ప్రధాన మంత్రి కార్యాలయం

చతుర్దేశాధినేతల సమావేశం : సమాచార పత్రం

Posted On: 25 SEP 2021 10:44AM by PIB Hyderabad

   అమెరికాలోని శ్వేత సౌధంలో చతుర్దేశాధినేతల తొట్టతొలి వ్యక్తిగత శిఖరాగ్ర సమావేశంలో భాగంగా అధ్యక్షుడు బైడెన్‌ సెప్టెంబరు 24న భారత, జపాన్‌, ఆస్ట్రేలియా ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, యోషిహిడే సుగా, స్కాట్‌ మోరిసన్‌లకు ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనడంలో ఆచరణాత్మక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం సహా స్నేహ సంబంధాల బలోపేతానికి తోడ్పడే విశిష్ట చర్యలు చేపట్టాలని అధినేతలు ఆకాంక్షించారు. ఈ మేరకు కోవిడ్‌-19 అంతం దిశగా సురక్షిత, ప్రభావశీల టీకాల ఉత్పత్తి-లభ్యత పెంపు, ఉన్నత ప్రమాణాలతో మౌలిక వసతులకు ప్రోత్సాహం, వాతావరణ మార్పు సంక్షోభ నిరోధం, ఆవిష్కరణాత్మక సాంకేతిక పరిజ్ఞానాల్లో భాగస్వామ్యం, అంతరిక్షం, సైబర్‌ భద్రత, నాలుగు దేశాల్లోనూ భవిష్యత్తరం ప్రతిభాపాటవాల వృద్ధి వంటివి ఈ చర్యలలో భాగంగా ఉన్నాయి.

కోవిడ్‌ - అంతర్జాతీయ ఆరోగ్యం

   కోవిడ్‌-19 మహమ్మారి తమ నాలుగు దేశాలతోపాటు ప్రపంచమంతటా జన జీవనానికి, జీవనోపాధి మార్గాలకు అత్యంత ప్రధాన పెనుముప్పుగా పరిణమించిందని చతుర్దేశాధినేతలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇండో-పసిఫిక్‌ ప్రాంతంసహా ప్రపంచవ్యాప్తంగా సురక్షిత-ప్రభావశీల టీకాల సమాన లభ్యత దిశగా చతుర్దేశాధినేతలు మార్చి నెలలో చతుర్దేశ టీకా భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టారు. అప్పటినుంచీ సురక్షిత-ప్రభావశీల కోవిడ్‌-19 టీకాల ఉత్పత్తి సామర్థ్యం విస్తరణతోపాటు విరాళం రూపంలో స్వయంగా సరఫరా చేయడానికి సాహసోపేత చర్యలు చేపట్టారు. తద్వారా మహమ్మారిపై ఇండో-పసిఫిక్‌ ప్రాంత దేశాల సత్వర ప్రతిస్పందనకు కలసికట్టుగా కృషి చేశారు. ఈ సహకార భాగస్వామ్యంలో చతుర్దేశ నిపుణుల బృందం కీలకపాత్ర పోషించింది. ఆ మేరకు మహమ్మారి తాజా ధోరణుల గురించి వివరించేందుకు క్రమం తప్పకుండా సమావేశమైంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంత దేశాల్లో అంతటా కోవిడ్-19పై నాలుగు దేశాల సమష్టి ప్రతిస్పందనను సమన్వయం చేసింది. అదే సమయంలో చతుర్దేశ కోవిడ్‌-19 డ్యాష్‌బోర్డ్‌ భాగస్వామ్యాన్ని ముందుండి నడిపించింది. ఈ సంయుక్త కృషి కొనసాగుతుందని స్పష్టం చేయడం కోసం అధ్యక్షుడు బైడెన్‌ సెప్టెంబర్‌ 22న కోవిడ్‌-19పై సమావేశం ఏర్పాటు చేయడంపై దేశాధినేతలు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు చతుర్దేశ కూటమి చేపట్టే చర్యలు కిందివిధంగా ఉంటాయి:

