పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

67.5 లక్షల మంది భారతీయులను స్వదేశానికి చేర్చిన 'వందే భారత్‌ మిషన్‌'

Posted On: 21 MAR 2021 5:22PM by PIB Hyderabad

కరోనా ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన 67.5 లక్షలకు పైగా భారతీయులను 'వందే భారత్‌ మిషన్‌' స్వదేశానికి చేర్చింది.

    "67.5 లక్షల మంది భారతీయులు వందే భారత్‌ మిషన్‌ ద్వారా స్వదేశానికి చేరుకున్నారు, ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది" అని, పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ హర్దీప్‌ సింగ్‌ పూరి ట్వీట్‌ చేశారు. "విదేశాల్లో చిక్కుకుపోయిన, నిరాశకు గురైనవారిని తిరిగి ఇళ్లకు చేర్చడం మాత్రమే ఈ మిషన్‌ ఉద్దేశం కాదు. ఇది ఆశల్ని చిగురింపజేసే, ఆనందాన్ని కలిగించే మిషన్‌. కఠిన పరిస్థితుల్లో తమను భారత్‌ వదిలేయదు అని ప్రజలు తెలుసుకునేందుకు ఉద్దేశించిన మిషన్‌" అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

    కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి చేర్చడానికి గతేడాది మే 7న ప్రపంచంలోనే అతి పెద్ద తరలింపు కార్యక్రమాన్ని భారత్‌ చేపట్టింది. 

    తొలుత ఎయిర్‌ ఇండియా, దాని అనుబంధ సంస్థ అయిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఈ కార్యక్రమంలో కీలకంగా పాల్గొన్నాయి. తర్వాత, ఇతర విమానయాన సంస్థలకు కూడా అవకాశం కల్పించారు. నౌకాదళ నౌకల్ని కూడా ఈ మిషన్‌లో వినియోగించారు.

***



(Release ID: 1706498) Visitor Counter : 143