మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేంద్రీయ విద్యాలయాల 4 నూతన భవనాలను గురువారం ప్రారంభించనున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి

Posted On: 07 OCT 2020 5:34PM by PIB Hyderabad

కేంద్రీయ విద్యాలయాల కోసం కొత్తగా కట్టిన 4 భవనాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్, వర్చువల్‌ పద్ధతిలో గురువారం ప్రారంభించనున్నారు. ఒడిశాలోని నయాఘర్‌ కేవీ, రాయ్‌రంగ్‌పూర్‌లోని మహుల్దిహా కేవీ, రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్‌ కేవీ, హర్యానాలోని ఫరీదాబాద్‌ మూడో కేవీ కోసం ఈ భవనాలను నిర్మించారు.

    భవనాల ప్రారంభోత్సవాలను ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి, కార్యక్రమంలో తనతో కలిసి పాల్గొనాలని ప్రజలను ఆహ్వానిస్తూ కేంద్ర మంత్రి ట్వీట్‌ చేశారు. పాఠశాలల సిబ్బంది, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. 

    దాదాపు 68.6 కోట్ల రూపాయల వ్యయంతో నాలుగు భవనాలను నిర్మించారు. ఈ కేవీలు ఇప్పటివరకు తాత్కాలిక భవనాల్లో కొనసాగాయి. కొత్త ప్రాంగణాల అందుబాటుతో దాదాపు 4 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందుతారు.

    హరిత భవన నిబంధనల ప్రకారం నాలుగు భవనాలను నిర్మించారు. వర్షపునీటి సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దివ్యాంగుల రాకపోకలకు అనువుగా నిర్మించారు. విద్యార్థుల శారీరక దారుఢ్యాన్ని ప్రోత్సహించేలా, ఆటలు, భౌతిక కార్యకలాపాల కోసం తగినంత స్థలాన్ని తీర్చిదిద్దారు.

    ప్రారంభోత్సవంలో భాగంగా, ఆహుతులను ఉద్దేశించి విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగిస్తారు.

***


(Release ID: 1662486)