ప్రపంచవ్యాప్తంగా టీకాల పూర్తికి సాయం: చతుర్దేశ కూటమి హోదాలో ‘కోవాక్స్‌’ద్వారా టీకాలకు ఆర్థిక సహాయం అందించడంతోపాటు అంతర్జాతీయంగా 1.2 బిలియన్‌ టీకాలను విరాళంగా ఇవ్వడానికి మేం సంకల్పించాం. ఈ మేరకు ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో మేం ఇప్పటిదాకా 79 మిలియన్ల సురక్షిత-ప్రభావశీల టీకాలను సమష్టిగా సరఫరా చేశాం. ఈ వేసవి-శీతాకాలం మధ్య మా టీకాల భాగస్వామ్యం సరైన దిశగా సాగుతూ ‘బయోలాజికల్‌ ఇ లిమిటెడ్‌’ ద్వారా ఉత్పత్తి విస్తరణను కొనసాగించింది. దీనివల్ల 2022 నాటికి ఆ సంస్థ కనీసం 1 బిలియన్‌ కోవిడ్‌-19 టీకాలను ఉత్పత్తి చేయగలదు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో మహమ్మారి అంతంలో సాయపడటం కోసం ఈ కొత్త ఉత్పాదక సామర్థ్యం వైపు తొలి చర్యగా దేశాధినేతలు సాహసోపేత చర్యలు చేపట్టాం. టీకాల ఉత్పత్తికి తగినట్లు సార్వత్రిక, సురక్షిత సరఫరా వ్యవస్థల ప్రాముఖ్యాన్ని కూడా మేం గుర్తించాం. ఇందులో భాగంగా 2021 అక్టోబరు నుంచి ‘కోవాక్స్‌’సహా సురక్షిత-ప్రభావశీల కోవిడ్‌-19 టీకాల ఎగుమతులను పునఃప్రారంభిస్తామన్న భారత్‌ ప్రకటనపై చతుర్దేశ కూటమి హర్షం ప్రకటిస్తోంది. ఇక సురక్షిత-ప్రభావశీల-నాణ్యమైన టీకాల కొనుగోలు కోసం జపాన్‌ ప్రభుత్వం 3.3 బిలియన్‌ డాలర్ల  ‘కోవిడ్‌-19 అత్యవసర సంక్షోభ ప్రతిస్పందన మద్దతురుణ కార్యక్రమం’ కింద ప్రాంతీయ దేశాలకు సహాయం కొనసాగిస్తుంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా టీకాల కొనుగోలు కోసం ఆగ్నేయాసియా, పసిఫిక్‌ దేశాలకు 212 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం అందిస్తుంది. అంతేకాకుండా చిట్టచివరి దశవరకూ సరఫరా కోసం మరో 219 మిలియన్‌ డాలర్లు కేటాయించడంసహా ఈ దిశగా ఆ ప్రాంతాల్లో చతుర్దేశ కూటమి చర్యలను సమన్వయం చేస్తుంది. దీంతోపాటు ‘ఆసియాన్‌’ సచివాలయం, ‘కోవాక్స్‌ వ్యవస్థ, ఇతర సంబంధిత సంస్థల’తో చతుర్దేశ కూటమి సభ్య దేశాలు సమన్వయ బాధ్యతను నిర్వర్తిస్తాయి. ప్రజానీకం ప్రాణరక్షణలో ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ, కోవాక్స్‌, గవి, సెపి, యూనిసెఫ్‌’ వంటి అంతర్జాతీయ సంస్థలు, జాతీయ ప్రభుత్వాల కృషికి మద్దతు కొనసాగింపుతోపాటు బలోపేతం చేయడాన్ని మేం కొనసాగిస్తాం. అదే సమయంలో టీకాలపై విశ్వాసం, నమ్మకం బలోపేతం చేయటానికి దేశాధినేతలుగా మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ఆ మేరకు టీకాలపై  సందిగ్ధం తొలగింపు లక్ష్యంగా జరిగే 75వ ప్రపంచ ఆరోగ్య సమావేశంలో భాగంగా చతుర్దేశ కూటమి ఒక కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

ప్రాణాలకు తక్షణ రక్షణ: ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తక్షణ ప్రాణరక్షణ దిశగా కార్యాచరణను ముమ్మరం చేయడానికి చతుర్దేశ కూటమి కట్టుబడి ఉంది. తదనుగుణంగా కోవిడ్‌-19 టీకాలు, చికిత్సకు ఔషధాలుసహా ఆరోగ్య సంరక్షణ రంగంలో పెట్టుబడులను సుమారు 100 మిలియన్‌ డాలర్ల స్థాయికి పెంచేందుకు ‘జపాన్‌ బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌’ ద్వారా భారత్‌తో సంయుక్తంగా జపాన్‌ కృషిచేస్తుంది. మొత్తంమీద మేము చతుర్దేశ టీకా నిపుణుల బృందం సేవలను వినియోగించుకోవడంతోపాటు మా అత్యవసర సహాయానికి సంబంధించి అత్యవసర సంప్రదింపుల కోసం అవసరమైనప్పుడల్లా సమావేశమవుతాం.

