మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా జాతీయ బాలికా దినోత్సవం

Posted On: 24 JAN 2021 5:17PM by PIB Hyderabad

    దేశవ్యాప్తంగా జాతీయ బాలికా దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నారు. దేశంలోని బాలిలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి, తగిన అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జనవరి 24న కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ చొరవతో జాతీయ బాలికా దినోత్సవాన్ని పాటిస్తూ వస్తున్నారు. బాలికల హక్కులపై అవగాహన కల్పించడం, బాలికా విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారాలకు ప్రాముఖ్యం ఇవ్వడం కూడా బాలికా దినోత్సవం లక్ష్యాలు.

  జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బాలికలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు. “జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విజయాలు సాధించిన దేశంలోని బాలికలందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆడపిల్లలకు సాధికారత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. విద్యావకాశాలు, మెరుగైన ఆరోగ్య రక్షణ సదుపాయాలను వారికి అందుబాటులోకి తెచ్చింది. లైంగిక సమానత్వ భావనను కూడా కల్పించింది.” అని మోదీ ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు.

  కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ జుబిన్ ఇరానీ కూడా ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. “జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రతి బాలికకు సమాన హక్కులు లభించేలా, తగిన అవకాశాలతో వారికి సాధికారత కలిగేలా చిత్తశుద్ధితో కృషి చేయగలమని పునరుద్ఘాటిస్తున్నాం. బాలిలు మన జాతికి గర్వకారణంగా పరిగణిద్దాం.  దేశ్ కీ బేటీ అన్న పదజాలంతో బాలిక ప్రాముఖ్యంపై అవగాహనను పూర్తి స్థాయిలో వ్యాపింపజేద్దాం.” అని ఆమె ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు.

   బాలికల అభ్యున్నతి, సాధికారత లక్ష్యంగా విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, సైన్స్ టెక్నాలజీ తదితర మంత్రిత్వ శాఖలు అనేక చర్యలు, కార్యక్రమాలు చేపట్టాయి. 

  బాలికల అభ్యున్నతి లక్ష్యంగా లైంగిక సమ్మిళిత నిధిని జాతీయ విద్యా విదానం (ఎన్.ఇ.పి.)-2020 ప్రవేశపెట్టింది. బాలికలందరికీ నాణ్యమైన, సమానమైన విద్యావకాశాలు కల్పించేందుకు భారతప్రభుత్వం “లైంగిక సమ్మిళిత నిధి”ని ఏర్పాటు చేయబోతోంది. పాఠశాలల్లో బాలికల నమోదు వందశాతం జరిగే అంశంపై ఈ నిధి దృష్టిని కేంద్రీకరిస్తుంది. ఉన్నత విద్యలో బాలికలకు రికార్డు స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించేందుకు, అన్ని స్థాయిల్లో లైంగిక పరమైన అంతరాలను తగ్గించేందుకు, సమాజంలో లైంగిక సమానత్వం కల్పించేందుకు, బాలికల్లో నాయకత్వం సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఈ నిధి తరఫున కృషి జరుగుతుంది. విద్యాభ్యాస సమయంలో బాలికలకు, ట్రాన్స్ జెండర్లకు స్థానిక స్థాయిలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించేందుకు, అందుకు సామాజిక ప్రాతిపదికన నిర్వహించే కార్యక్రమాలను వేగవంతం చేసే లక్ష్యంతో రాష్ట్రాలకు తగిన మద్దతు అందించేందుకు కూడా ఇది దోహదపడుతుంది.  

   పాఠశాలలకు వెళ్లే బాలికలకు పాఠశాల లోపల, బయటా భద్రత, రక్షణ కల్పించే అంశంపై 2020వ సంవత్సరపు జాతీయ విద్యా విధానం దృష్టిని కేంద్రీకరిస్తుంది. పాఠశాలలను గుర్తింపు జాబితాలో చేర్చే ముందుగా, తమ ఆవరణలో వేధింపులకు, వివక్షకు, ఆధిపత్యానికి తావులేని వాతావరణం కల్పించగలమని ఆయా పాఠశాలలు హామీ ఇవ్వవలసి ఉంటుంది. దీనితో తరగతి గదిలో బాలికల హాజరు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. బాలికలకు విద్య అందుబాటులోకి రాకుండా అడ్డంకులు కల్పించే సామాజిక ఆధిపత్యం, లింగవివక్ష వంటి వాటిని విద్యా విధానం గుర్తిస్తుంది.  

