ప్రధాన మంత్రి కార్యాలయం
వారాణసీ లో ‘కాశీ ఏక్ రూప్ అనేక్’ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ఎమ్ఎస్ఎమ్ఇ లను, నైపుణ్యం కల పనివారి ని, సాంప్రదాయిక హస్తకళ ల శ్రామికుల ను బలోపేతం చేయడం 5 ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధన లో సహాయకారి కాగలదంటూ ఉద్ఘాటన
Posted On:
16 FEB 2020 6:16PM by PIB Hyderabad
ప్రభుత్వం 5 ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ అనేటటువంటి లక్ష్యాన్ని సాధించడం కోసం నిర్ణయాలు తీసుకోవడాన్ని కొనసాగిస్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న స్పష్టం చేశారు. వారాణసీ లో ఈ రోజు మధ్యాహ్నం పూట జరిగి న ఒక కార్యక్రమం లో ఆయన ప్రసంగిస్తూ సాంప్రదాయిక హస్తకళ ల శ్రామికుల ను, నిపుణులైన కార్మికుల ను మరియు ఎమ్ఎస్ఎమ్ఇ లను బలోపేతం చేయడం ఈ లక్ష్యాన్ని సాధించడం లో సహాయకారి అవుతుందన్నారు.
వారాణసీ లోని బడా లాల్పుర్ లో గల దీన్దయాళ్ ఉపాధ్యాయ ట్రేడ్ ఫెసిలిటేశన్ సెంటర్ లో నిర్వహించిన ‘కాశీ ఏక్ రూప్ అనేక్’ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో ఉత్తర్ ప్రదేశ్ లోని కాశీ, తదితర జిల్లాల నేతకారులు మరియు చేతివృత్తి కళాకారులు చేసిన వివిధ ఉత్పత్తుల తో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శన ను ప్రధాన మంత్రి సందర్శించారు. ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’లో భాగం గా ప్రదర్శన లో ఉంచిన చేనేత స్టాల్ తో పాటు, గులాబి రంగు మీనాకారీ, చెక్క తో చేసిన బొమ్మలు, చందౌలీ నల్ల బియ్యం, కన్నౌజ్ పరిమళాలు, మొరాదాబాద్ కు చెందిన లోహ కళలు, ఆగ్రా తోలు పాదరక్షలు, లఖ్నవూ చికన్కారీ , ఆజంగఢ్ కుమ్మరి పనితనం స్టాల్స్ ను ప్రధాన మంత్రి పరిశీలించడమే కాక నిపుణులైన కార్మికులతోను, హస్తకళ ల శ్రామికుల తోను సంభాషించారు. వేరు వేరు హస్తకళల పనివారి కి ఆయన ఆర్థిక సహాయాన్ని మరియు పనిముట్ల ను కూడా అందజేశారు.
భారతదేశ ఉత్పత్తుల కు అంతర్జాతీయ బజారు లో అధికం గా అవకాశాల ను కల్పించడం కోసం అనేక కార్యక్రమాల ను అమలులోకి తీసుకువస్తున్నందుకు, అనేక పథకాల ద్వారా చేత్తివృత్తుల పనివారికి, నేతకారుల కు యంత్రాల ను, పరపతి ని, రుణాల ను అందజేస్తున్నందుకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అమలుపరుస్తున్న ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రాడక్ట్’ కార్యక్రమం వంటి కార్యక్రమాల కారణం గా గత రెండు సంవత్సరాలు గా యుపి నుండి ఎగుమతులు నిలకడ గా పెరుగుతున్నాయన్న సంగతి ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. యుపి కి చెందిన ఉత్పత్తులు విదేశాల కు చేరుకోవడం మరియు ప్రపంచం లోని ఆన్ లైన్ విపణి లోకి ప్రవేశించడం వల్ల దేశం లాభపడుతుందని ప్రధాన మంత్రి అన్నారు.
భారతదేశం లోని ప్రతి ఒక్క జిల్లా ఏదో ఒక విశిష్టమైన కళ కు, పట్టు కు, సుగంధ ద్రవ్యాలకు.. ఇలాగ ఏదైనా ఒక విశిష్టమైన ఉత్పత్తి కి పేరుగాంచినట్టు గుర్తించవచ్చు అని ప్రధాన మంత్రి చెప్పారు. ‘మేక్ ఇన్ ఇండియా’ మరియు ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్’ల వంటి ఆలోచన ల వెనుక ఉన్న అతిపెద్ద ప్రేరణ ఇదే అంటూ ఆయన వివరించారు.