మెరుగైన ఆరోగ్య భద్రత పునరుద్ధరణ: భవిష్యత్‌ మహమ్మారులను ఎదుర్కొనడం కోసం మన దేశాల్లో మెరుగైన సంసిద్ధత కల్పనకు చతుర్దేశ కూటమి కట్టుబడి ఉంది. ఆ మేరకు ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో మేం చేపట్టిన విస్తృత కోవిడ్‌-19 ప్రతిస్పందన ఆరోగ్య-భద్రత కార్యకలాపాల సమన్వయ కల్పనను మేం కొనసాగిస్తాం. దీంతోపాటు 2022లో మహమ్మారి సంసిద్ధతపై కనీసం ఒక సమావేశం లేదా ప్రయోగాత్మక కసరత్తును సంయుక్తంగా నిర్వహిస్తాం. ఇప్పుడే కాకుండా భవిష్యత్తుల్లోనూ సురక్షిత-ప్రభావశీల టీకాలు, చికిత్స, రోగనిర్ధారణ సదుపాయాలు వంటివన్నీ 100 రోజుల్లోగా లభ్యమయ్యేలా చూసే ‘100 రోజుల ఉద్యమాని’కి మా శాస్త్ర-సాంకేతిక సహకారాన్ని, మద్దతును మరింత బలోపేతం చేస్తాం. అంతర్జాతీయంగా కోవిడ్‌-19 చికిత్స విధానాలు, టీకాల సంబంధిత ఆవిష్కరణల వేగవంతం దిశగా నిర్వహించే ప్రస్తుత-భవిష్యత్‌ ప్రయోగాత్మక పరీక్షలకు సంయుక్త సహకారం ఇందులో బాగంగా ఉంటుంది. ఈ ప్రయోగాత్మక పరీక్షల ద్వారా సరికొత్త రోగ నిర్ధారణ, కొత్త టీకాలు, చికిత్స విధానాలు ఆవిష్కృతమవుతాయి. అదే సమయంలో తమ శాస్త్రీయ సుస్థిర వైద్య పరిశోధనల మెరుగు దిశగా సామర్థ్యం పెంచుకోవడంలో ఈ ప్రాంతంలోని దేశాలకు తోడ్పాటు లభిస్తుంది. ‘అంతర్జాతీయ మహమ్మారి రాడార్‌’ ఏర్పాటుకు పిలుపును మేం సమర్థిస్తున్నాం... తదనుగుణంగా వైరస్‌ జన్యుక్రమంపై నిఘాను మెరుగుపరుస్తాం. దీంతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థల చేపట్టిన అంతర్జాతీయ ఇన్‌ఫ్లూయెంజా నిఘా-ప్రతిస్పందన వ్యవస్థ’ విస్తరణ, బలోపేతానికి సమష్టిగా కృషి చేస్తాం.

మౌలిక సదుపాయాలు

   డిజిటల్‌ అనుసంధానం, వాతావరణం, ఆరోగ్యం, ఆరోగ్య భద్రత, లింగసమానత్వం ప్రాతిపదికగాగల మౌలిక సదుపాయాల కల్పనపై ‘మెరుగైన ప్రపంచ పునరుద్ధరణ’ (బి3డబ్ల్యూ) పేరిట జి-7 దేశాల కూటమి పిలుపునిచ్చింది. తదనుగుణంగా ఈ ప్రాంతంలోని ప్రస్తుత మౌలిక సదుపాయాల కల్పన చర్యలకు అవసరమైన నైపుణ్యం, సామర్థ్యం, ప్రభావశీలతను చతుర్దేశ కూటమి బలోపేతం చేస్తుంది. దీంతోపాటు ఆయా దేశాల్లో అవసరాలకు తగిన కొత్త అవకాశాలను గుర్తించేందుకు కృషి చేస్తుంది. ఈ మేరకు చతుర్దేశ కూటమి చేపట్టే చర్యలు కిందివిధంగా ఉంటాయి:

చతుర్దేశ మౌలిక సదుపాయాల సమన్వయ బృందం ఏర్పాటు: ఉన్నత ప్రమాణాలుగల మౌలిక సదుపాయాల విషయంలో చతుర్దేశ కూటమి భాగస్వాముల ప్రస్తుత అగ్రస్థానం ఆధారంగా ఒక సీనియర్‌ చతుర్దేశ మౌలిక సదుపాయాల సమన్వయ బృదం ఏర్పాటవుతుంది. ప్రాంతీయ మౌలిక వసతుల అవసరాలపై అంచనాల వివరాలు పంచుకునేందుకు ఇది క్రమం తప్పకుండా సమావేశమవుతుంది. పారదర్శక, ఉన్నత ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాల కల్పనకు అనుసరించాల్సిన విధానాలను సమన్వయం చేస్తుంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో మౌలిక సదుపాయాల డిమాండ్‌ను గణనీయంగా తీర్చడంలో మా వంతు కృషిని బలోపేతం చేస్తాం. అలాగే ఈ కృషి పరస్పర సహాయకరం అయ్యేవిధంగా సాంకేతిక మద్దతు, సామర్థ్యం పెంపు ప్రయత్నాలను ప్రాంతీయ భాగస్వాముల తోడ్పాటుతో ఈ బృందం సమన్వయం చేస్తుంది.

