సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా, "యోగా ఒక భారతీయ వారసత్వం" పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం ద్వారా "ఐడీవై2021" వేడుకలు జరపనున్న కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ


"ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌"లో భాగంగా 75 వారసత్వ ప్రదేశాల్లో యోగా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు

Posted On: 19 JUN 2021 6:12PM by PIB Hyderabad

శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సంతోషాన్ని అందించడంలో తన పాత్రను నిరూపించుకున్న యోగా, క్రమంగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. ప్రపంచవ్యాప్తంగానూ గుర్తింపు పొందుతోంది. ఇది మొత్తం ప్రపంచానికి మానవత్వ సాంస్కృతిక వారసత్వాన్ని సూచిస్తుంది. దీనిని మరింతగా ప్రచారం చేయడం, విశ్వవేదికపై ప్రోత్సహించడం అవసరం.

    అందుకే, "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌"లో భాగంగా,"యోగా ఒక భారతీయ వారసత్వం" పేరిట ఒక కార్యక్రమం నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరపాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆలోచిస్తోంది. మంత్రిత్వ శాఖకు చెందిన అన్ని విభాగాల చురుకైన భాగస్వామ్యంతో, 75 సాంస్కృతిక వారసత్వ ప్రదేశాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, ప్రతి ప్రదేశంలో యోగాలో పాల్గొనేవారి సంఖ్యను 20కి పరిమితం చేశారు. ఈ 75 ప్రదేశాల్లో నిర్వహించే యోగా కార్యక్రమాల్లో ప్రముఖులు పాల్గొంటారు.

    ఈ కార్యక్రమంలో 45 నిమిషాల పాటు యోగా ఉంటుంది. దాని తర్వాత, సంగీత్‌ నాటక్‌ అకాడమీ లేదా ప్రాంతీయ సాంస్కృతిక కేంద్రాల పురస్కారాలు పొందిన యువతచే 30 నిమిషాల సాంస్కృతిక ప్రదర్శన ఉంటుంది. ఎంపిక చేసిన 30 ప్రాంతాల నుంచి, మంత్రిత్వ శాఖకు చెందిన అన్ని డిజిటల్‌ వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయి. మీడియా భాగస్వాములైన రేడియో ఫరెవర్‌ 104, దూరదర్శన్‌, క్యూర్‌పిట్‌, ఫిక్కి ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతాయి.

    ఈ నెల 21న ఉదయం 7 గం.-7.45 గం. మధ్య, దిల్లీలోని లాల్‌ ఖిలాలో నిర్వహించే కార్యక్రమంలో, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మంత్రిత్వ శాఖకు చెందిన అన్ని డిజిటల్‌ వేదికల ద్వారా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.
 

******



(Release ID: 1728696) Visitor Counter : 124