గడచిన రెండేళ్ళ కాలం లో యుపి ఇన్స్ టిట్యూట్ ఆఫ్ డిజైన్ (యుపిఐడి) 30 జిల్లాల కు చెందిన ఆర్టిజాన్ లు, వీవర్లు 3500 మంది కి పైగా అండదండల ను అందించిందని ఆయన గుర్తు కు తీసుకువచ్చారు. 1000 కి పైగా శ్రామికుల కు టూల్ కిట్స్ ను కూడా ఇవ్వడమైందన్నారు. వీవర్లు, ఆర్టిజాన్ లు, నేతకారుల వంటి వారికి మద్ధతు ఇవ్వడం లో యుపిఐడి యత్నాలను ఆయన మెచ్చుకొన్నారు.
భారతదేశం లో తయారైన ఉత్పత్తుల నాణ్యత ను 21వ శతాబ్దం డిమాండ్ల కు అనుగుణం గా మెరుగుపరచవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. మన సాంప్రదాయిక పరిశ్రమల కు సంస్థాపరమైన మద్దతును, ఆర్థిక సహాయాన్ని, క్రొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఇంకా విక్రయపరమైన సౌలభ్యాన్ని కలుగజేయవలసిన ఆవశ్యకత ఉందని ప్రధాన మంత్రి అన్నారు. గత అయిదు సంవత్సరాల లో మేము ఈ దిశ గా కృషి చేస్తున్నాము అని ఆయన వెల్లడించారు. దేశం లో ప్రతి ఒక్కరి కి సాధికారిత కల్పన పై శ్రద్ధ ను తీసుకొంటూ ఒక నూతన వైఖరి తో మేము ముందుకు కదులుతున్నాము అని ఆయన అన్నారు.
పరిశ్రమల కు మార్గాన్ని సుగమం చేయడం కోసం అనేక చర్యల ను తీసుకొన్నట్లు ప్రధాన మంత్రి వివరిస్తూ, ఈ సంవత్సరం బడ్జెటు లో తయారీ కి మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అత్యంత ప్రాముఖ్యాన్ని కట్టబెట్టినట్లు చెప్పారు. 1500 కోట్ల రూపాయల కేటాయింపు తో నేశనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిశన్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడమైందని ఆయన అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో డిఫెన్స్ కారిడోర్ కోసం 3700 కోట్ల రూపాయల నిధుల ను కేటాయించడం జరిగిందన్నారు. ఈ కారిడోర్ ద్వారా చిన్న పరిశ్రమలు లబ్ధి ని పొందుతాయి. అంతేకాక ఇది క్రొత్త ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తుంది అని ఆయన చెప్పారు.
గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ (జిఇఎమ్) చిన్న వ్యాపార సంస్థ లు ప్రభుత్వాని కి వస్తువుల ను విక్రయించడాన్నిసులభతరం చేసిందని ప్రధాన మంత్రి అన్నారు. ఏకీకృత కొనుగోలు వ్యవస్థ (యుపిఐ)ని ఏర్పాటు చేయడం వల్ల చిన్న పరిశ్రమల ద్వారా వస్తువుల ను మరియు సేవల ను ఒకే వేదిక మీది నుండి సేకరించడం లో ప్రభుత్వాని కి మరింత వీలు చిక్కుతుందని ఆయన తెలిపారు.
ప్రప్రథమం గా దేశం లో నేశనల్ లాజిస్టిక్స్ పాలిసి
ని రూపొందించడం జరుగుతోంది. ఇది ఇ-లాజిస్టిక్స్ కు సింగిల్ విండో ను నెలకొల్పుతుంది. దీని ద్వారా చిన్న తరహా పరిశ్రమలు మరింత స్పర్ధాత్మకత ను సంతరించుకోవడం తో పాటు ఉపాధి కల్పన లోనూ సహాయకారి గా ఉంటాయి అని ఆయన వివరించారు.
భారతదేశాన్ని ఒక తయారీ రంగ దిగ్గజం గా తీర్చిదిద్దేందుకు ఉమ్మడి ప్రయత్నాల ను చేపట్టవలసింది గా ప్రతి ఒక్కరి కి విజ్ఞప్తి చేస్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
***
(Release ID: 1708385)