ఉన్నత ప్రమాణాల మౌలిక సదుపాయాల కల్పనకు నేతృత్వం: ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో నాణ్యమైన మౌలిక సదుపాయాల నిర్మాణంలో చతుర్దేశ కూటమి భాగస్వాములదే అగ్రస్థానం. ఆ మేరకు గరిష్ఠ ప్రభావం సాధించే దిశగా ప్రభుత్వ, ప్రైవేటు వనరుల సమీకరణలో మా పరస్పర సహకార విధానాలను సమీకృతం చేస్తాం. కాగా, ఈ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన కోసం 2015 నుంచీ చతుర్దేశ కూటమి భాగస్వామ్య దేశాలు 48 బిలియన్‌ డాలర్లకుపైగా అధికారికంగా ఆర్థిక సహాయం అందించాయి. ఈ సాయంతో 30కిపైగా దేశాల్లో సామర్థ్యం పెంపుసహా వేలాది ప్రాజెక్టులు చేపట్టబడ్డాయి. గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య మౌలిక వసతులు, నీటి సరఫరా, పరిశుభ్రత-పారిశుధ్యం, పునరుత్పాదక (ఉదా॥ పవన, సౌర, జల) విద్యుదుత్పాదన, టెలికం సదుపాయాలు, రోడ్డు రవాణా వంటివి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఉన్నాయి. మా మౌలిక సదుపాయాల భాగస్వామ్యం ఈ కృషిని ఇంకా విస్తరించి ఈ ప్రాంతంలో మరిన్ని ప్రైవేట్ రంగ పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా నిలుస్తుంది.

వాతావరణం

   తాజా వాతావరణ శాస్త్రానికి సంబంధించి వాతావరణ మార్పు స్థితిగతులపై అంతర ప్రభుత్వ కమిటీ ఆగస్టునాటి తన నివేదికలో వెల్లడించిన అంశాలపై చతుర్దేశ కూటమి దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వాతావరణం విషయంలో తలెత్తే గణనీయ సమస్యలను ఈ నివేదిక స్పష్టంగా ఎత్తిచూపింది. ఈ నేపథ్యంలో వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా అత్యవసర చర్యలు చేపట్టడంపై చతుర్దేశ కూటమి దృష్టి సారించింది. ఆ మేరకు వాతావరణ మెరుగుదల లక్ష్యాల సాధనకు కృషి చేయాలని చూస్తున్నాయి. ఇందులో 2030 నాటికి జాతీయ ఉద్గారాల తగ్గింపు, పరిశుభ్ర ఇంధన ఆవిష్కరణ-వినియోగం, అనుసరణ, స్థితిస్థాపకత, సంసిద్ధతలు భాగంగా ఉన్నాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో నిర్దేశించుకున్న వాతావరణ లక్ష్యాలను సాధించే ముమ్మర చర్యల కింద 2020లో అంచనావేసిన ఇంధన డిమాండ్‌ తీర్చడానికి చతుర్దేశ కూటమి కట్టుబాటును ప్రకటించింది. తదనుగుణంగా భారీస్థాయిలో వేగంగా కర్బనరహిత పరిస్థితుల సృష్టికి నిర్ణయించింది. తద్వారా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో వాతావరణ లక్ష్యాలను త్వరగా చేరుకునేలా కృషి చేయాలని నిర్దేశించుకుంది. ఈ దిశగా చేపట్టే అదనపు చర్యలలో- సహజవాయు రంగంలో మీథేన్‌ పరిమాణం తగ్గింపు, బాధ్యతాయుత-స్థితిస్థాపక పరిశుభ్ర ఇంధన సరఫరా వ్యవస్థల ఏర్పాటుకు అదనపు చర్యలు కూడా చేపట్టాలని కట్టుబాటు విధించుకుంది. ఈ మేరకు చతుర్దేశ కూటమి చేపట్టే చర్యలు కిందివిధంగా ఉంటాయి:

