ప్రధాన మంత్రి కార్యాలయం

‘డిజిట‌ల్ ఇండియా’ ల‌బ్దిదారుల తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి


డిజిట‌ల్ మాధ్య‌మం ప‌రం గా సాధికారిత ను సంపాదించుకున్న యువ‌త ఈ ద‌శాబ్దాన్ని ‘ఇండియాస్ టెకేడ్’ గా మార్చుతారు: ప్ర‌ధాన మంత్రి

‘డిజిట‌ల్ ఇండియా’ అనేది ‘ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్’ తాలూకు సాధ‌నం గా ఉంది: ప్ర‌ధాన మంత్రి

‘డిజిట‌ల్ ఇండియా’ అంటే వేగం గా లాభార్జ‌న‌, పూర్తి లాభార్జ‌న‌; ‘డిజిట‌ల్ ఇండియా’ అంటే ‘క‌నీస స్థాయి ప్ర‌భుత్వం, గ‌రిష్ఠస్థాయి పాలన’ కూడా: ప్రధాన మంత్రి

క‌రోనా కాలం లో భార‌త‌దేశ డిజిట‌ల్ ప‌రిష్కార మార్గాలు ప్ర‌పంచం దృష్టి ని ఆక‌ట్టుకొన్నాయి: ప్ర‌ధాన మంత్రి

పది కోట్ల కు పైగా రైతు కుటుంబాల ఖాతాల‌ లో 1.35 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ను జ‌మ చేయ‌డ‌మైంది: ప్ర‌ధాన మంత్రి

ఒక దేశం - ఒక ఎమ్ఎస్‌పి స్ఫూర్తి ని ‘డిజిట‌ల్ ఇండియా’ సాకారం చేసింది: ప్ర‌ధాన మంత్రి

Posted On: 01 JUL 2021 1:18PM by PIB Hyderabad

డిజిట‌ల్ ఇండియా’ కార్య‌క్ర‌మం ఆరంభమై ఆరు సంవ‌త్స‌రాలు పూర్తి అవుతున్న సంద‌ర్భం లో ‘డిజిట‌ల్ ఇండియా’ ల‌బ్దిదారుల తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ  వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా మాట్లాడారు.  ఈ సందర్బం లో కేంద్ర ఎల‌క్ట్రానిక్స్‌, స‌మాచార సాంకేతిక విజ్ఞాన శాఖ‌ కేంద్ర మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్, విద్య శాఖ స‌హాయ మంత్రి శ్రీ సంజయ్ శ్యామ్‌ రావు ధోత్రే లు కూడా పాలుపంచుకొన్నారు.
 
ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భం లో ప్ర‌సంగిస్తూ, భార‌త‌దేశం నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల పట్ల ఉత్సాహాన్ని, నూతన ఆవిష్కరణల ను శ‌ర‌వేగం గా స్వీక‌రించే సామ‌ర్ధ్యాన్ని కూడా చాటింది అన్నారు.  డిజిట‌ల్ ఇండియా అనేది భార‌త‌దేశం సంక‌ల్పం.  డిజిట‌ల్ ఇండియా అనేది ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ కు ఒక ప‌నిముట్టు గా ఉంది.  డిజిట‌ల్ ఇండియా 21వ శ‌తాబ్దం లో రూపుదాల్చుతున్న ఒక బ‌ల‌మైన భార‌తదేశాని కి నిదర్శనం గా ఉంది అని ఆయ‌న వివ‌రించారు.  క‌నీస స్థాయి ప్ర‌భుత్వం, గ‌రిష్ఠ స్థాయిలో పాల‌న  అనే త‌న ఉప‌దేశాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించి, డిజిట‌ల్ ఇండియా ఏ విధంగా ప్ర‌భుత్వాని కి- ప్ర‌జ‌ల కు, వ్య‌వ‌స్థ కు- స‌దుపాయాల కు, స‌మ‌స్య‌ల కు- ప‌రిష్కారాల కు మ‌ధ్య ఉన్న అంత‌రాన్ని త‌గ్గించివేస్తూ సామాన్య పౌరుల కు సాధికారిత ను క‌ల్పిస్తోందో వివ‌రించారు.  డిజిలాక‌ర్ ప్ర‌జ‌ల కు ఏ ర‌కం గా తోడ్ప‌డిందీ- ప్ర‌త్యేకించి మ‌హ‌మ్మారి కాలం లో,అది ఒక అండ‌ గా నిల‌బ‌డిందీ- ఆయ‌న ఉదాహ‌రించారు.  పాఠ‌శాల ధ్రువ‌ప‌త్రాలు, వైద్యం సంబంధి ద‌స్తావేజులు, ఇత‌ర ముఖ్య‌మైన స‌ర్టిఫికెట్ లను దేశ‌ం అంతటా డిజిట‌ల్ మాధ్యమం లో నిల‌వ చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు.  డ్రైవింగ్ లైసెన్సు ను, జ‌న‌న ధ్రువ‌ప‌త్రాన్ని పొందడం, విద్యుత్తు బిల్లు ను చెల్లించ‌డం, నీటి బిల్లు చెల్లింపు, ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్ దాఖ‌లు, వ‌గైరా సేవ‌ లు ఎంతో సౌక‌ర్య‌వంత‌ం గా చ‌క‌చ‌క జ‌రిగిపోయాయ‌ని, మ‌రి గ్రామాల‌ లో ఎల‌క్ట్రానిక్ కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లు (ఇ సిఎస్‌సి స్) ప్ర‌జ‌ల‌ కు సాయప‌డుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు.  ఒక దేశం, ఒక రేశన్ కార్డు వంటి కార్య‌క్ర‌మాలు డిజిట‌ల్ ఇండియా ద్వారానే నెర‌వేరాయ‌ని చెప్పారు.  ఈ కార్య‌క్ర‌మాన్ని రాష్ట్రాల లో అమ‌లుచేయాల‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం అన్ని రాష్ట్రాల కు సూచించ‌డాన్ని ఆయ‌న ప్ర‌శంసించారు.  

