గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కింద రికార్డు స్థాయిలో చిన్నపాటి అటవీ ఉత్పత్తుల (ఎంఎఫ్పీ) సేకరణ
ఎంఎఫ్పీలకు ఎంఎస్పీ ద్వారా, గిరిజనుల ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల; రెండు నెలల్లోనే రూ.2 వేల కోట్లకుపైగా సేకరణలు
Posted On:
21 JUN 2020 7:14PM by PIB Hyderabad
ఎంఎఫ్పీ పథకం కింద, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చిన్నపాటి అటవీ ఉత్పత్తుల (ఎంఎఫ్పీ) సేకరణ కొత్త పుంతలు తొక్కుతోంది. 16 రాష్ట్రాలలో రికార్డు స్థాయిలో రూ.79.42 కోట్ల విలువైన ఉత్పత్తులను సేకరించారు. దీంతో, ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో సేకరణల విలువ రెండు వేల కోట్ల రూపాయలు దాటింది. కరోనా వల్ల గిరిజనుల జీవనం అస్తవ్యస్తమైన ఈ పరిస్థితుల్లో ప్రస్తుత సేకరణలు వారికి భారీ ఉపశమనం కలిగిస్తున్నాయి.
మే 26న, ఎంఎస్పీ కిందకు వచ్చే ఎంఎఫ్పీ జాబితాలోకి మరో 23 కొత్త ఉత్పత్తులను చేర్చేందుకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సిఫారసు చేసింది. గిరిజనులు సేకరించే వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులు ఈ జాబితాలో ఉన్నాయి.
ఈ పథకం, గిరిజన ఆర్థిక వ్యవస్థలోకి రెండు వేల కోట్ల రూపాయలను చేర్చడం ద్వారా వారి జీవనగతిని మార్చి మరింత సాధికారత కల్పిస్తుంది. గిరిజన సంఘాలు, క్లస్టర్ల ద్వారా గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇవ్వడానికి, ఉత్పత్తులకు అదనపు విలువ, మార్కెటింగ్ కల్పించడానికి "మెకానిజం ఫర్ మార్కెటింగ్ ఆఫ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ (ఎంఎఫ్పీ) త్రూ మినిమన్ సపోర్ట్ ప్రైస్ (ఎంఎస్పీ) &డెవలెప్మెంట్ ఆఫ్ వాల్యూ చైన్ ఆఫ్ ఎంఎఫ్పీ" పథకం కోసం మార్గదర్శకాలు తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం, వన్ ధన్ పథకం మద్దతు, రాష్ట్రాల చురుకైన భాగస్వామ్యాలతో వీటిని అమలు చేశారు. ఇవి విస్తృతమైన ఆదరణ సంపాదించాయి.
రూ.52.80 కోట్ల విలువైన 20270 మెట్రిక్ టన్నుల చిన్నపాటి అటవీ ఉత్పత్తులను సేకరించడం ద్వారా ఛత్తీస్గఢ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. రూ.21.32 కోట్ల విలువైన 9908 మెట్రిక్ టన్నుల ఉత్పత్తుల సేకరణతో ఒడిశా 2వ స్థానంలో; రూ.1.61 కోట్ల విలువైన 155 మెట్రిక్ టన్నుల సేకరణతో గుజరాత్ 3వ స్థానంలో నిలిచాయి. ఎంఎఫ్పీలకు ఎంఎస్పీ పథకాన్ని ఛత్తీస్గఢ్ లోని అన్ని జిల్లాల్లో విస్తృతంగా అమలు చేసి, భారీగా సేకరణలు చేపట్టారు. ఈ రాష్ట్రంలో 866 సేకరణ కేంద్రాలున్నాయి. 39 వన్ ధన్ కేంద్రాల ద్వారా వన్ ధన్ స్వయం సహాయక బృందాలను ప్రభుత్వం రంగంలోకి దించింది. అటవీ, రెవెన్యూ, వీడీవీకే అధికారులతో కూడిన బృందాలు ఇళ్ల వద్దకే వెళ్లి అటవీ ఉత్పత్తుల సేకరణలు చేపట్టాయి. అందువల్లే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ స్థాయి సేకరణలు సాధ్యమయ్యాయి.


(Release ID: 1633254)