హరిత సముద్ర రవాణా నెట్‌వర్క్‌ ఏర్పాటు: ప్రపంచంలోని అతిపెద్ద ఓడరేవులుగల చతుర్దేశ కూటమి దేశాలు అనేక ప్రధాన సముద్ర రవాణా కూడళ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఫలితంగా హరిత-మౌలిక రేవు సదుపాయాలను, రవాణా నౌకలకు భారీస్థాయిలో  పరిశుభ్ర ఇంధన సరఫరా చర్యలు ఈ దేశాలకు అత్యంత అవసరం. ఈ దిశగా కూటమి భాగస్వామ్య దేశాలు ‘చతుర్దేశ నౌకారవాణా కార్యాచరణ బృందం’ ఏర్పాటు చేసి, తమ కృషిని కొనసాగిస్తాయి. ఇందులో భాగంగా ప్రత్యేక ‘హరిత-కర్బన నివారణ నౌకారవాణా విలువ వ్యవస్థ’ ఏర్పాటు కోసం లాస్‌ ఏంజెలిస్‌, ముంబై పోర్ట్‌ ట్రస్ట్‌, సిడ్నీ (బొటానీ), యొకహోమా రేవు పాలక మండళ్లను ఆహ్వానించాలని నిర్ణయించాయి. తదనుగుణంగా 2030 నాటికి రెండుమూడు ‘చతుర్దేశ స్వల్ప-ఉద్గార లేదా శూన్య ఉద్గార నౌకారవాణా కారిడార్ల’ ఏర్పాటుకు ‘చతుర్దేశ నౌకారవాణా కార్యాచరణ బృందం’ వివిధ రూపాల్లో తన కృషిని కొనసాగిస్తుంది.

పరిశుభ్ర ఉదజని భాగస్వామ్యం ఏర్పాటు: పరిశుభ్ర-ఉదజని విలువ వ్యవస్థ బలోపేతంసహా  సంబంధిత అంశాలన్నిటా వ్యయాలను తగ్గించేందుకు చతుర్దేశ కూటమి ఒక ‘పరిశుభ్ర-ఉదజని భాగస్వామ్యా’న్ని ప్రకటించనుంది. ఇందుకోసం ఇప్పటికే ఇతర వేదికలలో భాగంగా ఉన్న ద్వైపాక్షిక, బహుపాక్షిక ఉదజని సంబంధిత కార్యక్రమాలను సమీకృతం చేస్తుంది. సాంకేతికత అభివృద్ధి, పరిశుభ్ర ఉదజని (కర్బన బంధనం, ప్రత్యేకీకరణ, అణు రూపాల్లో ఏది వీలైతే ఆ ప్రక్రియలో పునరుత్పాదక ఇంధనం, శిలాజ ఇంధనాల వినియోగంద్వారా) ఉత్పాదనను సమర్థంగా పెంచడం, తుది వినియోగం దిశగా సురక్షిత-సమర్థ సరఫరా నిమిత్తం రవాణా-నిల్వ-పంపిణీ వ్యవస్థల గుర్తింపు-అభివృద్ధి, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పరిశుభ్ర ఉదజని వాణిజ్యం వృద్ధికి తగినట్లు మార్కెట్‌ డిమాండ్‌కు ఉత్తేజం వంటి చర్యలు తీసుకుంటుంది.

వాతావరణ అనుసరణ-స్థితిస్థాపకత-సంసిద్ధత పెంపు: వాతావరణ మార్పు విషయంలో ఇండో-పసిఫిక్‌ ప్రాంత స్థితిస్థాపకతను పెంచేందుకు చతుర్దేశ కూటమి దేశాలు కట్టుబాటు ప్రకటించాయి. ఆ మేరకు కీలక వాతావరణ సమాచారం, విపత్తు నిరోధక మౌలిక వసతుల  భాగస్వామ్యాన్ని మెరుగుపరచనుంది. ఇందులో భాగంగా ‘వాతావరణ-సమాచార సేవల కార్యాచరణ బలగం’ ఏర్పాటు చేయనున్నాయి. అలాగే ‘విపత్తు నిరోధక మౌలిక వసతుల సంకీర్ణం’ ద్వారా కొత్త సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసి, అభివృద్ధి చెందుతున్న ద్వీప దేశాలకు సాంకేతిక సహాయం అందిస్తాయి.

