ నిరోధక కార్యక్రమాలను ప్రోత్సహించడం మరియు సమర్థవంతంగా అమలు చేసేందుకు అవకాశం కలుగుతుంది. మచ్చ లేకుండా క్రీడా కార్యకలాపాల నిర్వహణ కోసం క్రీడా మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మెరుగైన యాంటీ-డోపింగ్ పరీక్షలను నిర్వహించేందుకు వీలవుతుంది.

 

***



(Release ID: 1813053) Visitor Counter : 184