  బాలికా విద్య లక్ష్యంగా అనేక కార్యక్రమాలను చేపట్టేందుకు వీలు కల్పించే సమగ్ర శిక్షా అనే పథకాన్ని విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ అమలు చేస్తోంది. లైంగిక పరమైన, సామాజిక పరమైన అంతరాలను పాఠశాల విద్యలోని అన్ని స్థాయిల్లో తొలగించడం సమగ్ర శిక్షా పథకం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి.

  విద్యలో బాలికల ప్రాతినిధ్యం, భాగస్వామ్యం పెరిగేలా చర్యలు తీసుకునేందుకు సమగ్ర శిక్షా పథకంకింద అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. అవి:

  • ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఇరుగు పొరుగు ప్రాంతాల్లో పాఠశాలలను ప్రారంభించడం,
  • 8వ తరగతి వరకూ విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందించడం,
  • 8 తరగతి వరకూ బాలికలకు యూనిఫాం దుస్తులు అందించడం. షెడ్యూల్డ్ కులాలు, తెగల బాలికలకు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి వాటిని అందించడం,
  • అన్ని పాఠశాలల్లో బాలికలకు విడిగా ప్రత్యేకంగా మరుగుదొడ్ల ఏర్పాటు,
  • బాలికల భాగస్వామ్యం పెంచే లక్ష్యంతో ఈ అంశంపై ఉపాధ్యాయులకు అవగాహనా కార్యక్రమాలు,
  • ఆరవ తరగతి నుంచి 12వ తరగతి వరకూ బాలిలకు ఆత్మరక్షణలో శిక్షణ అందించడం,
  • ప్రత్యేక అవసరాల చిన్నారుల (సి.డబ్ల్యు.ఎస్.ఎన్.) కేటగిరీకి చెందిన బాలికలకు 1వ తరగతినుంచి 12వ తరగతి వరకూ స్టైపెండ్ అందించడం,
  • గురుకుల, ఆశ్రమ పాఠశాలలు/వసతి గృహాలు,
  • మారుమూల/కొండప్రాంతాల్లో అయితే, ఉపాధ్యాయులకు నివాస క్వార్టర్లను నిర్మించడం.

 ఈ కార్యక్రమాలతో పాటుగా అదనపు కార్యక్రమాలు కూడా అమలు జరగుతూ ఉన్నాయి. పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని స్థాయిల్లో లైంగిక అంతరాలను తగ్గించేందుకు, తగిన అవకాశాలకు నోచుకోని వివిధ వర్గాల బాలికలకు నాణ్యమైన విద్య అందించడం వంటి లక్ష్యాలకోసం విద్యాపరంగా వెనుకబడిన బ్లాకుల పరిధిలో సమగ్ర శిక్షా పథకం కింద కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల పేరిట పలు పాఠశాలలను మంజూరు చేశారు.