ప్రజల మధ్య ఆదానప్రదానం - విద్య

   నేటి విద్యార్థులే రేపటి నాయకులు, ఆవిష్కర్తలు, మార్గదర్శకులు... ఈ నేపథ్యంలో భవిష్యత్తరం శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల మధ్య సంబంధాలు నెలకొల్పుకోవడంలో భాగంగా కూటమి భాగస్వాములు ‘చతుర్దేశ విశిష్ట సభ్యత్వం’ వ్యవస్థను సగర్వంగా ప్రకటిస్తున్నాయి. ఇది ఒక వితరణశీల చర్యద్వారా ఏర్పాటై, నిర్వహించబడే విద్యార్థి వేతన కార్యక్రమం ఇదే మొదటిది. కూటమిలోని ప్రతి దేశానికి ప్రాతినిధ్యం వహించే నాయకులతో కూడిన ప్రభుత్వేతర కార్యాచరణ బృందం సంప్రదింపులతో ఇది కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్‌, గణితశాస్త్ర రంగాల్లో అద్భుత ప్రతిభాపాటవాలుగల భారత, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాల స్నాతకోత్తర, పరిశోధక విధ్యార్థులు అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసే వీలుంటుంది. ఈ కొత్త ఫెలోషిప్‌ వల్ల తమతమ దేశాల్లోనే కాకుండా కూటమిలోని నాలుగు దేశాల్లో నిబద్ధతగల శాస్త్ర, సాంకేతిక నిపుణుల నెట్‌వర్క్‌ ఏర్పడుతుంది. తద్వారా ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడంతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు, విద్యా రంగాల మధ్య సహకారం సాధించడంలో వీరు విశేషంగా దోహదపడతారు. కూటమిలోని ప్రతి దేశానికి బృందాలుగా పర్యటించడం ద్వారా పరస్పర సమాజాలు, సంస్కృతుల గురించి చతుర్దేశ మేధావులలో ప్రాథమిక అవగాహనకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. దీంతోపాటు ప్రతి దేశంలోని అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, రాజకీయ నాయకుల నడుమ విశేష చర్చలకు వీలు కలుగుతుంది. ఈ మేరకు చతుర్దేశ కూటమి చేపట్టే చర్యలు కిందివిధంగా ఉంటాయి:

చతుర్దేశ కూటమి (క్వాడ్‌) ఫెలోషిప్‌కు శ్రీకారం: ఈ కార్యక్రమం కింద ఏటా ప్రతి దేశం నుంచి 25 మంది వంతున 100 మంది విద్యార్థులకు అమెరికాలో విద్యాభ్యాసం చేసే అవకాశం లభిస్తుంది. ఈ మేరకు వారు అక్కడి ప్రసిద్ధ ‘స్టెమ్‌’ విశ్వవిద్యాలయాల్లో స్నాతకోత్తర, పరిశోధక విద్యను అభ్యసిస్తారు. ఇది ప్రపంచంలోని అగ్రశ్రేణి పట్టా ప్రదాన ఫెలోషిప్‌లలో ఒకటిగా ఉంటూనే విశిష్టమైనదిగానూ ఉంటుంది. ఈ ‘క్వాడ్‌ ఫెలోషిప్‌’ ప్రధానంగా ‘స్టెమ్‌’పై దృష్టి సారించి భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాల్లోని అత్యంత ప్రతిభావంతులను ఒకచోటకు చేరుస్తుంది. ఈ ఫెలోషిప్‌ కార్యక్రమాన్ని విద్యా వితరణశీల సంస్థ ‘ష్మిత్‌ ఫ్యూచర్స్‌’ అమలు చేస్తూ నిర్వహిస్తుంది. ఇందుకోసం విద్యా, విదేశీ విధాన నిపుణులతోపాటు కూటమిలోని ప్రతి దేశం నుంచి ఒక్కొక్కరు వంతున ప్రైవేటురంగ ప్రముఖులతో కూడిన అంతరప్రభుత్వ సంప్రదింపుల బలగం ఉంటుంది. ఈ ఫెలోషిప్‌ ప్రారంభ ప్రాయోజిత సంస్థలలో “యాక్సెంచర్‌, బ్లాక్‌స్టోన్‌, బోయింగ్‌, గూగుల్‌, మాస్టర్‌కార్డ్‌, వెస్ట్రన్‌ డిజిటల్‌” కంపెనీలున్నాయి. అయితే, ఈ ఫెలోషిప్‌కు మద్దతుపై ఆసక్తిగల అదనపు ప్రాయోజితులకూ ఈ కార్యక్రమం ఆహ్వానం పలుకుతోంది.

