ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఈశాన్య ప్రాంతానికి ఆర్థిక పథకాలు, ప్రాజెక్టులు

Posted On: 22 JUL 2021 3:13PM by PIB Hyderabad

2020 సెప్టెంబర్‌లో, 17 అభివృద్ధి నేపథ్య అంశాలపై 17 ఉప బృందాలను నీతి ఆయోగ్ ఏర్పాటు చేసింది. ఈశాన్య ప్రాంతానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులపై, ముఖ్యంగా విద్య, ఎగుమతులు సహా ఇతర పదహారు నేపథ్య బృందాలపై నీతి ఆయోగ్ ఎలాంటి మధ్యకాలిక మూల్యాంకనం చేయలేదు. కేంద్ర ప్రభుత్వ రంగం, కేంద్ర ప్రాయోజిత పథకాల  మూల్యాంకనాన్ని సంబంధిత విభాగాలు లేదా మంత్రిత్వ శాఖలు చేస్తాయి. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఈశాన్య ప్రాంత మండలి అమలు చేసే పథకాలపై మూడో పార్టీ మూల్యాంకనం పూర్తయింది.

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (2021-22), 10 శాతం జీబీఎస్‌ కింద, బడ్జెట్ అంచనాల (బీఈ) దశలో 54 మంత్రిత్వ శాఖలు/విభాగాలు ఈశాన్య ప్రాంతానికి రూ.68,020 కోట్లు కేటాయించాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో, కరోనా ప్రభావంపై పోరాడడానికి, ఆర్థికాభివృద్ధి పునరుద్ధరణ కోసం ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన సహా మూడు ఆత్మనిర్భర్‌ ప్యాకేజీలు సహా ప్రత్యేక ఆర్థిక, సమగ్ర ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆరోగ్య మౌలిక సదుపాయాల పెంపు, మెగా ఇన్వెస్ట్‌మెంట్‌ టెక్స్‌టైల్స్‌ పార్కులు, వ్యవసాయ పరపతి, మౌలిక సదుపాయాల నిధి పెంపు, ఎంఎస్‌ఎంఈ రంగానికి అదనపు బడ్జెట్‌ కేటాయింపులు వంటివాటిని 2020-21 బడ్జెట్‌ ప్రకటించింది. ఇంకా, కరోనా రెండో దశలో భారత ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచే 17 అంశాలతో కూడిన రూ.6.29 లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీని ఈ ఏడాది జూన్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజారోగ్యం బలోపేతం, అభివృద్ధి, ఉపాధికి ప్రేరణనిచ్చే అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటిలో చాలా పథకాలు, విధానాలు ఈశాన్య ప్రాంతానికి కూడా ఉపయోగపడతాయి.

    ఈశాన్య ప్రాంతంలో కొవిడ్‌ పరిస్థితులను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తరచుగా సమీక్షించింది. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖతో కలిసి సమన్వయ చర్యలు తీసుకుంటుంది. ఈశాన్య ప్రాంత ప్రజల ఇబ్బందులు తగ్గించేందుకు, కొవిడ్‌పై పోరాటం కోసం ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ/ఈశాన్య ప్రాంత మండలి రూ.26.09 కోట్ల సంయుక్త నిధిని 8 ఈశాన్య రాష్ట్రాలకు కేటాయించింది. కరోనా కారణంగా స్వస్థలాలకు తిరిగి వచ్చిన ఈశాన్య ప్రాంత వలస కార్మికులకు జీవనోపాధిని కల్పించేందుకు రూ.36.50 కోట్ల విలువైన ప్రాజెక్టులను కూడా ఈశాన్య రాష్ట్రాలకు కేటాయించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆరోగ్య మౌలిక సదుపాయల బలోపేతానికి, ముఖ్యంగా కొవిడ్‌పై పోరాటం కోసం, ఈశాన్య ప్రాంత ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం కింద రూ.313.98 కోట్ల విలువైన 11 ప్రాజెక్టులను ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కేటాయించింది. వైద్య పరికరాలు, కరోనా పరీక్షల కేంద్రాలు వంటి సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలతో ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో, జాతీయ ఆరోగ్య మిషన్‌ ద్వారా, "భారత కొవిడ్‌-19 అత్యవసర స్పందన, ఆరోగ్య వ్యవస్థ సంసిద్ధత ప్యాకేజీ"ల కోసం రూ.322.89 కోట్లు ఈశాన్య ప్రాంతానికి విడుదల అయ్యాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో, జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద రూ.111.34 కోట్లు ఈశాన్య ప్రాంతానికి అందాయి. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద అనుమతించిన కొవిడ్‌ నియంత్రణ చర్యల కోసం, ఎస్‌డీఆర్‌ఎఫ్ వార్షిక కేటాయింపుల్లో 35 శాఖ వరకు ఖర్చు చేసేందుకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి లభించింది. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో ఈ 35 శాతం పరిమితిని 50 శాతానికి పెంచారు. 

    ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ. జి.కిషన్‌రెడ్డి ఈ సమాచారాన్ని ఇవాళ రాజ్యసభకు సమర్పించారు.
             

*****



(Release ID: 1737815) Visitor Counter : 181


Read this release in: English , Urdu , Punjabi , Tamil