ల‌బ్దిదారుల జీవ‌నాల‌ లో డిజిట‌ల్ ఇండియా ఏ విధం గా పరివర్తన ను తీసుకు వచ్చిందో అనే విషయం పట్ల ప్ర‌ధాన మంత్రి త‌న సంతృప్తి ని వ్య‌క్తం చేశారు.  స్వ‌నిధి ప‌థ‌కం తాలూకు ప్ర‌యోజ‌నాల‌ ను ఆయ‌న ప్ర‌స్తావించారు.  యాజ‌మాన్య భ‌ద్ర‌త లోపం అనే స‌మ‌స్య కు స్వామిత్వ ప‌థ‌కం ద్వారా  ప‌రిష్కారం లభించిందన్నారు.  సుదూర ప్రాంతాల‌ కు వైద్యాన్ని అందించే విష‌యం లో ఇ-సంజీవ‌ని ప‌థ‌కం గురించి కూడా ఆయ‌న ప్ర‌స్తావించి, నేశనల్ డిజిట‌ల్ హెల్థ్ మిశ‌న్ లో భాగం గా ఒక ప్ర‌భావకారి వేదిక ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధ‌ం అవుతోంద‌న్నారు.

భార‌త‌దేశం క‌రోనా కాలం లో రూపొందించిన డిజిట‌ల్ ప‌రిష్కారాలు ఒక చ‌ర్చ‌నీయాంశం అయ్యాయని, అవి ప్ర‌పంచ‌వ్యాప్తం గా ప్ర‌స్తుతం  ఒక ఆక‌ర్ష‌ణ‌ గా మారాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ప్ర‌పంచం లో అతి పెద్ద డిజిట‌ల్ కాంటాక్ట్ ట్రేసింగ్ అప్లికేశన్ ఆరోగ్య‌సేతు క‌రోనా సంక్రమణ ను అడ్డుకోవ‌డం లో ఎంత‌గానో సాయ‌ప‌డింద‌న్నారు.  టీకాల‌ ను ఇప్పించే కార్య‌క్ర‌మం కోసం భార‌త‌దేశం రూపొందించిన కొవిన్ యాప్ ప‌ట్ల అనేక దేశాలు ఆస‌క్తి ని వ్య‌క్తం చేశాయ‌ని కూడా ఆయ‌న అన్నారు.  టీకాల‌ ను వేయించే ప్ర‌క్రియ ను ప‌ర్య‌వేక్షించేందుకు ఉద్దేశించిన‌టువంటి ఆ సాధ‌నాన్ని రూపొందించుకోవడం  మ‌న సాంకేతిక ప్రావీణ్యాని కి ఒక రుజువు గా ఉంద‌న్నారు.

