ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో 2025 నాటికీ టీబీ ని నిర్మూలించడానికి అమలు చేయాల్సిన వ్యూహం పై డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించిన మేధోమథన సమావేశం


కోవిడ్-19 వల్ల కలిగిన అవాంతరాలను దృష్టిలో ఉంచుకుని వేగంగా లక్ష్యాలను సాధించడానికి వినూత్న చర్యలను అమలు చేయాలి : డాక్టర్ పవార్

' అన్ని వర్గాల సహకారంతో టీబీని ముందుగా గుర్తించి, వ్యాధి వ్యాప్తి చెందకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం: డాక్టర్ పవార్

Posted On: 10 NOV 2021 1:28PM by PIB Hyderabad

దేశంలో 2021 నాటికి టీబీ ని  నిర్మూలించడానికి అమలు   చేయాల్సిన వ్యూహం పై  కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ అధ్యక్షతన  ఈరోజు మేధోమథన చర్చలు జరిగాయి. 

ఎస్ డి జి నిర్ణయించిన లక్ష్యాల కంటే ఐదు సంవత్సరాల ముందుగా 2025 నాటికి దేశంలో టీబీని నిర్మూలించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సూచనలకు అనుగుణంగా పనిచేస్తూ లక్ష్యాలను సాధించడానికి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని డాక్టర్ పవార్ అన్నారు.' లక్ష్యాన్ని సాధించడానికి మనకు 37 నెలల సమయం మాత్రమే ఉంది లక్ష్య సాధనలో కోవిడ్-19 రూపంలో అడ్డంకులు ఎదురయ్యాయి. అడ్డంకుల వల్ల కలిగిన జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని వినూత్న పరిష్కార మార్గాలను అమలు చేసి గడువు లోగా దేశంలో టీబీని నిర్మూలించాలని' అని డాక్టర్ పవార్ పేర్కొన్నారు. 

టీబీని నిర్మూలించాలన్న పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని డాక్టర్ పవార్ స్పష్టం చేశారు. కోవిడ్-19 రూపంలో ఎదురైన అవాంతరాలను తట్టుకుని మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్, టీబీ చికిత్స వేగంగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. టీబీ రోగులకు అందిస్తున్న ఆర్ధిక సహాయం, సరఫరా చేస్తున్న పోషక ఆహారంలో అంతరాయం లేకుండా చూశామని అన్నారు. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం ద్వారా చేసిన ప్రయత్నాలు వ్యాధి నిర్ధారణచికిత్స విధానం మెరుగు పడేలా చూశాయని దీనితో మెరుగైన ఫలితాలు  వచ్చాయని అన్నారు. వ్యాధిని త్వరగా గుర్తించడం, చికిత్సను అందించడం టీబీ నిర్మూలనలో కీలక అంశాలుగా ఉంటాయని డాక్టర్ పవార్ అన్నారు. దీనివల్ల టీబీ కేసులను తగ్గించి వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చునని మంత్రి అన్నారు. దేశంలో టీబీని అంతమొందించడానికి అమలు చేస్తున్న జాతీయ వ్యూహాత్మక ప్రణాళికలో నివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి వివరించారు. నివారణా చర్యలను అమలు చేస్తూ వికేంద్రీకృత విధానాల ద్వారా చికిత్సను రోగులకు సులువుగా అందించడానికి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా చూడడానికి, వ్యాధి సోకినవారు కోలుకోవడానికి దోహదపడే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. 

టీబీ నివారణకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను మంత్రి వివరించారు. సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో టీబీని చేర్చి ఆయుష్మాన్ భారత్ పథకంతో అనుసంధానం చేశామని డాక్టర్ పవార్ తెలిపారు. ప్రజలతో సహా అన్ని వర్గాల సహకారాన్ని తీసుకుని టీబీ కేసులను ముందుగా గుర్తించి చికిత్స అందిస్తూ కొత్త కేసులు నమోదు కాకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు.  దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. టీబీ నివారణకు మందులు, కార్యక్రమాలు, వ్యూహాలు అవసరమని పేర్కొన్న మంత్రి ఈ దిశలో సాగుతున్న పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆశించిన ఫలితాలు ఇస్తాయన్న ధీమాను వ్యక్తం చేశారు. 

వ్యాధిని  ముందుగా గుర్తించడం, చికిత్సా విధానాలను  పరచడం, సామాజిక సంక్షేమ కార్యక్రమాలతో కలిసే మార్గాలను అభివృద్ధి చేయడంప్రైవేట్ రంగ సహకారాన్ని తీసుకోవడం  , జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమాన్ని  ఆరోగ్య వ్యవస్థతో అనుసంధానం చేయడం లాంటి  అంశాలు సదస్సులో చర్చకు  వచ్చాయి. 

అదనపు కార్యదర్శి (ఆరోగ్యం) శ్రీమతి ఆర్తి అహుజా, డా. సుదర్శన్ మండల్, డాక్టర్. నిశాంత్ కుమార్, డాక్టర్. సంజయ్  మట్టూ, డాక్టర్ రఘురామ్ రావు, డాక్టర్ అలోక్ మాథుర్ రాష్ట్ర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

***


(Release ID: 1770836) Visitor Counter : 200