సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ప్రస్తుత కోవిడ్ మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని “ఫ్లెక్సీ (అనువైన)” హాజరు ఎంపికను జూన్, 15వ తేదీ వరకు పొడిగించినట్లు తెలియజేసిన - కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


18 సంవత్సరాల మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ త్వరగా టీకాలు వేయించుకోవాలన్న తన విజ్ఞప్తిని పునరుద్ఘాటించిన - కేంద్ర మంత్రి

Posted On: 01 JUN 2021 5:14PM by PIB Hyderabad

 

సిబ్బంది, శిక్షణ విభాగం (డి.ఓ.పి.టి) సీనియర్ అధికారుల సమావేశానికి అధ్యక్షత వహించిన - కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్); ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ,  ప్రస్తుత కోవిడ్ మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని “ఫ్లెక్సీ (అనువైన)” హాజరు ఎంపికను జూన్, 15వ తేదీ వరకు తిరిగి పొడిగించినట్లు తెలియజేశారు.

కార్యాలయాలలో అనువైన హాజరును అనుమతిస్తూ, గతంలో ఇచ్చిన ఆదేశాల కొనసాగింపుగా ఈ విషయాన్ని తెలియజేశారు. దీనికి ముందు, కార్యాలయాలు 50 శాతం హాజరు పద్ధతి లో పనిచేస్తాయని భావించారు.

ప్రస్తుత ఆదేశం లోని కీలక ముఖ్యాంశాలు :

(ఏ)     మంత్రిత్వ శాఖలు / విభాగాల కార్యదర్శులు, వాటికి అనుబంధంగా, ఆధారపడి ఉన్న కార్యాలయాల అధిపతులు, తమ కార్యాలయాల లో ఉన్న కోవిడ్ పాజిటివ్ కేసులనూ, నిర్వహణ అవసరాలనూ, దృష్టిలో ఉంచుకుని, ఆయా కార్యాలయాలలో పనిచేసే అన్ని స్థాయిలలో ఉద్యోగుల హాజరునుతప్పనిసరిగా నియత్రించాలి. 

(బి)          వికలాంగులు మరియు గర్భిణీ మహిళా ఉద్యోగులు కార్యాలయానికి హాజరుకాకుండా మినహాయించవచ్చు, అయితే, వారు ఇంటి నుండి పని చేయవలసి ఉంటుంది. 

(సి)         కార్యాలయాలు / పని ప్రదేశాల్లో రద్దీ లేకుండా ఉండేందుకు వీలుగా, విభాగాధిపతులు నిర్ణయించినట్లు, అధికారులు / సిబ్బంది దఫాల వారీగా వివిధ సమయాల్లో హాజరు కావాల్సి ఉంటుంది. 

(డి)          కంటైన్మెంట్ ప్రాంతాల్లో నివసించే అధికారులు / సిబ్బంది అందరికీ, ఆయా ప్రాంతాలను కంటైన్మెంట్ నుండి తొలగించినట్లు ప్రకటించే వరకు, కార్యాలయాలకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఇవ్వాలి.  కంటైన్మెంట్ ప్రాంతాల్లో నివసిస్తున్న ఈ అధికారులు / సిబ్బంది ఇంటి నుండి పని చేయవలసి ఉంటుంది. టెలిఫోను, ఇతర ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా అన్ని సమయాల్లో అందుబాటులో ఉండాలి. 

(ఇ)          కార్యాలయాలకు హాజరయ్యే అధికారులందరూ మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వాడకంతో పాటు, సబ్బు మరియు నీటితో తరచుగా చేతులు కడుక్కోవడం వంటి కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.

పౌరులు, ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల శ్రేయస్సు కోసం ఈ సూచన లన్నింటినీ తు.చ. తప్పకుండా పాటిస్తారనే ఆశాభావాన్ని కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు.  అయినప్పటికీ, అధికారిక పనిలో అంతరాయాన్ని అనుమతించడం జరగదనీ, కోవిడ్ కారణంగా అనారోగ్యానికి గురైన ప్రభుత్వ ఉద్యోగుల వల్ల జరిగే పని నష్టాన్ని తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతాయని ఆయన పునరుద్ఘాటించారు.

"పని ప్రదేశంలో టీకా" అనే భావన విజయవంతమైన నమూనాగా ఉద్భవించిందని, డాక్టర్ జితేంద్ర సింగ్, సంతృప్తి వ్యక్తం చేశారు.   రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు, ఇదే విధానాన్ని అనుకరించాలని, ఆయన కోరారు.  నార్త్ బ్లాక్‌ లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రంలో ఇప్పటివరకు 228 మందికి పైగా టీకా అందుకున్నారని, ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, విభాగాల్లో కూడా ఇటువంటి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఆయన, చెప్పారు.  18 సంవత్సరాల మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల అర్హులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ త్వరగా టీకాలు వేయాలని ఆయన తన విజ్ఞప్తిని మరోసారి పునరుద్ధరించారు.

మహమ్మారి నెలకొన్న గత సంవత్సర కాలంలో, ప్రభుత్వ కార్యాలయాల్లో అనుసరించాల్సిన మార్గదర్శకాలను డి.ఓ.పి.టి అభివృద్ధి చేసిందని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేశారు.  కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం తో పాటు, కార్యాలయాల పనితీరును సమర్థవంతంగా, అంతరాయం లేకుండా కొనసాగించాలనే లక్ష్యంతో, వీటిని రూపొందించినట్లు, ఆయన తెలిపారు.  డి.ఓ.పి.టి. అభివృద్ధి చేసిన "ఇంటి నుండి పనిచేసే విధానం" (డబ్ల్యూ.ఎఫ్.హెచ్) చాలా విజయవంతమైందని కూడా ఆయన చెప్పారు.  ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పని దినాలతో పాటు సెలవు దినాల్లో కూడా ఆన్-లైన్‌ లో పనిచేస్తూ ఉండడంతో, పని ఉత్పాదన సాధారణ పరిస్థితుల కంటే చాలా ఎక్కువగా జరిగిందని ఆయన వివరించారు. 

 

 

<><><>



(Release ID: 1723603) Visitor Counter : 177