మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
ఉత్తర రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులతో సమావేశమైన కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖ మంత్రి
Posted On:
23 SEP 2021 5:09PM by PIB Hyderabad
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖ మంత్రి అధ్యక్షతన ఉత్తర భారతదేశానికి చెందిన పార్లమెంట్ సభ్యుల సమావేశం జరిగింది. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, చండీఘర్, లడఖ్ రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సంయుక్త కార్యదర్శులు , ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ రంగంలో అమలు చేస్తున్న పథకాల వివరాలను పార్లమెంట్ సభ్యులకు మంత్రి వివరించారు. పథకాల ప్రయోజనాలను వివరించిన మంత్రి క్షేత్ర స్థాయిలో పశుసంపద మరియు పాడి పథకాలను మరింత పటిష్టంగా అమలు చేయడానికి తీసుకోవలసిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ పథకాల వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు.
పశువుల పెంపకం దారుల, పశుగ్రాస వ్యవస్థాపకులను నేషనల్ లైవ్స్టాక్ మిషన్ మరియు రాష్ట్రీయ గోకుల్ మిషన్ పరిధిలోకి తీసుకుని రావాలని ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద అధిక జన్యుపరమైన దూడల ఉత్పత్తి మరియు సరఫరా కోసం యూనిట్లను నెలకొల్పే పారిశ్రామికవేత్తలకు 50% మూలధన సబ్సిడీ నేరుగా అందించడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచి, ఎక్కువ మందికి పశువులు, పాడి, పౌల్ట్రీ, గొర్రెలు, మేకలు, పందులు పెంపకం, పశుగ్రాస రంగంలో ఉపాధి అవకాశాలను కల్పించాలన్న లక్ష్యంతో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అమలు జరుగుతున్నదని మంత్రి తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ సాధన కోసం అమలు జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో 50 శాతం సబ్సిడీ అందిస్తున్నారు.
పాడి రంగాన్ని అభివృద్ధి చేయడానికి నేషనల్ ప్రోగ్రాం ఫర్ డైరీ డెవలప్మెంట్ (ఎన్పిడిడి) పథకం అమలు జరుగుతున్నదని పార్లమెంట్ సభ్యులకు మంత్రి వివరించారు. ఈ పథకం కింద పాల సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ మరియు పాలు మరియు పాల ఉత్పత్తుల నాణ్యత అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పశువుల ఆరోగ్యం, వ్యాధుల నివారణకు టీకాలను వేసే కార్యక్రమం కూడా అమలు జరుగుతున్నదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాలలో మొబైల్ వెటర్నరీ యూనిట్ల ద్వారా పశువుల ఆరోగ్య సంరక్షణ సేవలను రైతులకు వారి ఇళ్ల వద్దనే అందిస్తున్నామని అన్నారు.
పశువులు, పాడి రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి సూచించారు. సమావేశానికి హాజరైన సభ్యులను అభినందించిన మంత్రి వారి సలహాలు సూచనలను అమలు చేసి పాడి రంగ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
***
(Release ID: 1757476)
Visitor Counter : 144