వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ మరియు ఎగుమతుల‌కు అనుకూల వాహ‌క‌ వ్య‌వ‌స్థ‌ ఏర్పాటుకు ప్రభుత్వం సహాయం: శ్రీ పీయూష్ గోయల్‌

Posted On: 14 JUL 2020 6:41PM by PIB Hyderabad

టెలివిజన్ సెట్లు, క్లోజ్డ్ సర్క్యూట్ టీవీలు, ఎయిర్ కండీషనర్లు వంటి కొన్ని ఎంపిక చేసిన ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ను గుర్తించి వాటిని మన భారతదేశంలో పెద్ద మొత్తంలో త‌యారు చేసి.. భారీస్థాయిలో వాటిని విదేశాల‌కు ఎగుమ‌తి చేయించే విష‌యాన్ని త‌మ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ మరియు కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఈఎస్‌సీ) సభ్యులతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సంభాషించారు. భారత్‌లో పెద్ద మొత్తంలో త‌యారు చేసి.. భారీస్థాయిలో విదేశాల‌కు ఎగుమ‌తి చేసేందుకు వీలున్న ఉత్పత్తులకు సంబంధించి నిర్దిష్టమైన‌ సూచనలు ఇవ్వాలని ఆయ‌న ఈ సంద‌ర్భంగా కోరారు.
మ‌న ఉత్ప‌త్తులు పోటీగా మార్చడానికి అవసరమైన విధానప‌ర‌మైన జోక్యాల‌ను  గురించి కూడా సూచ‌న‌లు చేయాల‌ని మంత్రి ఈఎస్‌సీని కోరారు. అటువంటి ఉత్పత్తులను తయారు చేసి ఎగుమతి చేయడానికి కావాల్సిన అనుకూల వాహ‌క‌ వ్య‌వ‌స్థ‌ను రూపొందించ‌డానికి ప్రభుత్వం సహాయం చేస్తుంద‌ని ఆయ‌న అన్నారు.
కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు, త‌గిన ప‌రిశోధ‌న మ‌రియు అభివృద్ధి, దేశీయ కార్య‌క‌లాపాల విస్తరణ, ఎగుమతులు పెంచే మార్గాల్ని ఉపయోగించుకోవాల‌ని.. ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ రంగాన్ని మంత్రి కోరారు. దేశంలో ప‌రిశ్ర‌మ‌లు మరింత స్వావలంబనతో ప్రభుత్వపు సహకారం లేకుండా ఎదుగుతూ త‌మ‌దైన ముద్ర వేశాయని అన్నారు.
ఈ విషయ‌మై మంత్రి ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ రంగాల అద్భు‌త‌పు ప్ర‌స్థానాన్ని ఈ సంద‌ర్భంగా ఉదాహరించారు. ఈ సంస్థ‌లు పరిష్కార ప్రదాతలుగా మరియు ఎగుమతిదారుగా బలీయమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాయ‌ని అన్నారు.
పరిశ్రమ మరియు ప్రభుత్వం కలిసి రావాలి..
ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా స్కీమ్ (ఎంఈఐఎస్‌) వంటి వివిధ ప్రోత్సాహకాలపై ప్రత్యేకంగా ఆధారపడ కూడ‌ద‌ని మంత్రి అన్నారు. ఇలాంటివి కాల ‌ప‌రిమితితో కూడిన‌వ‌ని.. ఇవి ఉత్ప‌త్తుల పోటీతత్వాన్నిపెంచేందుకు దోహ‌దం చేయ‌లేవని మంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు. ఎగుమతుల‌ పోటీతత్వం స్వాభావిక బలాల నుండి రావాల్సి ఉంటుంద‌ని అన్నారు. నేషనల్ మిషన్ ఆన్ క్వాంట‌మ్‌ టెక్నాలజీస్ & అప్లికేషన్స్‌ను (ఎన్ఎమ్-క్యూటీఏ) అమలు చేయడానికి గాను పరిశ్రమ మరియు ప్రభుత్వం కలిసి రావాలసిన అవసరాన్ని మంత్రి నొక్కి చెప్పారు. కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్, సెన్సింగ్, కెమిస్ట్రీ, క్రిప్టోగ్రఫీ, ఇమేజింగ్ మరియు మెకానిక్స్‌లో చాలా క్లిష్టమైన సమస్యలకు ఇంజినీరింగ్ పరిష్కారాలు క‌నుగొనేందుకు గాను ఇది ఎంత‌గానో ఉపయోగించబడుతుంద‌న్నారు. దేశం నుండి సాఫ్ట్‌వేర్ మరియు సేవల ఎగుమతుల కోసం నాణ్యమైన, క‌చ్చితమైన డేటాను కలిగి ఉండవలసిన అవసరాన్ని శ్రీ గోయల్ నొక్కి చెప్పారు. ఇందుకు గాను త‌న‌ మంత్రిత్వ శాఖ ఈ సమస్యను ఆర్‌బీఐతో స‌మీక్షిస్తున్న‌ట్లుగా ఆయ‌న వివ‌రించారు.
భారతీయ ఉత్పత్తులు ప్ర‌పంచ స్థాయికి చేరాలి..
దేశ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ రంగానికి త‌మ నుంచి పూర్తి సహకారం ఉంటుంద‌ని, గత రెండు సంవత్సరాలుగా ఈ పరిశ్రమ స్వదేశీ ఉత్పత్తిని పెంచుకుంటూ.. ముందుకు సాగుతోంద‌ని అన్నారు. ప్ర‌ధాన మంత్రి ఇచ్చిన ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌కు త‌గ్గ‌ట్టుగా ఈ రంగం వృద్ధి చెంద‌గ‌ల‌ద‌‌ని భావిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ప్ర‌ధాన మంత్రి ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ విజ‌న్‌‌ను స‌మ‌ర్థ‌వంతంగా ముందుకు తీసుకుపోయేందుకు ప్రభుత్వం మరియు పరిశ్రమల మధ్య నమ్మకం ఎంతో అవ‌స‌ర‌మ‌ని మంత్రి ఈ సంద‌ర్భంగా నొక్కి చెప్పారు. అపరిమితంగాను.. అపారంగాను ఉన్న వ్యాపార సామర్థ్యాలను అందిపుచ్చుకోవ‌డానికి గాను ప్ర‌భుత్వ మ‌రియు ప‌రిశ్ర‌మ‌లు కలిసి రావాలని అన్నారు. "ఈ ప్రభుత్వం పరిశ్రమ వృద్ధికి అవ‌స‌ర‌మై అనుకూల‌పు వ్యవస్థను అందించే దిశగా పనిచేస్తుంది. పరిశ్రమలు వారి భవిష్యత్ ఎజెండాను కొత్త సామర్థ్యాలను సృష్టించుకోవ‌డం మాత్రమే కాక‌, భారతీయ ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకుపోవ‌డ‌మే ఆత్మనిర్భ‌ర్ భారత్ యొక్క సారాంశం" అని ఆయన అన్నారు. ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లలో భారతదేశం యొక్క ఎగుమతులను పెంచడానికి గాను ఈఎస్‌సీ తయారు చేసిన వ్యూహాత్మక విధానప‌త్రం‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ రెండు రంగాల నుండి భారతదేశం యొక్క ఎగుమతులను మ‌రింత‌గా పెంచేందుకు సంబంధించిన అనేక సూచనలు ఈ ప‌త్రంలో పొందుప‌ర‌చ‌బ‌డి ఉన్నాయి.

                               

******



(Release ID: 1638630) Visitor Counter : 131