వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

2020-21 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో ఎంఎస్‌పీ కార్యకలాపాలు


Posted On: 31 OCT 2020 4:50PM by PIB Hyderabad

2020-21 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణను దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. గత సీజన్ల మాదిరిగానే, ప్రస్తుత కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పథకాల ప్రకారం కనీస మద్దతు ధరల వద్ద పంటలను కొనుగోలు చేస్తోంది.

పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, జమ్ము&కశ్మీర్‌, కేరళ, గుజరాత్‌లో వరి ధాన్యం సేకరణ సాఫీగా సాగుతోంది. 30.10.2020 నాటికి, 197.19 ల.మె.ట. ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసింది. గతేడాది ఇదే సమయానికి సేకరించిన 159.76 ల.మె.ట. కంటే ఇది 23.43 శాతం అదనం. ప్రస్తుత సేకరణలో, ఒక్క పంజాబ్‌ నుంచే 136.47 ల.మె.ట. ధాన్యం గోదాములకు చేరింది. దేశవ్యాప్తంగా చూస్తే ఇది 69.21 శాతం.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 16.62 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొని, కనీస మద్దతు ధరగా రూ. 37,230.35 కోట్లను కేంద్రం చెల్లించింది.

 

రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు; ధర మద్దతు పథకం (పీఎస్‌ఎస్‌) ప్రకారం, ప్రస్తుత సీజన్‌లో 45.10 ల.మె.ట. పప్పుధాన్యాలు, నూనె గింజల సేకరణకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌కు అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళలో మొత్తం 1.23 ల.మె.ట. ఎండు కొబ్బరి సేకరణకు కేంద్రం అనుమతినిచ్చింది. మిగిలిన రాష్ట్రాలు/యూటీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు, పీఎస్‌ఎస్‌ ప్రకారం, ఎఫ్‌ఏక్యూ రకాల పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఎండుకొబ్బరి సేకరణకు అనుమతి లభిస్తుంది. ఒకవేళ  కనీస మద్దతు ధర కంటే మార్కెట్‌ రేటు తక్కువగా ఉంటే, నమోదిత రైతుల నుంచి 2020-21 ఎంఎస్‌పీ ప్రకారం నేరుగా పంటలను సేకరిస్తారు.

30.10.2020 వరకు; 4,811 మంది తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌, హర్యానా రైతులకు ప్రయోజనం కలిగిస్తూ, రూ. 45.51 కోట్ల కనీస మద్దతు ధరతో, 7,966.63 మె.ట. పెసలు, మినుములు, వేరుశనగను నోడల్‌ ఏజెన్సీల ద్వారా కేంద్రం సేకరించింది. అదేవిధంగా, 5089 మె.ట. ఎండు కొబ్బరిని రూ.52.4 కోట్ల కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసింది. దీనివల్ల తమిళనాడు, కర్ణాటకలోని 3961 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. ప్రధాన సేకరణ రాష్ట్రాల్లో ఎండుకొబ్బరి, మినుముల మార్కెట్‌ రేట్లు ఎంఎస్‌పీ కంటే ఎక్కువగా ఉన్నాయి. పప్పుధాన్యాలు, నూనెగింజలకు సంబంధించి, పంటల రాక పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాల్లో సేకరణల ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణలో గింజ పత్తి (కపస్‌) సేకరణ కూడా సాఫీగా సాగుతోంది. ఈనెల 30వ తేదీ వరకు, 1,14,376 మంది రైతుల నుంచి 6,03,711 బేళ్ల పత్తిని 'కాటన్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా' సేకరించింది. కనీస మద్దతు ధరగా 1,760.68 కోట్ల రూపాయలు చెల్లించింది. 

 

*******



(Release ID: 1669146) Visitor Counter : 155