కీలక – ఆవిష్కరణాత్మక సాంకేతిక పరిజ్ఞానాలు

   సార్వత్రిక, సౌలభ్య, సురక్షిత సాంకేతిక పర్యావరణ వ్యవస్థను సంయుక్తంగా ప్రోత్సహించేందుకు చతుర్దేశ అధినేతలు కట్టుబడి ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో కీలక-ఆవిష్కరణాత్మక సాంకేతిక పరిజ్ఞానాల కార్యాచరణ బృందం ఏర్పాటు మొదలు నాలుగు లక్ష్యాల దిశగా మా కృషిని కొనసాగించాం. ఇందులో ‘సాంకేతిక ప్రమాణాలు, 5జి వైపు మలుపు-వినియోగం, హొరైజన్‌-స్కానింగ్‌, సాంకేతికత సరఫరా వ్యవస్థలు’ వంటివి భాగంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో చతుర్దేశాధినేతలు ఇవాళ సాంకేతికతపై సూత్రబద్ధ ప్రకటన చేశారు. కూటమి దేశాల మధ్య ఆదానప్రదాన ప్రజాస్వామ్య విలువలు, విశ్వమానవ హక్కులకు గౌరవం వంటివాటి ప్రాతిపదికన రూపొందిన కీలక, ఆవిష్కరణాత్మక సాంకేతిక పరిజ్ఞానాలను ఈ కొత్త ప్రయత్నాలద్వార సంయుక్తంగా ముందుకు తీసుకెళ్తారు. ఈ మేరకు చతుర్దేశ కూటమి చేపట్టే చర్యలు కిందివిధంగా ఉంటాయి:

‘క్వాడ్‌’ సూత్రావళి ప్రకటన ప్రచురణ: కొన్ని నెలలపాటు సంయుక్త కృషి అనంతరం సాంకేతిక స్వరూపం, అభివృద్ధి, నిర్వహణ, వినియోగంపై చతుర్దేశ కూటమి సూత్రావళి ప్రకటన విడుదల చేయనుంది. ఇది ఈ ప్రాంతాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్నీ బాధ్యతాయుత, సార్వత్రిక, ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆవిష్కరణలవైపు నడిపిస్తుందని మేం ఆశస్తున్నాం.

సాంకేతిక ప్రమాణాల సంప్రదింపు బృందాల ఏర్పాటు: ప్రమాణాలు-అభివృద్ధి కార్యకలాపాలతోపాటు ప్రామాణీకరణ పూర్వ ప్రాథమిక పరిశోధనలపై దృష్టి సారిస్తూ   అత్యాధునిక సమాచార వ్యవస్థలు, కృత్రిమ మేధస్సుపై చతుర్దేశ కూటమి సంప్రదింపు బృందాలను ఏర్పాటు చేస్తుంది.

సెమి కండక్టర్‌ సరఫరా వ్యవస్థ ఆరంభానికి కృషి: సెమి కండక్టర్లు, వాటి కీలక విడిభాగాలకు సంబంధించిన సామర్థ్యాలు, దౌర్బల్యాల గుర్తింపునకు, సరఫరా వ్యవస్థ భద్రతను పెంచడానికి తగిన సంయుక్త వ్యవస్థను చతుర్దేశ కూటమి భాగస్వామ్య దేశాలు ప్రారంభిస్తాయి. దీంతో అంతర్జాతీయంగా డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలకు అవసరమైన సురక్షిత సాంకేతిక పరిజ్ఞానాలను ఉత్పత్తి చేయగల వైవిధ్య, స్పర్థాత్మక మార్కెట్‌కు చతుర్దేశ కూటమి భాగస్వాముల తోడ్పాటును సమకూరుస్తుంది.

5జి అమలు – వైవిధ్యీకరణకు మద్దతు: వైవిధ్య, స్థితిస్థాపక, సురక్షిత టెలికమ్యూనికేషన్ల పర్యావరణ వ్యవస్థకు ఉత్తేజం, ప్రోత్సాహం కల్పించడంలో చతుర్దేశ ప్రభుత్వాల పాత్రకు మద్దతు దిశగా చతుర్దేశ కూటమి ఒక 1.5 పారిశ్రామిక సంభాషణల ట్రాక్‌ను ప్రారంభించింది. ఇది ‘ర్యాన్‌ విధాన సంకీర్ణం’ సమన్వయంతో సార్వత్రిక ‘ర్యాన్‌ అమలు-అనుసరణ’ వేదికపై ఏర్పాటైంది. ఇది 5జి వైవిధ్యీకరణతోపాటు సంబంధిత ప్రయోగ, పరీక్ష సదుపాయాలతో కూడిన పర్యావరణాలను చతుర్దేశ భాగస్వామ్య దేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేస్తాయి.

బయోటెక్నాలజీ స్కానింగ్‌పై పర్యవేక్షణ: సింథటిక్‌ జీవశాస్త్రం, జన్యుక్రమ నమోదు, బయోఉత్పాదనసహా అత్యాధునిక బయోసాంకేతికతల నుంచి కీలక-ఆవిష్కరణాత్మక ధోరణులను చతుర్దేశ కూటమి పర్యవేక్షిస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా సహకార సంబంధిత అవకాశాలను మేం గుర్తిస్తాం.

