జల శక్తి మంత్రిత్వ శాఖ

ఒడిశాకు రూ. 3,323 కోట్లు!


జలజీవన్ మిషన్ కింద కేంద్రం గ్రాంటు
నాలుగు రెట్లు పెరిగిన కేటాయింపు

2024మార్చిలోగా ‘ప్రతి ఇంటికీ నీరు’ అందేలా కేంద్రం మద్దతు

Posted On: 11 JUL 2021 3:46PM by PIB Hyderabad

  ప్రజల జీవితాలను, ప్రత్యేకించి మహిళల, చిన్నారుల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని అందించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును సాకారం చేసేందుకు జలజీవన్ మిషన్ పథకం కింద ఒడిశా రాష్ట్రానికి కేటాయింపును కేంద్రం నాలుగు రెట్లమేర పెంచింది. 2020-21వ సంవత్సరంలో రూ. 812.15కోట్లుగా ఉన్న కేటాయింపును 2021-22లో ఏకంగా రూ. 3,323.42 కోట్లకు పెంచారు. కేటాయింపు హెచ్చింపు ప్రక్రియను ఆమోదించిన సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, 2024వ సంవత్సరం మార్చిలోగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ కుళాయి నీటిని అందించేందుకు ఒడిశా రాష్ట్రానికి సంపూర్ణంగా సహాయపడగలమని హామీ ఇచ్చారు.

2019వ సంవత్సరంలో జలజీవన్ మిషన్ కార్యక్రమం మొదలయ్యేనాటికి దేశంలోని 18.93కోట్ల మంది గ్రామీణ జనాభాలో 3.23కోట్ల మందికి మాత్రమే కుళాయిల ద్వారా నీరు అందుబాటులో ఉంది. అయితే, గత 22 నెలల వ్యవధిలో కోవిడ్ వైరస్ మహమ్మారి సంక్షోభం, లాక్ డౌన్ ఆంక్షలు ఎదురైనా, జలజీవన్ మిషన్ పనులు మాత్రం వేగంగానే సాగాయి. జలజీవన్ మిషన్ పనుల అమలుతో 4.5 కోట్ల ఇళ్లకు శుద్ధమైన తాగునీటిని అందించే కుళాయిలను అమర్చగలిగారు. నీటి సరఫరా కుళాయిల ఏర్పాటులో 23.5శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని 7.69కోట్ల ఇళ్లకు (అంటే 40.6శాతం ఇళ్లకు) కుళాయిల ద్వారా తాగునీరు అందుతోంది. గోవా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరిలలోని  గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు వందశాతం నీటి కుళాయిల కనెక్షన్లు అందించారు. ‘ప్రతి ఇంటికీ నీరు’ అన్న లక్ష్యం ఇలా సాకారమైంది. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్’ అన్న నినాదం స్ఫూర్తిగా ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా నీటిని అందించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేసే కృషిని కొనసాగిస్తూ, ప్రస్తుతానికి 69 జిల్లాలు, 99వేలకు పైగా గ్రామాల్లో ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయిలను అమర్చారు.

  2019వ సంవత్సరం ఆగస్టు 15న జలజీవన్ మిషన్ పథకాన్ని ప్రకటించే నాటికి ఒడిశా రాష్ట్రంలో కేవలం 3.10లక్షల ఇళ్లకు (అంటే 3.63శాతం ఇళ్లకు) మాత్రమే నీటి కుళాయిల కనెక్షన్లు ఉన్నాయి. అయితే, ఒడిశాలోని మొత్తం 85.66లక్షల ఇళ్లలో ప్రస్తుతం 25.95 లక్షల ఇళ్లకు (అంటే 30.3శాతం ఇళ్లకు) నీటి కుళాయిల కనెక్షన్లు ఏర్పాటు చేశారు. 2021-22వ సంవత్సరంలో 21.31లక్షల ఇళ్లకు, 2022-23లో 22.53లక్షల ఇళ్లకు, 2023-24లో 18.87లక్షల ఇళ్లకు  నీటి కుళాయిలను ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం సంకల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ నీటి కుళాయిలను ఏర్పాటు చేయాలన్న లక్ష్య సాధనకోసం ఈ మేరకు నిర్ణయం జరిగింది.

