ఆర్థిక మంత్రిత్వ శాఖ

పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా రుణాల పునర్వ్యవస్థీకరణ, గడువు పెంపునకు ప్రభుత్వం భారత రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ)తో కలసి పాటుపడుతోంది : ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్

మన వాణిజ్య సంప్రదింపులలో ఆదాన ప్రదానం చాలా కీలకమైన అంశం,   అత్యవసర పరపతి సౌకర్యం కింద  ఎంఎస్ఎంఇ లకు బ్యాంకులు రుణాలను నిరాకరించలేవు అని మంత్రి అన్నారు.  

Posted On: 31 JUL 2020 4:34PM by PIB Hyderabad

కోవిడ్ -19 ప్రభావం వల్ల ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పారిశ్రామిక రంగం అవసరాలను తీర్చడానికి వీలుగా రుణాల పునర్వ్యవస్థీకరణ, రుణాల కాలపరిమితి పెంపునకు  ప్రభుత్వం ఆర్ బి ఐతో కలసి పాటుపడుతోందని కేంద్ర ఆర్ధిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ శుక్రవారం తెలిపారు.   భారత వాణిజ్య మరియు పారిశ్రామిక మండలుల సమాఖ్య (ఫిక్కీ)   జాతీయ కార్యవర్గం సమావేశంలో మాట్లాడుతూ శ్రీమతి సీతారామన్  "ఇప్పుడు రుణాల పునర్వ్యవస్థీకరణపై దృష్టి కేంద్రీకృతమై ఉందని,  ఇందుకోసం  ఆర్ బి ఐతో  కలసి చురుకుగా పని చేస్తున్నాము   రుణాలను పునర్వ్యవస్థీకరించి గడువు పెంచాల్సిన అవసరం ఉందనే విషయంపై సదవగాహన ఉన్నది"  అని అన్నారు.  

ప్రభుత్వం ప్రకటించిన   సంస్కరణ చర్యలపై విస్తృతంగా జరిగిన సమాలోచనలను వివరిస్తూ  " ప్రభుత్వం ప్రకటిస్తున్న,  తీసుకుంటున్న ప్రతి చర్యపై  భాగస్వామ్య పక్షాలతో  మరియు ప్రభుత్వంలో  విస్తృత సమాలోచనలు జరిపిన తరువాత ప్రకటించడం జరుగుతోంది.  ఎందుకంటే తత్సంబంధమైన మార్పులు చేయకుండా ప్రకటించడం వల్ల ఏ చర్య విఫలం కాకుండా ఖాయం చేసుకోవడం జరుగుతోంది.  వాటి ప్రభావం ప్రత్యక్షంగా కనిపించేలా మేము ఈ చర్యలు చేపట్టాం"  అని శ్రీమతి సీతారామన్ తెలిపారు.  

ప్రభుత్వం ప్రకటించిన అత్యవసర పరపతి గ్యారంటీ  స్కీము కింద రుణాలు తీసుకోవడంలో  ఎంఎస్ఎంఇలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురించి ఫిక్కీ సభ్యులు వెలిబుచ్చిన ఆందోళనకు స్పందిస్తూ శ్రీమతి సీతారామన్  " అత్యవసర పరపతి గ్యారంటీ  స్కీము కింద  ఎంఎస్ఎంఇలకు రుణాలను  బ్యాంకులు నిరాకరించరాదు.   ఒకవేళ  నిరాకరించినట్లయితే అటువంటి దృష్టాంతాలను తన దృష్టికి తెచ్చినట్లయితే పరిశీలించగలనని"  అన్నారు.  

అభివృద్ధి అవసరాలకోసం ఆర్ధిక సంస్థను ఏర్పాటు చేయాలని  ఫిక్కీ చేసిన సూచనను గురించి ప్రస్తావిస్తూ ఆర్హిక మంత్రి " అభివృద్హి ఆర్హికసహాయ సంస్థకు సంబంధించిన పని జరుగుతోంది.   దాని రూపురేఖలు తదితర అంశాలను గురించి మనం త్వరలోనే తెలుసుకుంటాం"  అన్నారు.  

వాణిజ్య ఒప్పందాలలో ఆదాన ప్రదానం ఆవశ్యకతను ఉద్ఘాటిస్తూ శ్రీమతి సీతారామన్ " మన మార్కెట్లకు ప్రవేశం కల్పించిన దేశాలతో అదలుబదలు ఏర్పాట్లు కోరుతున్నాము.   మన వాణిజ్య సంప్రదింపులలో ఆదాన ప్రదానం చాలా కీలకమైన అంశం."  అని తెలిపారు.  

ఆరోగ్య సంరక్షణ మరియు ఇతర ఉత్పత్తులపై వస్తువుల సేవల పన్ను (జీఎస్టీ)  తగ్గింపుపై  జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోగలదని
ఆర్ధిక మంత్రి అన్నారు

రుణాలపై మారటోరియం పొడిగించాలని,  రుణాల పునర్వ్యవస్థీకరణ,  కాల పరిమితి పెంపునకు సంబంధించి ఆతిథ్య రంగం చేస్తున్న డిమాండ్ గురించి ప్రస్తావిస్తూ  శ్రీమతి సీతారామన్  ప్రభుత్వం ఇందుకోసం ఆర్ బి ఐతో కలసి పని చేస్తోందని అన్నారు.   "  మారటోరియం పొడిగింపు,  రుణాల పునర్వ్యవస్థీకరణ వంటి ఆతిధ్య రంగం అవసరాల గురించి  నాకు పూర్తి అవగాహన ఉంది.   ఇందుకోసం మేము ఆర్ బి ఐతో కలసి పని చేస్తున్నాం"  అని ఆమె వెల్లడించారు.  

పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం క్రియాశీలక పాత్ర నిర్వహించడాన్ని ఫిక్కీ అధ్యక్షులు డాక్టర్ సంగీతా రెడ్డి ప్రశంసించారు.  " ప్రభుత్వ చర్యల వల్ల ఆర్ధిక రంగం కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.  వ్యాపారంలో  ఈ మెరుగుదల నిలకడగా కొనసాగడానికి ప్రభుత్వం నుంచి నిరంతర తోడ్పాటు అవసరం.   ఈ తోడ్పాటు  ముఖ్యంగా మార్కెట్ డిమాండ్ పటిష్టం చేయడానికి మరియు డిమాండ్ వృద్ధిని ప్రోత్సహించడానికి అవసరం"  అని డాక్టర్ రెడ్డి తెలిపారు.  

ఫిక్కీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఉదయ్ శంకర్ వందన సమర్పణ చేశారు.   పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్ళను తీర్చడానికి సమాఖ్య ప్రభుత్వంతో కలసి పని చేస్తుందని ఆయన అన్నారు.  

 

***


(Release ID: 1642701)