సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కొత్త ఆర్థిక సంస్కరణలు భారతదేశం యొక్క అంతరిక్ష మరియు అణు సామర్థ్యాలను పూర్తి స్థాయిలో గ్రహించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తాయి : డాక్టర్ జితేంద్ర సింగ్.

Posted On: 17 MAY 2020 7:16PM by PIB Hyderabad

కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ గురించి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ఇక్కడ మాట్లాడుతూ, ఇతర విషయాలతోపాటు, మెడికల్ ఐసోటోపులను ఉపయోగించి సరసమైన క్యాన్సర్ చికిత్సను ఈ ప్యాకేజీ ప్రోత్సహిస్తుందనీ, అటామిక్ ఎనర్జీ విభాగం (డి.ఏ.ఈ.) ఆధ్వర్యంలో పి.పి.పి. (పబ్లిక్-ప్రైవేట్-పార్టిసిపేషన్) పద్దతిలో ప్రత్యేకమైన రియాక్టర్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. 

ఈ ఆర్ధిక ప్యాకేజీ వినూత్నమైన, భవిష్యత్తుకు సంబంధించిన, ధైర్యంతో కూడుకున్నదిగా, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జితేంద్ర సింగ్ అభివర్ణించారు.  గత ఆరు దశాబ్దాలుగా, భారతదేశ అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం మరియు అణుశక్తి విభాగాలు  రహస్య కవచం వెనుక పనిచేసాయనీ, కొత్తగా లేదా బయట ప్రణాళికలను రూపొందించడం వాస్తవానికి నిషిద్ధంగా ఉండేదనీ, పరిమిత గోళంలోనే కార్యకలాపాలు కొనసాగేవనీ ఆయన పేర్కొన్నారు. 

 

"అయితే, మొదటిసారిగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో, అణు ఇంధన శాఖ విభిన్న ప్రాంతాలలో దాని అనువర్తనాలను గ్రహించడానికి అవకాశం లభించింది.  మన రోజువారీ జీవిత ప్రయోజనం కోసం ఉపయోగించడం జరుగుతోంది." - అని ఆయన అన్నారు.   భారతదేశంలో మెడికల్ ఐసోటోపుల ఉత్పత్తి,  క్యాన్సర్ మరియు ఇతర వ్యాధులకు సరసమైన చికిత్సకు వినియోగించడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా మానవజాతి సేవకు కూడా ఉపయోగపడుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.  అదేవిధంగా, రేడియేషన్ పరిజ్ఞానాన్ని ఆహార సంరక్షణ మరియు వస్తువులు ఎక్కువ కాలం పాడైపోకుండా ఉంచడానికి ఉపయోగించడం గురించీ,  ప్యాకేజీలోని ఇతర అణు శక్తి సంబంధిత సంస్కరణలు గురించీ ఆయన చెప్పారు.  ఈ పరిజ్ఞానం మన శాస్త్రవేత్తల దగ్గర అందుబాటులో ఉందనీ, అయితే, పి.పి.పి. విధానంలో రేడియేషన్ టెక్నాలజీని ప్రోత్సహించడం మొదటిసారి జరుగుతోందనీ ఆయన అన్నారు 

అంతరిక్ష రంగానికి సంబంధించినంత వరకు,  అంతరిక్షం / ఇస్రో పనిలో ప్రైవేట్ రంగానికి వసతి కల్పించడానికి సంస్కరణలను ఈ ఆర్థిక ప్యాకేజీ లో పొందుపరిచారని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.  తద్వారా ఉపగ్రహ ప్రయోగం మరియు సంబంధిత కార్యకలాపాలలో ప్రైవేట్ సంస్థలకు స్థానం కల్పించారని ఆయన అన్నారు. అదనంగా, సాంకేతిక వ్యవస్థాపకులకు రిమోట్ సెన్సింగ్ డేటాను అందించడానికి గ్లోబల్ జియోస్పేషియల్ పాలసీని అనుమతించడం కూడా ఒక ముఖ్యమైన నిర్ణయమని ఆయన వివరించారు. 

కొత్త ఆర్థిక సంస్కరణలు,  భారతదేశం యొక్క అంతరిక్ష మరియు అణు సామర్థ్యాలను పూర్తి స్థాయిలో గ్రహించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని కలిగిస్తాయని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. 

 

<><><><><> 


(Release ID: 1624799)