యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

క్రీడలపై నమ్మకం పెరిగేలా “వాడా”కు భారత్ సంపూర్ణ మద్దతు: కిరెన్ రిజిజు

Posted On: 07 DEC 2020 5:42PM by PIB Hyderabad

   ఉత్ప్రేరక మందుల కట్టడి (యాంటీ డోపింగ్), క్రీడా విజ్ఞానశాస్త్రంపై వెబినార్ సదస్సును కేంద్ర యవజన వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి కిరెణ్ రిజిజు ఈ రోజు ప్రారంభించారు. జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా), జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం (ఎన్.ఎస్.యు.), జాతీయ డోప్ టెస్టింగ్ లేబరేటరీ (ఎన్.డి.టి.ఎల్.) ఉమ్మడిగా  ఈ వెబినార్ సదస్సు నిర్వహించాయి. వర్చువల్ పద్ధతిలో ఆన్.లైన్ ద్వారా జరిగిన ఈ వెబినార్ కు ప్రపంచ యాంటీడోపింగ్ ఏజెన్సీ (వాడా-డబ్ల్యు.ఎ.డి.ఎ.) అధ్యక్షుడు విటోల్డ్ బాంకా, నాడా బ్రాండ్ అంబాసిడర్ సునీల్ షెట్టి, క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి రవి మిట్టల్, ఎన్.ఎస్.యు. వైస్ చాన్సిలర్ ఆర్.సి. మిశ్రా, నాడా సి.ఇ.ఒ., డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ, స్వచ్చమైన క్రీడలనే భారతదేశం  బలపరుస్తుందని, వాడా అధ్యక్షుడు విటోల్డ్ బాంకాకు స్పష్టంచేశారు. “వాడా సంస్థకు భారత్ అందించిన సేవలను ఉత్ప్రేరక మందుల కట్టడికి జరిగే పరిశోధనకు, దర్యాప్తు సామర్థ్యాల బలోపేతానికి  వినియోగించుకోవాలని సంకల్పించడం సంతోషదాయకం. న్యాయబద్ధమైన, స్వచ్ఛమైన క్రీడలకే భారత్ మద్దతు ఇస్తుంది. క్రీడలపై నమ్మకాన్ని పెంపొందించేందుకు అన్ని విధాలా జరిగే కృషికీ మేం బాసటగా నిలుస్తాం” అన్నారు.

  క్రీడల్లో డోపింగ్ బెడదను పూర్తిగా నిర్మూలించేందుకు నాడా కట్టుబడి ఉందని, డోపింగ్ కట్టడికి వాడా నిర్దేశించిన నిబంధనలన్నింటినీ నాడా అమలు చేస్తోందని కేంద్రమంత్రి చెప్పారు. “డోపింగ్ ప్రమేయంలేని క్రీడల నిర్వహణకు భారత్ కట్టుబడి ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. డోపింగ్ బెడదను నిర్మూలనా కృషిలో క్రీడా సమాజానికి భారత్ ఎప్పటిలాగే మద్దతు కొనసాగిస్తుంది. యాంటీ డోపింగ్ విధానాలను, నిబంధనలను భారత్ పాటిస్తూనే ఉంది. ప్రపంచ యాంటీ డోపింగ్ నియమావళికి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ వ్యవరిస్తోంది.” అన్నారు. ఈ విషయంలో వాడా సూచనలకు అనుగుణంగా ఎన్.డి.టి.ఎల్. చర్యలు తీసుకుందని కేంద్రమంత్రి తెలిపారు.

 

  నాడా బ్రాండ్ అంబాసిడర్ హోదాలో ప్రముఖ సినీ నటుడు సునీల్ షెట్టి మాట్లాడుతూ యాంటీ డోపింగ్ అంశంపై క్రమంతప్పని వెబినార్ల నిర్వహణతో  క్రీడాకారుల నడవడిక మరింత మెరుగుపడుతుందన్నారు. “యాంటీ డోపింగ్.పై చర్చకోసం వెబినార్ నిర్వహించడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. ఇలాంటి వెబినార్లు ఇకముందు కూడా కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇవి దీర్షకాలంలో క్రీడాకారులకు ప్రయోజనకరంగా ఉంటాయి.” అని సునీల్ షెట్టి అన్నారు.

 

 

****



(Release ID: 1678963) Visitor Counter : 72