ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప్రపంచ బ్యాంక్-ఐఎంఎఫ్ 103 వ సమావేశ అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్

Posted On: 09 APR 2021 7:32PM by PIB Hyderabad

ఈ రోజు జరిగిన  ప్రపంచ బ్యాంక్-ఐఎంఎఫ్ అభివృద్ధి కమిటీ   103 వ సమావేశంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా  సీతారామన్ పాల్గొన్నారు.  

ప్రపంచ బ్యాంక్ గ్రూప్ (డబ్ల్యుబిజి) అందించే రుణ ఉపశమనం,కోవిడ్-19 మహమ్మారి, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన సంఖ్యలో సకాలంలో వాక్సిన్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చే అంశంలో  ప్రపంచ బ్యాంక్ గ్రూప్ మద్దతు, కోవిడ్-19 నుంచి తేరుకుని స్థితిస్థాపక పునరుద్ధరణ దిశగా సాగుతున్న ప్రయత్నాలకు సహకరించడం లాంటి అంశాలను సమావేశంలో చర్చించారు. 

 

సమావేశంలో ప్రసంగించిన శ్రీమతి నిర్మలా సీతారామన్ కోవిడ్ బారిన పడిన ఆర్ధికవ్యవస్థలను, ప్రజలను రక్షించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారని అన్నారు. కోవిడ్ తీవ్రతను తగ్గించి ఆర్ధిక వ్యవస్థపై దీని ప్రభావం లేకుండా చూడడానికి ప్రభుత్వం అనేక చర్యలను అమలు చేసిందని ఆమె వివరించారు. ఆర్ధిక సామాజిక సమస్యలు ఎదురుకాకుండా చూడడానికి గత ఏడాది కాలంగా అనేక ఆర్ధిక ప్యాకేజీలను అమలు చేశామని శ్రీమతి నిర్మలా సీతారామన్ వివరించారు. 

జిడిపిలో 13% కంటే ఎక్కువ మొత్తంలో ప్రభుత్వం 27.1 ట్రిలియన్ రూపాయల విలువ చేసే  ఆత్మ నిర్భర్ ప్యాకేజీలను ప్రకటించామని   సభ్యులకు  శ్రీమతి నిర్మలా సీతారామన్  వివరించారు. పేదలను ఆదుకోవడంతో పాటు ఆర్ధిక సంస్కరణలను అమలు చేయాలన్న లక్ష్యంతో ఈ  ప్యాకేజీలను రూపొందించాలని ఆమె తెలిపారు. 

కోవిడ్ నేపథ్యంలో  ప్రపంచ బ్యాంక్ గ్రూప్ తొలిసారిగా 100 బిలియన్ అమెరికా డాల్లర్ల విలువ చేసే ఆర్ధిక సహకారం అందించడం పట్ల  శ్రీమతి నిర్మలా సీతారామన్ హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాక్సిన్ సకాలంలో అందుబాటులోకి వచ్చేలా చూడడానికి  ప్రపంచ బ్యాంక్ గ్రూప్ చర్యలను తీసుకున్నదని మంత్రి అన్నారు. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, గావిలతో  ప్రపంచ బ్యాంక్ గ్రూప్ సమన్వయంతో పనిచేసిందని ఆమె పేర్కొన్నారు. 

***



(Release ID: 1710772) Visitor Counter : 194