డిజిట‌ల్ ఇండియా అంటే.. అంద‌రికీ అవ‌కాశం, అంద‌రికీ ఉద్దేశించిన‌టువంటి సౌక‌ర్యం, అంద‌రూ భాగం పంచుకోవ‌డం అని అర్థ‌మని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  డిజిట‌ల్ ఇండియా అంటే ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ లోకి ప్ర‌తి ఒక్క‌రి ప్ర‌వేశం అని కూడా అర్థ‌మ‌ని ఆయ‌న చెప్పారు.  డిజిట‌ల్ ఇండియా అంటే ఒక పార‌ద‌ర్శ‌క‌త్వం క‌లిగిన‌, వివ‌క్ష‌కు తావు ఉండ‌ని వ్య‌వ‌స్థ‌.  అంతేకాదు, అవినీతి పైన జరిపే దాడి అని కూడా అర్థమని ఆయ‌న వివ‌రించారు.  డిజిట‌ల్ ఇండియా అంటే కాలాన్ని, శ్ర‌మ ను, డ‌బ్బు ను ఆదా చేయ‌డం అని ఆయ‌న అభివ‌ర్ణించారు.  డిజిట‌ల్ ఇండియా అంటే వేగం గా లాభార్జ‌న‌, పూర్తి స్థాయి లో లాభాల‌ ను గ‌డించ‌డం అని ఆయ‌న పేర్కొన్నారు.  డిజిట‌ల్ ఇండియా క‌నీస స్థాయి ప్ర‌భుత్వం, గ‌రిష్ఠ స్థాయి పాల‌న ను సూచిస్తుంద‌న్నారు.

డిజిట‌ల్ ఇండియా కార్య‌క్ర‌మం క‌రోనా కాలం లో దేశాని కి సాయ‌ప‌డింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు లాక్ డౌన్ కార‌ణం గా స‌హాయ‌క ధ‌న‌రాశి ని వారి పౌరుల కు పంపడం లో నిస్స‌హాయ‌ంగా మారిపోయిన‌ అటువంటి సమయం లో భార‌త‌దేశం వేల కొద్దీ కోట్ల రూపాయ‌ల ను ప్ర‌జ‌ల బ్యాంకు ఖాతాల లోకి నేరు గా పంప‌సాగింది అని ప్రధాన మంత్రి అన్నారు.  డిజిట‌ల్ లావాదేవీ లు రైతుల జీవ‌నం లో ఇదివ‌ర‌కు ఎన్న‌డూ ఎరుగ‌ని మార్పు ను తీసుకు వ‌చ్చాయ‌న్నారు.  పిఎం కిసాన్ స‌మ్మాన్ నిధి లో భాగం గా 1.35 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ను 10 కోట్ల‌ కు పైచిలుకు రైతు కుటుంబాల కు చెందిన బ్యాంకు ఖాతాల లోకి నేరుగా జ‌మ చేయ‌డం జ‌రిగింద‌న్నారు.  డిజిట‌ల్ ఇండియా అనేది ఒక దేశం, ఒక ఎమ్ఎస్‌పి స్ఫూర్తి ని కూడా ఆచ‌ర‌ణాత్మకం చేసింద‌న్నారు.