  క్రీడల్లో మహిళల భాగస్వామ్యం దిశగా అవగాహనకు సానుకూల వాతావరణాన్ని పెంచేందుకు చిన్నారి బాలికలు చురుకుగా క్రీడల్లో పాల్గొనేలా చూసేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఇటీవల కొన్నేళ్లుగా అనేక కార్యక్రమాలను ప్రోత్సహించింది. క్రీడా సంబంధమైన కార్యకలాపాల్లో, పోటీల్లో బాలికలకు, మహిళలకు ఎదురయ్యే అవరోధాలను తొలగించే అంశంపై ఖేలో ఇండియా పథకం ద్వారా ఈ మంత్రిత్వ శాఖ తన దృష్టిని కేంద్రీకరించింది. బాలికల ప్రాతినిధ్యం పెంచేందుకు అవసరమైన వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. దీనితో 2018నుంచి 20202 వరకూ జరిగిన ఖేలో ఇండియా క్రీడోత్సవాల్లో మహిళల భాగస్వామ్యం 161శాతం పెరిగింది. ఖేలో ఇండియా పథకం కింద 657మంది మహిళా క్రీడాకారులకు ప్రోత్సాహం అందించగా, ఇపుడు వారి సంఖ్య 1,471కి పెరిగింది. అంటే ఏకంగా 223శాతం పెంపు నమోదైంది.  ఇక 2018 సెప్టెంబరులో చేపట్టిన టార్గెట్ ఒలింపిక్ పోడియంపథకంలో భాగంగా 86మంది మహిళా క్రీడాకారులకు శిక్షణ అందించారు. ప్రస్తుతం వారి సంఖ్య 190కి పెరిగింది. అంటే ఏకంగా 220 శాతం పెంపు నమోదైంది.

   ఇక మహిళా శాస్త్రవేత్తలకు, మహిళా సాంకేతిక పరిజ్ఞాన నిపుణలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర సైన్స్ టెక్నాలజీ శాఖ KIRAN అనే పథకాన్ని ప్రారంభించింది. పలు కార్యక్రమాల ద్వారా పరిశోధన, అభివృద్ధి అంశాల్లో మహిళా ప్రతిభకు మరింత భాగస్వామ్యం కల్పించడం ద్వారా సైన్స్, టెక్నాలజీ రంగాల్లో పురుషులతో సమానంగా స్త్రీలకు అవకాశాలు కల్పించడం ఈ పథకం లక్ష్యం.

 

 

 

 

మహిళలకోసం ప్రత్యేకంగా కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ చేపట్టిన కార్యక్రమాలు, ఫలితాలు

క్రమసంఖ్య

కార్యక్రమం

ఫలితం

  1. ఒఒ

డబ్ల్యు.ఒ.ఎస్.-ఎ, డబ్ల్యు.ఒ.ఎస్.-బి, డబ్ల్యు ఒ.ఎస్.-సి తో సహా మహిళా శాస్త్రవేత్తల పథకం

గత ఐదేళ్లు, ప్రస్తుత ఏడాదితో కలిపి 2,200మందికి పైగా మహిళా శాస్త్రవేత్తలకు ప్రయోజనం.

  1.  

సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణిత శాస్త్రాల మహిళలకు ఇండో-అమెరిక ఫెలోషిప్ (2017లో ప్రారంభం)

రెండు బృందాలుగా 40 మంది మహిళా శాస్త్రవేత్తలు

  1.  

మహిళా వర్సిటీల్లో సృజనాత్మక, ప్రతిభా పూర్వక విశ్వవిద్యాలయ పరిశోధన (క్యూరీ సి.యు.ఆర్.ఐ.ఇ.)

దాదాపు రూ.40 కోట్లతో 8మహిళా విశ్వవిద్యాలయాలకు మద్దతు.  సుమారు 25,000మంది విద్యార్థులకు ప్రయోజనం

  1.  

క్యూరీ-కృత్రిమ మేధో విజ్ఞాన సదుపాయం (2019లో ప్రారంభం)

రూ. 9.26కోట్లతో మహిళా విశ్వవిద్యాలయాలకు సహాయం

  1.  

విజ్ఞాన జ్యోతి (2019లో ప్రారంభం)

వంద జిల్లాలు(12 ఆశావహ జిల్లాలతో సహా) దాదాపు 2,500మంది మహిళలు.

  1.  

మహిళా శాస్త్రవేత్తల, టెక్నాలజిస్టుల జాతీయ శిక్షణా కార్యక్రమం (2012-13లో మొదలు)

ప్రభుత్వ రంగంలో పనిచేసే 1,359మంది మహిళా శాస్త్రవేత్తలు (2012 నుంచి)

  1.  

మహిళలకోసం సైన్స్, టెక్నాలజీ

గత 3ఏళ్లలో 82 ప్రాజెక్టులు

  1.  

