గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఢిల్లీ హట్ లో జరుగుతున్న ఆది మహోత్సవ్ లో ట్రైఫెడ్తో కలిసి దౌత్యవేత్తల దినోత్సవాన్ని నిర్వహించిన భారత విదేశాంగ శాఖ
Posted On:
28 NOV 2021 11:47AM by PIB Hyderabad
ఢిల్లీ హట్ లో జరుగుతున్న ఆది మహోత్సవ్ లో ట్రైఫెడ్తో కలసి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం( 2021 నవంబర్ 27) దౌత్యవేత్తల దినోత్సవాన్ని నిర్వహించింది. భారత గిరిజన సంస్కృతి, వారసత్వాన్ని విదేశీయులకు పరిచయం చేసి, స్థానికులకు సాధికారత కల్పించి, స్వావలంబన భారతదేశాన్ని నిర్మించాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్యక్రమానికి దేశంలో పనిచేస్తున్న 20 దేశాల రాయబార కార్యాలయాలకు చెందిన దాదాపు 100 మంది దౌత్యవేత్తలు,విదేశాంగ శాఖ ఇతర మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు హాజరయ్యారు.
పోలాండ్, కిరిబాటి, దక్షిణ కొరియా, మెక్సికో, థాయిలాండ్, లావోస్, స్విట్జర్లాండ్, బంగ్లాదేశ్, మాల్దీవులు, అమెరికా, బ్రెజిల్ తదితర 20 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ఉన్నారు. ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.
దేశం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన కళాకారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రముఖులు సందర్శించారు. వీటిలో ప్రదర్శించిన అరుదైన హస్త కళలను చూసి వీరు ఆశ్చర్యానికి గురయ్యారు. వీటి వివరాలను తెలుసుకోవడానికి ఆసక్తి కనబరిచారు. 200 స్టాళ్లలో ప్రత్యేకమైన హస్తకళల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వీటిలో చేతితో చేసిన వస్త్రాల నుంచి ఆభరణాలు, బొమ్మలు, పెయింటింగ్లు ఉన్నాయి. గిరిజన కళలు, బొమ్మల తయారీ అంశాలపై ప్రముఖులకు అధికారులు సమగ్రంగా వివరించారు. సందర్శకుల ఎదుట కుండలు, గాజులు తయారు చేసే విధానాన్ని ప్రత్యక్షంగా తెలిపిన గిరిజనులు, వారి కళ్ళ ముందు బొమ్మలు గీసి ఆకట్టుకున్నారు. గిరిజనులు తమ సంస్కృతిలో భాగమైన తోలు బొమ్మలాట ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ట్రైఫెడ్ ఆది మహోత్సవ్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. గిరిజన కళాకారులు, అడవుల్లో నివసిస్తున్న వారిని జన జీవన శ్రవంతిలోకి తీసుకుని వచ్చి వారి సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు ట్రైఫెడ్ అధికారులు వివరించారు. ఆది మహోత్సవ్ ఒక చిన్న గిరిజన భారత దేశంగా ఏర్పాటయింది. దేశం వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజనులు తమ సంస్కృతి, కళలు ప్రదర్శిస్తున్నారు. గిరిజన వంటకాలు కూడా ఇక్కడ లభిస్తున్నాయి. ప్రతి ఏటా దేశం వివిధ ప్రాంతాల్లో దాదాపు 500 ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నామని ట్రైఫెడ్ అధికారులు వివరించారు.
గిరిజన కళాకారులు, గిరిజనుల జీవన శైలిని అధికారులు వివరించారు. గిరిజనులకు సాధికారత కల్పించి, ఆర్ధికంగా వారు అభివృద్ధి సాధించడానికి అమలు చేస్తున్న చర్యలను ట్రైఫెడ్ అధికారులు వివరించారు. గిరిజన వంటకాలను సందర్శకులు రుచి చూసారు. వీటిలో జమ్మూ మరియు కాశ్మీర్ వంటకం మటన్ సీక్ కబాబ్, ఒడిశా ఫిష్ పకోరా, జమ్మూ మరియు కాశ్మీర్ చమన్ పనీర్, రాజస్థాన్ బెసంకిగట్టేకి సబ్జీ, తెలంగాణ మటన్ మరియు చికెన్ బంజారా బిర్యానీ, మధ్యప్రదేశ్ బజ్రా మరియు మక్కెకి రోటీ, గుజరాత్ మూంగ్ కా హల్వా వంటి కొన్ని ప్రత్యేక గిరిజన వంటకాలను విదేశీయలు రుచి చూసారు.
