జల శక్తి మంత్రిత్వ శాఖ

గాంధీ జయంతి సందర్భంగా జలజీవన్ మిషన్ కింద వందరోజుల కార్యక్రమం స్కూళ్లు, అంగన్ వాడీల్లో శుద్ధమైన నీరు పైపులద్వారా సరఫరా

Posted On: 01 OCT 2020 7:34PM by PIB Hyderabad

 

 దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు పైపుల ద్వారా శుద్ధమైన మంచినీటి సరఫరా జరిగేలా చూసేందుకు ‘వందరోజుల కార్యక్రమాన్ని’ 2020 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ప్రారంభిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇదివరకే ప్రకటించారు. జలజీవన్ మిషన్ (జె.జె.ఎం.) కార్యక్రమం అమలు కోసం గ్రామ పంచాయతీలు, పానీ సమితులకోసం ‘మార్గదర్శిక’ను విడుదల చేస్తూ,.. 2020 సెప్టెంబరు 29న ప్రధానమంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు.ప్రభుత్వ సంస్థలైన పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు పైపుల ద్వారా మంచినీటి సరఫరా ఏర్పాటు చేసే ఈ కార్యక్రమాన్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని ప్రధానమంత్రి అదే రోజున రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. చిన్నారులకు సురక్షితమైన నీరు అందేలా చూడటం చాలా ఆవశ్యకమని, ఎందుకంటే వారికి నీటి ద్వారా వ్యాధులు సంక్రమించేందుకు అవకాశాలు ఎక్కువని, అందువల్ల పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, తదితర సంస్థలకు జలజీవన్ మిషన్ కార్యక్రమం కింద సురక్షిత నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేశామని ప్రధానమంత్రి చెప్పారు. ప్రధానమంత్రి ప్రకటన మేరకు జాతీయ జలజీవన్ మిషన్ 2020 అక్టోబరు 2న వందరోజుల కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఇప్పటికే వివిధ రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను సంప్రదించాయి. ఈ మేరకు గాంధీ జయంతి రోజునేకాక, రానున్న రోజుల్లో కూడా గ్రామ సభలను నిర్వహించనున్నారు. రాబోయే వందరోజుల్లో గ్రామాల్లోని పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు ఇతర ప్రభుత్వసంస్థల్లో సురక్షితమైన నీటి సరఫరా కోసం ఈ గ్రామ సభల్లో తీర్మానాలు ఆమోదించనున్నారు. ఈ సదుపాయాలను గ్రామ పంచాయతీలు, పంచాయీతీల సబ్ కమిటీలు, (గ్రామ నీటి సరఫరా, పారిశుద్ధ్య కమిటీలు, లేదా పానీ సమితులు)
నిర్వహించవలసి ఉంటుంది.


   ‘కేంద్ర శాఖ’ హోదాలో వివిధ రాష్ట్రాల్లోని  ప్రజారోగ్య ఇంజినీరింగ్ శాఖ ఈ కార్యక్రమానికి సారథ్యం వహిస్తుంది. గ్రామపంచాయతీలు, లేదా గ్రామపంచాయతీల ఉప కమిటీలకు ఈ కార్యక్రమంలో ప్రమేయం కల్పిస్తారు.
విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖ తదితర శాఖలు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటాయి. చిన్నారుల ఆరోగ్యానికి, వారి బహుముఖ అభివృద్ధికి దోహదపడేలా వారికి సురక్షిత నీటిని అందించేందుకు ఈ కార్యక్రమం ద్వారా పెద్దఎత్తున కృషి చేయనున్నారు. మహాత్మాగాంధీ 151 జయంతి సందర్భంగా ఇది ‘జాతిపిత’కు అందించే
సరైన నివాళిగా పరిగణిస్తున్నారు.
 

గాంధీ జయంతి సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం పోరు బందరులో ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. రాష్ట్రంలోని గాంధీనగర్, మెహసానా, పోరు బందరు, ఆనంద్ జిల్లాల్లో వందశాతం ఇళ్లకు నీటి కుళాయిల కనెక్షన్లను వర్తింపజేసినట్టు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ కార్యక్రమంలో ప్రకటించబోతున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ న్యూఢిల్లీనుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో
పాలుపంచుకుంటారు. గుజరాత్ లోని పాఠశాలలకు, అంగన్ వాడీ కేంద్రాలకు పైపుల ద్వారా మంచినీటిని సరఫరా కోసం వందరోజుల కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా ప్రారంభిస్తారు.

 ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు గుజరాత్ లోని గ్రామీణ ప్రాంతాల్లో 79.85 శాతం ఇళ్లకు నీటి కుళాయిల కనెక్షన్లు ఉన్నాయి. 2020-21లో గుజరాత్ ప్రభుత్వం 7.70లక్షల ఇళ్లకు నీటి కుళాయిలను  ఏర్పాటుచేసింది. గత ఏడాదిగా దేశవ్యాప్తంగా 2కోట్ల 30లక్షల ఇళ్లకు ఇప్పటికే నీటి కుళాయిలు అమర్చారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, మొత్తం గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 30శాతం ఇళ్లకు, అంటే, 5కోట్ల 50లక్షల ఇళ్లకు కుళాయిల ద్వారా నీరు అందుతోంది.
 

 2024వ సంవత్సరానికల్లా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ మంచినీటి ట్యాప్ కనెక్షన్లు కల్పించాలన్న లక్ష్యంతో జలజీవన్ మిషన్ (జె.జె.ఎ.) కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం కింద, మహిళలపై, చిన్నారులపై
ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించారు.  నీటి ద్వారా సంక్రమించే డయేరియా, విరేచనాలు, కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు చిన్నపిల్లలకు సోకే అవకాశాలు ఎక్కువ కాబట్టి, వారికి సురక్షిత నీటిని అందించేందుకు ప్రాధాన్యం

 

ఇస్తున్నారు. సురక్షితంకాని నీటి కారణంగా పదేపదే వ్యాధులు సోకడం ఎదిగేపిల్లలకు మంచిది కాదు. భవిష్యత్తులో వారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లోరైడ్, ఇతర ఆమ్లాలు,  లోహాలతోకలుషితమైన నీటితో సమస్య మరింత సంక్లిష్టంగా ఉంటుంది. వారు ఫ్లోరోసిస్ వంటి వ్యాధులకు, మరింత తీవ్రమైన అస్వస్థతకు గురికావలసి ఉంటుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు తదితర సంస్థలకు కుళాయిల ద్వారా మంచినీటి సరఫరా ఏర్పాటుకు జలజీవన్ మిషన్ మిషన్ లో ఏర్పాటు చేశారు.
 

*****



(Release ID: 1660927) Visitor Counter : 142