మహిళల టెక్నాలజీ పార్కులు  (డబ్ల్యు.టి.పి.లు)

42 (ప్రారంభంనుంచి)

  1.  

సైన్స్, ఇంజినీరింగ్ పరిశోధనా మండలి (ఎస్.ఇ.ఆర్.బి.) మహిళల ప్రతిభా పురస్కారం

57 (ప్రారంభంనుంచి)

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

సైన్స్, టెక్నాలజీ రంగంలో మహిళల సాధికారత లక్ష్యంగా అనేక కార్యక్రమాలను కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ నిర్వహిస్తోంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమ్యాటిక్స్ (ఎస్.టి.ఇ.ఎం.)లో లైంగిక సమానత్వం లక్ష్యంగా వివిధ సైన్స్ టెక్నాలజీ సంస్థల్లో లైంగిక ప్రగతి కార్యక్రమాన్ని 2020లో ప్రారంభించారు. సంస్థ స్థాయిలో గణనీయమైన, పరివర్తనా పూర్వక మార్పులు తీసుకువచ్చేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. ఆయా సంస్థల సామర్థ్యాలను పెంపొందించడం ప్రాతిపదికగా కొత్త సానుకూల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు, మహిళలకు ప్రేరణతో కూడిన మద్దతు అందించేందుకు ఈ పథకానికి రూపకల్పన చేశారు. మహిళల సైన్స్, టెక్నాలజీపై కొత్త వెబ్ పోర్టల్ ను ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నారు. మహిళలకు సంబంధించిన ఉపకార వేతనాలు, ఫెలోషిప్పులు, ఉద్యోగాలు తదితర సమాచారాన్ని ఈ పోర్టల్ లో పొందుపరుస్తారు. మహిళా విద్యార్థులకు, పి.హెచ్.డి. విద్యార్థులకు, పోస్ట్ డాక్టోరల్ ఫెలో షిప్పులకు ఇలా అన్నింటికీ సంబంధించిన సమాచారం ఇచ్చే ఏకైక వ్యవస్థగా ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది.

  దేశంలోని మహిళల్లో నైపుణ్యాలను పెంపొందించే సానుకూల వాతావరణాన్ని కల్పించేందుకు  నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది.  మొత్తం 33 జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థల్లో, 19సంస్థలు ప్రత్యేకంగా మహిళలకే నైపుణ్య శిక్షణ అందిస్తున్నాయి. జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థల్లో క్రాఫ్ట్స్ మెన్ శిక్షణా పథకం కింద 3,400 సీట్లు మంజూరయ్యాయి. క్రాఫ్స్ట్ ఇన్.స్ట్రక్టర్ శిక్షణా పథకంకింద 2,225 సీట్లు మంజూరయ్యాయి. ఐ.టి. నెట్వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అడ్వాన్స్.డ్ డిప్లమాలో 421మంది మహిళలకు శిక్షణ అందించారు. స్ట్రైవ్ (STRIVE) పథకంకింద సహాయం పొందే పారిశ్రామిక శిక్షణా కేంద్రాల్లో (ఐ.టి.ఐ.ల్లో) మహిళల నమోదు 15.5శాతంనుంచి 19.1శాతానికి పెరిగింది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పి.ఎం.కె.వి.వై.) పథకం కింద 2019-20 ఆర్థిక సంవత్సరంలో 23లక్షల మందికి ఆర్.పి.ఎల్. సర్టిఫికెట్లు ప్రదానం చేయగా, వాటిలో 5లక్షల మంది మహిళలే ఉన్నారు. మొత్తం 271 జన శిక్షణా సంస్థాన్ (జె.ఎస్.ఎస్.)లు మంజూరు కాగా, వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 227 జె.ఎస్.ఎస్.లు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. వీటిలో సంవత్సరానికి 4లక్షల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందగా, వారిలో 85శాతం మంది మహిళలే ఉన్నారు.

 

****



(Release ID: 1692072) Visitor Counter : 1043