సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
“భారతీయుల గుండెల్లో నేతాజీ ఇంకా సజీవుడే!”
వెబినార్.లో ఆయన కుమార్తె అనితా బోస్ ప్రసంగం..
యువత తమ హృదయాల్లో దేశానికి సమున్నత స్థానం
కల్పించాలన్నది నేతాజీ కోరిక: రేణుకా మాలాకర్..
Posted On:
21 JAN 2022 4:01PM by PIB Hyderabad
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 జయంతి సందర్భంగా, “పరాక్రమ్ దివస్” ఉత్సవాల్లో భాగంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పి.ఐ.బి.) ఆధ్వర్యంలో ఒక వెబినార్ సదస్సును జైపూర్ నగరంలో నిర్వహించారు. జైపూర్ పి.ఐ.బి.కి అనుబంధించిన అవుట్ రీచ్ బ్యూరో (ఆర్.ఒ.బి.) ఈ సదస్సును నిర్వహించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా, జనవరి 23న జరిగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఇకపై పరాక్రమ్ దివస్.గా ప్రతి ఏటా జరుపుకోవాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఈ రోజు జరిగిన వెబినార్ సదస్సులో నేతాజీ కుమార్తె డాక్టర్ అనితా బోస్ ఫాఫ్, నేతాజీ మరో సమీప బంధువు రేణుకా మాలాకర్ ప్రధాన వక్తలుగా పాల్గొన్నారు. సీనియర్ పాత్రికేయుడు మహేశ్ చంద్ర శర్మ అతిథి వక్తగా వెబినార్ లో ప్రసంగించారు.
(వెబినార్.లో ప్రసంగిస్తున్న డాక్టర్ అనితా బోస్ ఫాఫ్)
జర్మనీనుంచి ఆన్ లైన్ ద్వారా వెబినార్ లో పాల్గొన్న డాక్టర్ అనితా బోస్ ఫాఫ్ మాట్లాడుతూ, మనదేశంలో నేతాజీ జీవించారని, ఇకపై కూడా జీవిస్తారని, భారతీయుల హృదయాల్లో ఇలాగే సజీవంగానే ఉంటారని అన్నారు. తన తండ్రి నేతాజీ హింధూ ధార్మిక వాది అయినప్పటికీ, మిగతా అన్ని మతాలపై గౌరవ ప్రపత్తులతో మెలిగారని అన్నారు. అన్ని మతాలవారు శాంతియుత సహజీవనం చేయగలిగే భారతదేశం గురించి తన తండ్రి కలగన్నారని డాక్టర్ అనితా చెప్పారు. స్త్రీ పురుష సమానత్వం గురించి నేతాజీ ఎంతగానో ప్రబోధించారని, స్త్రీ, పురుషులు సమాన హక్కుల కలిగి ఉండి, ఒకే రకం విధులు నిర్వర్తించే అవకాశాలున్న జాతి నిర్మాణం కోసం ఆయన కలలుగన్నారని ఆమె అన్నారు. తమను తాము ఉద్ధరించుకుని, సమూలంగా సంస్కరించుకోవలసిన బాధ్యత మహిళలపైనే ఉందని, మహిళలు విజయం సాధించాలని, విజయం సాధించే సత్తా వారికి ఉందని ఆమె అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం, స్వాతంత్ర్య సమరంలో, జాతి నిర్మాణంలో ఆయన నిర్వహించిన పాత్ర గురించి డాక్టర్ అనితా బోస్ విపులంగా వివరించారు. భారత దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని నేతాజీ భావించేవారని, భారతదేశానికి స్వాతంత్ర్యం రాక మునుపే ఒక ప్రణాళికా సంఘాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశారని ఆమె చెప్పారు.
వెబినార్ సదస్సులో పాలుపంచుకున్న రేణుకా మాలాకర్,.. ఢిల్లీలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐ.ఎన్.ఎ. ట్రస్టు ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేశారు. ఇపుడు అదే సంస్థ ట్రస్టీగా ఆమె వ్యవహరిస్తున్నారు. వెబినార్ సదస్సులో ఆమె మాట్లాడుతూ,..తన దేశప్రజలపట్ల నేతాజీకి ఎంతో ప్రేమానురాగాలతో ఉండేవారని అన్నారు. యువతే భారతదేశానికి భవిష్యత్తు అని, యువత తమ హృదయాల్లో దేశానికి సమున్నత స్థానం కల్పించాలని, అదే జరిగితే భారతదేశ ప్రగతిని ఎవరూ అడ్జుకోజాలరని రేణుకా మాలాకర్ అన్నారు.
(వెబినార్.ను ఉద్దేశించి రేణుకా మాలాకర్ ప్రసంగం)
నేతాజీ జీవితం గురించి సీనియర్ పాత్రికేయుడు, రచయిత మహేశ్ చంద్ర శర్మ మాట్లాడుతూ, జాతికి సుభాష్ చంద్రబోస్ ఎంతో అగ్రశ్రేణి ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. సమైక్యమైన, శక్తివంతమైన జాతికోసం,.. కుల, మత వివక్షకు తావులేని దేశంకోసం యువత పాటుపడాలని పిలుపునిచ్చారు. జాతిపట్ల సుభాష్ చంద్రబోస్ ప్రదర్శించిన అంకితభావం ప్రస్తుతం భారతదేశంలో యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిపోవాలని మహేశ్ చంద్ర శర్మ అన్నారు.
అంతకు ముందు పి.ఐ.బి. ప్రాంతీయ విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ (ఎ.డి.జి.) డాక్టర్ ప్రజ్ఞా పలీవాల్ గౌర్ వెబినార్.లో స్వాగతోపన్యాసం చేశారు. తమ విలువైన సమయాన్ని వెబినార్ సదస్సుకోసం కేటాయించిన నేతాజీ కుమార్తె అనితా బోస్.కు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ అనితా బోస్, రేణుకా మాలాకర్ ఈ సదస్సులో పాల్గొనడం తమకు లభించిన గౌరవమని ఆమె అన్నారు. దేశానికి నేతాజీ అందించిన అంచంచలమైన స్ఫూర్తికి, నిస్వార్థ సేవకు గుర్తింపుగా ప్రతి ఏడాది జననవరి 23న జరిగే నేతాజీ జయంతిని “పరాక్రమ దివస్”గా పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆమె చెప్పారు. దేశ ప్రజలకు, ప్రత్యేకించి యువతకు స్ఫూర్తిని కలిగించేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పలీవాల్ తెలిపారు.
ఈ వెబినార్ సదస్సులో 200మందికి పైగా పాలుపంచుకున్నారు. సరిహద్దు భద్రతా దళం (బి.ఎస్.ఎఫ్.) సైనికులు, నేషనల్ కేడెట్ కోర్ (ఎన్.సి.సి.) కేడెట్లు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ వలంటీర్లు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ఇతర అధికారులు ఈ వెబినార్ సదస్సులో పాలుపంచుకున్నారు. స్వాతంత్ర్య సమరంలో సుభాష్ చంద్రబోస్ పోషించిన పాత్రపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ రూపొందించిన వీడియోను వెబినార్ చివర్లో ప్రదర్శించారు. ఈ వెబినార్ సదస్సును జైపూర్ పి.ఐ.బి. కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ పవన్ సింగ్ ఫౌజ్దార్ నిర్వహించారు.
****
(Release ID: 1791688)
Visitor Counter : 160