యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

మరణించిన ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు మణితోంబి సింగ్‌ కుటుంబానికి రూ.5 లక్షలు మంజూరు చేసిన క్రీడా మంత్రిత్వ శాఖ

Posted On: 06 NOV 2020 6:02PM by PIB Hyderabad


    మరణించిన మణిపురి ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు మణితోంబి సింగ్‌ కుటుంబానికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అండగా నిలిచింది. ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడకుండా రూ. 5 లక్షల సాయం మంజూరు చేసింది.

    మణితోంబి (39) ఈ ఏడాది ఆగస్టులో చనిపోయారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆ కుటుంబానికి మణితోంబి ఆదాయమే ఆధారంగా నిలిచేది. "భారత ఫుట్‌బాల్‌ క్రీడకు మణితోంబి సేవ చేశారు. మణిపూర్‌లో శిక్షకుడిగానూ సేవలు అందించారు. ఆయన మరణం క్రీడా సమాజానికి లోటు. మణితోంబి మరణం తర్వాత ఆయన కుటుంబం ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటోందని తెలిశాక, సాయం చేయడం మా బాధ్యత. క్రీడాకారులుగా, శిక్షకులుగా, సహాయ సిబ్బందిగా, ఇతర విధాలుగా ఆటలకు జీవితాలను అంకితం చేసినవారికి అండగా నిలబడడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత" అని కేంద్ర క్రీడాశాఖ మంత్రి శ్రీ కిరెన్‌ రిజిజు చెప్పారు.

    పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ జాతీయ సంక్షేమ నిధి కింద ఈ రూ.5 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధి ద్వారా క్రీడాకారులకు నిరంతరంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తోంది. క్రీడారంగంలో పనిచేసిన వారిని సాయం కోసం దరఖాస్తు చేసుకొమ్మని కూడా కోరుతోంది.

***



(Release ID: 1670837) Visitor Counter : 96