డిజిట‌ల్ ఇండియా కోసం అవ‌స‌ర‌మైన‌టువంటి మౌలిక స‌దుపాయాల ను త్వ‌రిత‌ గ‌తి న ల‌భ్యం అయ్యేట‌ట్లు చూడ‌టానికి త‌గిన శ్ర‌ద్ధ‌ వహిస్తున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి తెలిపారు.  2.5 ల‌క్ష‌ల కామ‌న్ సర్వీస్ సెంట‌ర్ ల ద్వారా సుదూర ప్రాంతాల కు సైతం ఇంట‌ర్ నెట్ చేరుకొంది అని కూడా ఆయ‌న వివ‌రించారు.  భార‌త్ నెట్ ప‌థ‌కం లో భాగం గా బ్రాడ్‌ బ్యాండ్ ఇంట‌ర్ నెట్ ను ప‌ల్లెల‌ కు ఒక ఉద్య‌మం త‌ర‌హా లో అందించే ప‌నులు ప్ర‌స్తుతం సాగుతున్నాయ‌ని చెప్పారు.  ఉత్త‌మ‌ సేవ‌ ల కోసం, విద్యార్జ‌న కోసం హై-స్పీడ్ ఇంట‌ర్ నెట్ ను గ్రామీణ ప్రాంతాల యువ‌తీ యువ‌కులు అందుకొనే విధం గా పిఎం వాణి (PM WANI) ద్వారా యాక్సెస్‌ పాయింట్ల ను నెల‌కొల్ప‌డం జ‌రుగుతోంద‌న్నారు.  దేశం అంత‌టా విద్యార్థినీ విద్యార్థుల కు డిజిట‌ల్ ప‌రిక‌రాల ను, ట్యాబ్‌లెట్‌ల‌ ను త‌క్కువ ఖ‌ర్చు లో అందించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌న్నారు.  ఈ ల‌క్ష్యాన్ని చేరుకొనేందుకు గాను ఎల‌క్ట్రానిక్ కంపెనీల‌ కు ఉత్ప‌త్తి తో ముడిపెట్టిన స‌బ్సిడీల‌ ను ఇవ్వ‌డం జ‌రుగుతోంద‌న్నారు.  గ‌డ‌చిన ఆరేడు సంవ‌త్స‌రాల కాలం లో డిజిట‌ల్ ఇండియా చ‌ల‌వ తో వేరు వేరు ప‌థ‌కాల లో భాగం గా ల‌బ్ధిదారుల బ్యాంకు ఖాతాల లోకి సుమారు 17 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు బ‌దిలీ అయ్యాయ‌న్నారు.

ఈ ద‌శాబ్ది డిజిట‌ల్ సాంకేతిక విజ్ఞాన రంగం లో భార‌త‌దేశం శ‌క్తి సామ‌ర్ధ్యాల ను, ప్ర‌పంచ డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ లో భార‌త‌దేశం వాటా ను గొప్ప‌ గా వృద్ధి చేయ‌నుంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  5జి టెక్నాల‌జీ ప్ర‌పంచం లో చెప్పుకోద‌గ్గ మార్పుల‌ ను తీసుకు రానుంద‌ని, మ‌రి అందుకోసం భార‌త‌దేశం స‌న్న‌ద్ధం అవుతోంద‌ని వెల్ల‌డించారు.  యువ‌తీ యువ‌కులు డిజిట‌ల్ సాధికారిత  పుణ్య‌మా అని మిమ్ముల‌ ను క్రొత్త శిఖ‌రాల కు తీసుకుపోతారు అని తాను న‌మ్ముతున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి తెలిపారు.  ఇవి ఈ ద‌శాబ్దాన్ని ‘ఇండియా స్ టెకేడ్’ గా మ‌ల‌చ‌డం లో తోడ్ప‌డుతాయ‌ని ఆయ‌న అన్నారు.

ప్ర‌ధాన మంత్రి సంభాష‌ణ సాగుతూ ఉన్న స‌మ‌యం లో, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని బ‌ల‌రామ్ పుర్ విద్యార్థిని కుమారి సుహాని సాహు ‘దీక్షా యాప్’ (DIKSHA App) తో త‌న అనుభూతి ని వివరించారు.  లాక్ డౌన్ కాలం లో తాను త‌న చదువు ను కొన‌సాగించ‌డానికి ఆ యాప్ ఏ విధం గా ఉప‌యోగ‌ప‌డిందీ ఆ అమ్మాయి వివ‌రించారు.  మ‌హారాష్ట్ర లోని హింగోలీ కి చెందిన శ్రీ ప్ర‌హ్లాద్‌ బోర్ గాద్ ఇ-నామ్ యాప్ ద్వారా ర‌వాణా ఖ‌ర్చు ను తాను ఏ విధం గా మిగుల్చుకోగ‌లిగిందీ, మెరుగైన ధ‌ర‌ల ను పొంద‌గ‌లిగింది ప్ర‌ధాన మంత్రి దృష్టి కి తీసుకు వ‌చ్చారు.  బిహార్ లోని తూర్పు చంపార‌ణ్ లో నేపాల్ స‌రిహ‌ద్దు కు స‌మీపం లోని ఒక గ్రామాని కి చెందిని శ్రీ శుభ‌మ్ కుమార్ దూర ప్రాంతం లోని ల‌ఖ్‌న‌వూ కు వెళ్ళ‌నక్క‌ర‌లేకుండానే ఇ-సంజీవని యాప్ సాయం తో త‌న బంధువు వైద్యుడి ని సంప్ర‌దించ‌డం లో తాను ఏ విధం గా సాయ‌ప‌డ‌గ‌లిగిందీ ప్ర‌ధాన మంత్రి కి తెలియ‌జేశారు.  ఆ యాప్ ద్వారా ఆ కుటుంబాని కి  ల‌ఖ్‌న‌వూ కు చెందిన డాక్ట‌ర్ భూపేంద‌ర్ సింహ్ సూచ‌న‌ల ను అందించ‌డం ఎంత సుల‌భ‌తరమైందీ ప్ర‌ధాన మంత్రి కి వివ‌రించారు.   వైద్యుల దినం సంద‌ర్భం లో ఆయ‌న కు ప్ర‌ధాన మంత్రి అభినంద‌న‌ల ను తెలియజేసి, మ‌రిన్ని ఉత్తమ అంశాల తో ఇ-సంజీవ‌ని యాప్ ను మెరుగు ప‌ర‌చ‌నున్న‌ట్లు వాగ్ధానం చేశారు.

