సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ జమ్మూ కాశ్మీర్ లో ప్రజాప్రతినిధులు టీకాల కార్యక్రమం వేగవంతం చేయాలి : కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రజల భాగస్వామ్యంతో టీకా కార్యక్రమం ప్రజా ఉద్యమంగా అమలు కావాలని పిలుపు

Posted On: 19 MAY 2021 4:53PM by PIB Hyderabad

ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ కేంద్రపాలిత జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో టీకాల కార్యక్రమం వేగవంతంగా అమలు జరిగేలా చూడడానికి కృషి చేయాలని రాష్ట్ర ప్రజా ప్రతినిధులను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కోరారు. జమ్ము మరియు శ్రీనగర్ మునిసిపల్ కార్పొరేషన్ల స్వచ్ఛ్ భారత్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, వైద్య పారిశుధ్య శాఖల సిబ్బందితో డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు సమావేశం నిర్వహించారు. ఎక్కువ మంది ప్రజలు టీకాలు తీసుకొనేలా చూడడానికి రెండు కార్పొరేషన్లు కృషి చేయాలని ఆయన సూచించారు. 

రాష్ట్రాలకు మరింత ఎక్కువగా వాక్సిన్ ను అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి అన్నారు. నిన్న రాష్ట్రాలు, జిల్లాల అధికారులతో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వాక్సిన్ సరఫరాని ఎక్కువ చేస్తామని ప్రకటించారని, దీనికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ఆరోగ్య మంత్రిత్వశాఖ సిద్ధం చేస్తున్నదని అన్నారు. 15 రోజుల్లో అమలు చేయవలసిన కార్యక్రమ వివరాలను త్వరలో రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు అందిస్తామని అన్నారు. దీనిని ఆధారంగా చేసుకుని జిల్లాల వారీగా ప్రాధాన్యతా క్రమంలో ప్రణాళికను సిద్ధం చేసుకోవలసి ఉంటుందని అన్నారు. 

టీకాల కార్యక్రమం ప్రజా ఉద్యమంగా అమలు జరిగేలా చూడాలని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రజా ప్రతినిధులకు పిలుపు ఇచ్చారు. టీకాల కార్యక్రమం వేగంగా  అమలు జరిగేలా చూడడానికిమునిసిపల్ కార్పొరేషన్లు ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని ఆయన సూచించారు. వైద్య పరిపాలనా అంశాలతోపాటు కోవిడ్-19 కట్టడి, నివారణా చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్లకు కృత్రిమ కొరత ఏర్పడకుండా చూడడానికి ప్రజా సంఘాలు కృషి చేయాలని అన్నారు. 

ప్రజలు ధైర్యంగా జీవించేలా చూడడానికి ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. కోవిడ్ ను ఎదుర్కోవడానికి " భయం కాదు ముందు జాగ్రత్త అవసరం "అన్న నినాదంతో ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఆయన సూచించారు. కోవిడ్-19 మార్గదర్శకాలు, టీకా ఆవశ్యకతను వివరించడానికి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అవగాహనా కార్యక్రమాలను చేపట్టాలని మంత్రి అన్నారు. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో కోవిడ్-19 చికిత్స ఉందని ఆయన అన్నారు. 

జమ్మూ కాశ్మీరులో  కోవిడ్ మౌలిక సదుపాయాలను మెరుగు పరచి తగిన సహకారం అందేలా చూడడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, రాష్ట్ర గవర్నర్,  సీనియర్ అధికారులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నామని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. జమ్మూ, శ్రీనగర్ డిఆర్‌డిఓ కోవిడ్ కేర్ సెంటర్లతో పాటు చెనాని, రాజౌరి మరియు ఇతర ప్రాంతాలలో  మరిన్ని కేంద్రాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కోవిడ్ సంరక్షణ కోసం  ప్రైవేట్ ఆసుపత్రులు కొన్ని పడకలను కేటాయించేలా చూడడానికి రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.  

ఇళ్ల నుంచి వైద్య సేవలను ఉచితంగా పొందేలా చూడడానికి టెలిమెడిసిన్ సేవలను విస్తృతం చేయవలసిన అవసరం ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. షిఫ్తుల పద్దతిలో టెలి-కన్సల్టేషన్ సేవలను అందించడానికి దేశంలో గుర్తింపు పొందిన వైద్యుల ఎంపానెల్మెంట్ కోసం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేశామని మంత్రి తెలిపారు. వైద్యం కోసం జమ్మూ మరియు శ్రీనగర్ జిఎంసికి పంపడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన మంత్రి స్వల్ప లక్షణం లేని రోగులు ప్రోటోకాల్ ప్రిస్క్రిప్షన్ల ప్రకారం లేదా ఐసొలేషన్ ఉంటూ తగిన చికిత్స పొందవచ్చునని ఆయన అన్నారు. 

జమ్మూ మరియు శ్రీనగర్ రెండు రాజధాని నగరాలకు డాక్టర్ జితేంద్ర సింగ్ నిన్న కోవిడ్  సంబంధిత సామగ్రిని వేర్వేరుగా పంపించారు. ఇంతకుముందు మంత్రి అందించిన సామగ్రిని ఆయన సొంత  లోక్‌సభ నియోజకవర్గమైన ఉధంపూర్-కథువా-దోడలోని ఆరు జిల్లాలకు పంపారు.

***



(Release ID: 1720002) Visitor Counter : 139