కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో 73.58 లక్షల చందాదారుల కేవైసీ అప్డేట్ చేసిన ఈపీఎఫ్వో
Posted On:
27 JUL 2020 3:25PM by PIB Hyderabad
కొవిడ్-19 కారణంగా ఆన్లైన్ సేవల ఆవశ్యకత పెరిగింది. ఖాతాదారులకు మరింతగా అందుబాటులో ఉండేలా, అందరికీ ఆన్లైన్ సేవలు అందించేలా, లక్షల మంది కేవైసీ సమాచారాన్ని ఈపీఎఫ్వో అప్డేట్ చేసింది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో, మూడు నెలల్లో 73.58 లక్షల చందాదారుల కేవైసీ అప్డేట్ ఈపీఎఫ్వో చేసింది. ఇందులో, 52.12 లక్షల మంది ఆధార్ అనుసంధానం, 17.48 లక్షల మంది ఫోన్ నంబర్ల (యూఏఎన్ యాక్టివేషన్) అనుసంధానం, 17.87 లక్షల మంది బ్యాంక్ అకౌంట్ల అనుసంధానం ఉన్నాయి. ఖాతాదారుల వివరాలను యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) తో అనుసంధానించే సమయంలో వారి గుర్తింపును కేవైసీ సులభతరం చేస్తుంది.
లాక్డౌన్ సమయంలోనూ భారీ స్థాయిలో కేవైసీలు అప్డేట్ చేయడానికి, ఖాతాదారుల వివరాల్లోని లోపాలను సరిదిద్దేందుకు ఈపీఎఫ్వో భారీ కసరత్తు చేసింది. 9.73 లక్షల మంది పేర్లను, 4.18 లక్షల మంది పుట్టిన తేదీలను, 7.16 లక్షల మంది ఆధార్ నంబర్ల అనుసంధానంలో లోపాలను ఈ మూడు నెలల్లో సరిదిద్దింది.
కొవిడ్ సమయంలో కార్యాలయాల్లో సామాజిక దూరం పాటించడానికి, నిర్ణీత సమయంలో కేవైసీ అప్డేషన్ పూర్తి చేసేలా, ఇంటి నుంచే పని చేసే అవకాశాన్ని ఉద్యోగులకు కల్పించింది. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తూ, కేవైసీ అప్డేషన్లు, ఖాతాదారుల వివరాల్లో లోపాలను సరిచేశారు. పెండింగ్ పనులను పూర్తి చేశారు.
దీనికితోడు, ఉద్యోగులు తమ ఆధార్ నంబర్ల అనుసంధానం కోసం సంస్థ యజమానిపై ఆధారపడకుండా చేయడంలో సరళీకరణ; మూడేళ్ల వరకు ఉన్న తేడాలకు పుట్టిన తేదీ రుజువుగా ఆధార్ను అంగీకరించడం వంటి చర్యలు కేవైసీ ప్రక్రియను వేగవంతం చేశాయి.
మెంబర్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ సేవలను పొందేందుకు కేవైసీ అప్డేషన్ ప్రక్రియ ఖాతాదారులకు వీలు కల్పిస్తుంది. తను దాచుకున్న పూర్తి మొత్తాన్ని లేదా కొంతమొత్తాన్ని తీసుకోవడానికి లేదా, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ఇటీవల ప్రవేశపెట్టిన కొవిడ్-19 అడ్వాన్స్ను పొందడానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి దీనివల్ల వీలవుతుంది. ఉద్యోగులు సంస్థలు మారినప్పుడు వారి ఖాతాను ఆన్లైన్ ద్వారా కొత్త సంస్థ పరిధిలోకి బదిలీ చేయడంలో ఇబ్బందులు తలెత్తకుండా కేవైసీ చేస్తుంది. కేవైసీ సభ్యులు కంప్యూటర్ల ద్వారా లేదా ఉమాంగ్ యాప్ ద్వారా ఆన్లైన్ సేవలను పొందవచ్చు.
***
(Release ID: 1641618)
Visitor Counter : 218