ఉత్త‌ర్ ప్రదేశ్‌, లోని వారాణ‌సీ కి చెందిన అనుప‌మ దుబే సాంప్ర‌దాయక ప‌ట్టు చీర‌ల‌ ను తాను మ‌హిళా ఇ-హాత్ ద్వారా ఏ విధంగా విక్ర‌యించిందీ తెలియ‌ జేశారు.  అంతేకాకుండా, ఆమె ప‌ట్టు చీర‌ల కు కొత్త కొత్త ఆకృతుల‌ రూపురేఖలను దిద్ది తీర్చడం కోసం డిజిట‌ల్ ప్యాడ్ , స్టైలస్ వంటి ఆధునిక తరహా సాంకేతిక విజ్ఞానాన్ని తాను ఏ విధం గా వినియోగించుకొంటున్న‌దీ ఆమె తెలియ‌జేశారు.  ఉత్త‌రాఖండ్ లోని దేహ్‌ రాదూన్ లో నివ‌సిస్తున్న శ్రీ హ‌రి రామ్  అనే ప్ర‌వాసీ ఎంతో ఉత్సాహం గా ఒక దేశం, ఒక రేశన్ ద్వారా ఆహార పదార్థాల‌ ను ఇట్టే అందుకోవ‌డం లో త‌న‌కు ఎంత సౌక‌ర్య‌వంతం గా ఉన్న‌దీ వెల్ల‌డి చేశారు.  సుదూర ప్రాంతం లో ఉన్న తన ఊరి నుంచి వ‌స్తువుల‌ ను కొనుగోలు చేయ‌డం లో స‌మీప ప‌ట్ట‌ణాల కు వెళ్ళ‌న‌వ‌స‌రం లేకుండానే త‌న ప‌ని ని పూర్తి చేసుకోవ‌డానికి కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ ల‌లో నెల‌కొల్పిన ఇ-స్టోర్స్ ఏ విధం గా తోడ్ప‌డిందీ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని ధ‌ర‌ం పుర్ కు చెందిన శ్రీ మెహ‌ర్ ద‌త్త్ శ‌ర్మ చెప్పారు.  మ‌ధ్య‌ ప్ర‌దేశ్ లోని ఉజ్జ‌ైన్ కు చెందిన ఒక  వ్యాపారి శ్రీ‌మ‌తి న‌జ్‌మీన్ శాహ్ తాను మ‌హ‌మ్మారి అనంత‌ర కాలం లో తిరిగి ఆర్థికం గా నిల‌దొక్కుకోగ‌ల‌గ‌డం లో పిఎమ్ స్వ‌నిధి యోజ‌న ఏ విధం గా త‌న‌ను ఆదుకొన్నదీ తెలిపారు.  మేఘాల‌య కు చెందిన ఒక కెపిఒ ఉద్యోగిని శ్రీ‌మ‌తి వంద‌మాఫి సియమ్ లియే తాను ఇండియా బిపిఒ స్కీము కు ఎంత‌గానో రుణ‌ప‌డి ఉన్నాన‌ని, దీని కి కార‌ణం కోవిడ్-19 మ‌హ‌మ్మారి కాలం లో చాలా సుర‌క్షిత‌మైన వాతావ‌ర‌ణం లో త‌న ప‌ని ని తాను నిర్వ‌ర్తించుకోగ‌లగడమే అని ఆమె చెప్పారు.


 



(Release ID: 1731914) Visitor Counter : 264