గ్రామీణ వికాస్ చేతన్ సంస్థాన్, బార్మర్ రేపు సాయంత్రం గిరిజన హస్తకళలు, చేనేత మరియు ఉపకరణాలపై ప్రత్యేక ప్రదర్శన నిర్వహిస్తుంది. ఇది గిరిజనుల కళాత్మక సంప్రదాయం మరియు నైపుణ్యానికి వేదికగా నిలిచి వారి ప్రత్యేక ఉత్పత్తులనుపరిచయం చేస్తుంది.
ఒక మినీ భారతదేశాన్ని తలపిస్తున్న ఆది మహోత్సవ్ అన్ని వర్గాలకు చెందిన ప్రజలను ఆకర్షిస్తోంది. బహుమతులుగా ఇవ్వడానికి ఉపయోగపడే అనేక వస్తువులను దీనిలో ప్రదర్శిస్తున్నారు. సాధారణ వినియోగానికి రోగ నిరోధక శక్తిని పెంచే వివిధ ఉత్పత్తులను దీనిలో విక్రయిస్తున్నారు. వీటిలో గిరిజన ఉత్పత్తులైన ఎండు ఉసిరి , అడవి తేనె, నల్ల మిరియాలు, దాలియా, మిరపకాయ, రాగులు , త్రిఫల మరియు పప్పు మిశ్రమాలైన మూంగ్ పప్పు, ఉరద్ పప్పు , వైట్ బీన్స్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు బొమ్మలు, హస్త కళలు ఆభరణాలు, పూసలతో చేసిన నెక్లెస్లు, ఎరి సిల్క్, చండేరీ సిల్క్, తోలు బొమ్మలు, చిన్న పిల్లల ఆటవస్తువులు, డోంగ్రియా శాలువాలు మరియు బోడో నేయడం వంటి సాంప్రదాయ అల్లికలు, తోడా ఎంబ్రాయిడరీ మరియు కోట-డోరియా దుపట్టాలు, ఇనుము రాతి కుండలు లాంటి 1500 వస్తువులను దీనిలో ప్రదర్శిస్తున్నారు.
రాజస్థాన్ నీలి కుండలు, కోట డోరియా ఫాబ్రిక్, మధ్యప్రదేశ్ చందేరి మరియు మహేశ్వరి సిల్క్, బాగ్ ప్రింట్, ఒడిషా పట్టచిత్ర, కర్ణాటక బిద్రివేర్, ఉత్తరప్రదేశ్ బనారసీ సిల్క్, పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ టీ, కాలా, హిమాచల్ ప్రదేశ్ జీరా, చాలా కారంగా ఉండే నాగా మిరపకాయ మరియు ఈశాన్యం నుంచి పెద్ద ఏలకులు వంటి ప్రసిద్ధ, సున్నితమైన వస్తువులను ప్రత్యేక జీఐ స్టోర్ లో సందర్శించవచ్చు.
స్థానికులకు సాధికారత కల్పించి, ఆత్మ నిర్భర్ సాధనకు ప్రయత్నాలు ముమ్మరం కావడంతో గత ఏడాది నుంచి భౌగోళిక అంశాలకు ప్రాధాన్యత లభిస్తోంది. గిరిజన వ్యవహారాల శాఖ, ట్రైఫెడ్ లు గిరిజన ఉత్పత్తులకు జియో టాగింగ్ చేస్తూ వాటికి ప్రత్యేక గుర్తింపు లభించి మార్కెట్ కల్పించి గిరిజనులకు సాధికారత కల్పించడానికి కృషి చేస్తున్నాయి. ఈ చర్యతో గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వల్ల అంతరించి పోతున్న గిరిజన కళలు, సంస్కృతి పూర్వ వైభవం కలుగుతుంది.
అవసరాలు మరియు బడ్జెట్పై ఆధారపడి ఈ ఉత్పత్తులను గిఫ్ట్ హాంపర్లుగా సిద్ధం చేయడానికి సౌకర్యాలు కల్పించారు. ట్రైబ్స్ ఇండియా కోసం ప్రత్యేకంగా ప్రఖ్యాత డిజైనర్ శ్రీమతి రినా ఢాకా రూపొందించిన ప్రీమియం ఆర్గానిక్, రీసైక్లింగ్, సస్టైనబుల్ ప్యాకింగ్ మెటీరియల్తో ప్యాక్ చేయబడే ఈ వస్తువులు ఏ సందర్భానికైనా బహుమతులుగా ఉంటాయి.
గిరిజన కళలు, సంస్కృతి, ఆలోచనలకు ప్రతి రూపంగా ఏర్పాటైన ఆది మహోత్సవ్ న్యూ ఢిల్లీలోని ఢిల్లీ హట్ లో ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు సందర్శించవచ్చు.
గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు కృషి చేసి స్థానికులకు సాధికారత కల్పించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
***
(Release ID: 1776019)
Visitor Counter : 184