  నీటి కుళాయిల కనెక్షన్లు అందించే పని ఒకేసారి అన్ని గ్రామాల్లో ప్రారంభం కావాలని, అప్పుడే 2024 నాటికి ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా నీటి సరఫరా సాధ్యమవుతుందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఒడిశా ముఖ్యమంత్రికి రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు.

  ఈ నేపథ్యంలో, 2021-22వ సంవత్సరానికి సంబంధించిన వార్షిక ప్రణాళికను అమలుచేసేందుకు ఒడిశా ప్రభుత్వానికి సహాయంగా  కేంద్ర ప్రభుత్వం కేటాయింపును నాలుగు రెట్లు పెంచారు. ఇప్పటివరకూ ఖర్చు పెట్టని రూ. 10.93కోట్ల మొత్తాన్ని, రూ. 3,253కోట్ల రాష్ట్ర వాటాను కలిపితే  2021-22వ సంవత్సరానికి గాను, ఒడిశా రాష్ట్రంలో నీటి సరఫరా పనులకోసం  మొత్తంగా రూ. 6,596కోట్లు అందుబాటులో ఉంది. అందువల్ల నీటి సరఫరా పనులకు సంబంధించి నిధుల కొరత ఏ మాత్రం లేదని చెప్పవచ్చు.

https://ci5.googleusercontent.com/proxy/tpUNvWzOKENkExy3aEVGShe9MeWo8CT5phZAl1-c59DmHmgfzCgD2x6Db1Pv6WmQ7QnVfOzsH7z2CFO2v66F5Y10z1sL7dKi01FjFGM8KPxuvTshiu6lF72RcA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002X68A.jpg

   గ్రామాల్లో నీటి సరఫరా నిర్వహణకు, పారిశుద్ధ్యం మెరుగుపడేలా చూసేందుకు 2021-22వ సంవత్సరంలో రూ. 1,002కోట్లను కేటాయింటారు. గ్రామీణ స్థానిక సంస్థలకు, పంచాయతీ రాజ్ సంస్థలకు నీటి సరఫరా, పారిశుద్ధ్యం పనులకోసం 15వ ఆర్థిక సంఘంతో ముడివడిన గ్రాంటుగా ఈ మొత్తాన్ని కేటాయించారు. ఇక వచ్చే ఐదేళ్ల వరకూ అంటే 2025-26వరకూ రూ. 5,280కోట్ల మేర నిధులకు హామీ కూడా రాష్టప్రభుత్వానికి లభించింది. ఒడిశా గ్రామీణ ప్రాంతాల్లో ఇంత భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టడం ద్వారా రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు చక్కగా ఊపందుకుంటాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింతగా పురోగమిస్తుంది. తద్వారా గ్రామాల్లో నూతన ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయి.

  దేశంలోని పాఠశాలలు, ఆశ్రమ శాలలు, అంగన్ వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు సురక్షితమైన తాగునీరు అందేలా చూసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వందరోజుల అవగాహనా కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గత ఏడాది అక్టోబరు రెండవ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించారు.  దీనితో హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, గోవా, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు వెంటనే ఈ కార్యక్రమాన్ని అందిపుచ్చుకున్నాయి. పాఠశాలలు, ఆశ్రమ శాలలు, అంగన్ వాడీ కేంద్రాల్లో కుళాయిల ద్వారా తాగునీటి సరఫరాకు తగిన చర్యలు తీసుకున్నాయి.  ఒడిశాలో 25,820 పాఠశాలలకు (47శాతం), 25,820 అంగన్ వాడీ కేంద్రాలకు (22శాతం) నీటి కుళాయిల కనెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి.  కాగా, మిగిలిన అన్ని పాఠశాలలకు, ఆశ్రమశాలలకు, అంగన్ వాడీ కేంద్రాలకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు (పి.హెచ్.సి.లకు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు (సి.హెచ్.సి.లకు) గ్రామ పంచాయతీ భవనాలకు, సంక్షేమ కేంద్రాలు తదితర సంస్థలకు రాబోయే కొన్ని నెలల్లోనే ప్రాధాన్యతా ప్రాతిపదికన సురక్షితమైన తాగునీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం ఒడిశాను కోరింది. మెరుగైన ఆరోగ్యం, పారిశుద్ధ్యం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.