సైబర్‌ భద్రత

   సైబర్‌ భద్రతపై మా నాలుగు దేశాల మధ్యగల దీర్ఘకాలిక సహకారం ఆధారంగా సైబర్‌ ముప్పులపై కీలక-మౌలిక సదుపాయాలకు ఆసరాగా కొత్త ప్రయత్నాలను చతుర్దేశ కూటమి ప్రారంభిస్తుంది. ఈ మేరకు జాతీయ, అంతర్జాతీయ ఉత్తమ విధానాలను నడిపించడానికి మా నాలుగు దేశాలూ నైపుణ్యాలను ఏకీకృతం చేస్తాయి. ఈ మేరకు చతుర్దేశ కూటమి చేపట్టే చర్యలు కిందివిధంగా ఉంటాయి:

క్వాడ్‌ సీనియర్‌ సైబర్‌ బృందం ఏర్పాటు: ఉమ్మడి సైబర్‌ ప్రమాణాల అనుసరణ-అమలు సహా సురక్షిత సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన, కార్మికశక్తి-ప్రతిభల సమీకరణ, విస్తరణకు ప్రోత్సాహం, డిజిటల్‌ మౌలిక సదుపాయాల భద్రత-విశ్వసనీయతల అభివృద్ధి వంటి సంబంధిత రంగాలలో నిరంతర మెరుగుదలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం-పరిశ్రమల మధ్య కృషిని పర్యవేక్షించడానికి నాయకత్వస్థాయి నిపుణులు క్రమబద్ధంగా సమావేశమవుతారు.

అంతరిక్షం

   తుర్దేశ కూటమి దేశాలు అంతరిక్షంసహా శాస్త్ర విజ్ఞాన అగ్రగాముల జాబితాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చతుర్దేశ కూటమి తొలిసారిగా ఓ కొత్త కార్యాచరణ బృందంతో అంతరిక్ష సహకారం ప్రారంభించనున్నట్లు ఇవాళ ప్రకటించింది. ముఖ్యంగా ఈ భాగస్వామ్యంలో ఉపగ్రహ సమాచార ఆదానప్రదానం సాగుతుంది. దీంతోపాటు వాతావరణ మార్పులపై పర్యవేక్షణ, అనుసరణపై, విపత్తులపై సంసిద్ధతసహా ఉమ్మడి అంశాల్లో సవాళ్లపై ప్రధానంగా దృష్టి సారించబడుతుంది. ఈ మేరకు చతుర్దేశ కూటమి చేపట్టే చర్యలు కిందివిధంగా ఉంటాయి:

భూమి-జలాల రక్షణ కోసం ఉపగ్రహ సమాచార భాగస్వామ్యం: భూ పరిశీలన ఉపగ్రహాలు అందించే సమాచారం, వాతావరణ మార్పుల ముప్పులపై విశ్లేషణ, సముద్రాలు-సముద్ర వనరుల సమగ్ర వినియోగం తదితరాల ఆదానప్రదానానికి మా నాలుగు దేశాలూ సంప్రదింపులు ప్రారంభిస్తాయి. ఈ సమాచార భాగస్వామ్యం వల్ల చతుర్దేశ కార్యాచరణ బృందం సమన్వయం ద్వారా వాతావరణ మార్పులను మెరుగ్గా అనుసరించడానికి, వాతావరణ మార్పు ముప్పు తీవ్రంగా ఉన్న ఇతర ఇండో-పసిఫిక్‌ దేశాల్లో సామర్థ్యం పెంపునకు వీలుంటుంది.

సుస్థిర ప్రగతి దిశగా సామర్థ్యం పెంపునకు తోడ్పాటు: ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని ఇతర దేశాలు అంతరిక్ష సంబంధిత అంశాల ముప్పులు, సవాళ్లను పరిష్కరించుకోగలిగేలా వాటి సామర్థ్యం పెంపునకు చతుర్దేశ కూటమి దేశాలు తోడ్పడతాయి. ఆ మేరకు పరస్పర ఆసక్తిగల అంతరిక్ష సాంకేతికతలు, అనువర్తనాల పెంపు, బలోపేతం, మద్దతు దిశగానూ సంయుక్తంగా కృషి చేస్తాయి.

నిబంధనలు-మార్గదర్శకాలపై సంప్రదింపులు: బాహ్య అంతరిక్ష పర్యావరణ దీర్ఘకాలిక సుస్థిరతకు భరోసా దిశగా నిబంధనలు, మార్గదర్శకాలు, సూత్రాలు, నియమాలపైన కూడా మేం సంప్రదింపులు కొనసాగిస్తాం.

***



(Release ID: 1758175) Visitor Counter : 201