  జలజీవన్ మిషన్ కార్యక్రమం కింద నీటి సరఫరా పనులు చేపట్టడంలో,.. నీటి ఎద్దడి ప్రాంతాలకు, నీటి నాణ్యత లోపించిన ప్రాంతాలకు, ఆశావహ జిల్లాలకు, ఎస్.సి., ఎస్.టి.ల జనాభా ప్రాబల్యం కలిగిన గ్రామాలకు, సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద గుర్తించిన గ్రామాలకు రాష్ట్రం ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది.  నీటి నాణ్యతపై పర్యవేక్షణకు, నిఘా కార్యకలాపాలకు అగ్రస్థాయి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం, అంగన్ వాడీ కార్యకర్తలకు, ఆశా కార్యకర్తలకు, స్వయం సహాయక బృందాల సభ్యులకు, పంచాయతీ రాజ్ సంస్థల సభ్యులకు, పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులకు తగిన శిక్షణ ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో టెస్ట్  కిట్ల (ఎఫ్.టి.కె.ల) సహాయంతో నీటి కాలుష్యంపై పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా వారందరికీ ఈ శిక్షణను అందిస్తున్నారు. నీటి పరీక్షలకు సంబంధించి రాష్ట్రంలోని మొత్తం 77 లేబరేటరీలకుగాను, ఆరు పరిశోధన శాలలకు మాత్రమే నేషనల్ అక్రెడిటేషన్ బోర్డు (ఎన్.ఎ.బి.ఎల్.) గుర్తింపు ఉంది. ఈ టెస్టింగ్ లేబరేటరీల స్థాయిని నవీకరించి, వాటికి ఎన్.ఎ.బి.ఎల్. గుర్తింపును తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. నామమాత్రపు ఫీజుతో తమ నీటి నమూనాలను పరీక్షించుకునేందుకు వీలుగా ఈ లేబరేటరీలను ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది.

   జలజీవన్ మిషన్ అనేది అట్టడుగు స్థాయి సంస్థలకు, ప్రజలకు ప్రాధాన్యం ఇచ్చే కార్యక్రమం. ఇందులో ప్రణాళిక స్థాయినుంచి, అమలు, నిర్వహణ, పర్యవేక్షణ వంటి అంశాల వరకూ ప్రజాసమూహానికి కీలకపాత్ర ఉంటుంది. ఈ లక్ష్యసాధనకు వచ్చే ఐదేళ్లకోసం గ్రామ స్థాయి నీటి సరఫరా, పారిశుద్ధ్య కమిటీలను (వి.డబ్ల్యు.ఎస్.సి.లను), పానీ సమితులను బలోపేతం చేయడం, గ్రామ స్థాయి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం వంటి చర్యలను చేపట్టవలసి ఉంటుంది. అలాగే, గ్రామ స్థాయికమిటీల నిర్వహణలో రాష్ట్ర స్థాయి అమలు సంస్థలకు (ఐ.ఎస్.ఎ.లకు) ప్రమేయం కల్పించడం, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడం చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ రాష్ట్రంలోని 47,412 గ్రామాలకు గాను కేవలం 1,184 గ్రామాలకు మాత్రమే నీటిసరఫరా పారిశుద్ధ్య కమిటీలు, పానీ సమితులు అందుబాటులో ఉన్నాయి. గ్రామస్థాయి ప్రణాళిక రూపకల్పన, అమలు, ఐదేళ్ల గ్రామ కార్యాచరణ ప్రణాళిక తయారీ వంటి అంశాల్లో ఈ గ్రూపులకు కీలకపాత్ర ఉంటుంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ,.. ప్రత్యేకించి పశ్చిమ ఒడిశాలోని నీటి ఎద్దడి ప్రాంతాలకు తప్పనిసరిగా నీరు అందేలా చూసేందుకు నీటి సరఫరా వ్యవస్థలను దీర్ఘకాలిక ప్రాతిపదికపై నిర్వహించడంలో కూడా ఈ గ్రూపులు కీలక పాత్ర పోషిస్తాయి. ,

 

***



(Release ID: 1734684) Visitor Counter : 200