వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ఈ-నామ్‌ వేదికలో కొత్త అంశాలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీకారం

ఈ కొత్త అంశాలు కోవిడ్‌-19పై మన పోరులో కీలక చర్యలు: శ్రీ తోమర్‌

Posted On: 02 APR 2020 7:36PM by PIB Hyderabad

జాతీయ వ్యవసాయ విపణి (ఈ-నామ్‌) వేదికలో సాఫ్ట్‌వేర్‌పరంగా జోడించిన కొత్త అంశాలను కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ-గ్రామీణాభివృద్ధి-పంచాయతీరాజ్‌ శాఖల మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఇవాళ ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం కోసం వారు నేరుగా టోకు మండీలకు రావాల్సిన అవసరం లేకుండా వ్యవసాయ విపణి వేదిక బలోపేతం కోసం ఈ కొత్త అంశాలను ప్రభుత్వం జోడించింది. కోవిడ్‌-19పై పోరాటం సాగుతున్న వేళ వ్యవసాయ మార్కెట్లలో రద్దీ తొలగింపు లక్ష్యంగా జోడించిన అంశాలు ఇలా ఉన్నాయి: 1) గిడ్డంగి ఆధారిత విక్రయ విభాగం 2) ఎఫ్‌పీఓ విక్రయ విభాగం. దీంతోపాటు మండీల మధ్య, రాష్ట్రాల మధ్య విక్రయాల వెసులుబాటు కోసం రవాణా విభాగం స్థాయి పెంచబడింది.

   ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ మాట్లాడుతూ- ఈ-నామ్‌ పోర్టల్‌లో ఇప్పటికే 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 585 మండీలను సమీకృతం చేసినట్లు తెలిపారు. త్వరలో అదనంగా 415 మండీలను చేర్చి మొత్తం 1,000కి పెంచనున్నట్లు వివరించారు. పరోక్ష బేరసారాలు, మొబైల్‌ ఆధారిత చెల్లింపులద్వారా కోవిడ్‌-19పై పోరాటంలో భాగంగా సామాజిక దూరం పాటించే వీలుంటుందన్నారు. ప్రస్తుతం జోడించిన అంశాలు ఈ పోరుకు మరింత బలాన్నిస్తాయని చెప్పారు.

  1. ఈ-నామ్‌ సాఫ్ట్‌వేర్‌లో ‘బదలాయించదగిన గిడ్డంగి రసీదు’ (e-NWR)ల విభాగం

  1. గిడ్డంగుల అభివృద్ధి-నియంత్రణ ప్రాధికార సంస్థ- WDRAలో నమోదైన గిడ్డంగుల కోసం చెల్లింపుల సదుపాయంతో గిడ్డంగి వాణిజ్య ప్రక్రియ ప్రారంభం.

  2. డబ్ల్యూడీఆర్‌ఏ నమోదిత గిడ్డంగులకు రైతులు ఉత్పత్తులను తరలించే సౌలభ్యం

  3. ఆంధ్రప్రదేశ్‌ (23), తెలంగాణలో (14) గిడ్డంగులకు ఇప్పటికే గుర్తింపు జారీ

  1. ఎఫ్‌పీఓ విక్రయ విభాగం

  1. రైతు వ్యవసాయోత్పత్తుల సేకరణ సంస్థలు తామున్న చోటనుంచే వాటి చిత్రాలు, ఇతర వివరాల అప్‌లోడ్‌సహా బిడ్డింగ్‌ చేసే వెసులుబాటుతో విక్రయ విభాగం ప్రారంభం.

  2. తమ ఉత్పత్తుల నాణ్యత నివేదిక/ఫొటోను ఎఫ్‌పీఓలు అప్‌లోడ్‌ చేసే వెసులుబాటు; దీంతో బిడ్డింగ్‌కు ముందు వ్యాపారులు పరిశీలించుకునే వీలు.

  1. రవాణా సదుపాయ విభాగం ప్రారంభం

  1. ప్రస్తుతం వ్యక్తిగత వ్యాపారులకు వ్యక్తిగత రవాణాదారులు ఈ-నామ్‌ద్వారా సేవలందిస్తున్నారు. ఈ విధానం స్థానంలో ఇప్పుడు పెద్ద రవాణా సంస్థలతో సంధానానికి వీలు కల్పించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దీంతో ఇక 3,75,000 ట్రక్కులు అందుబాటులోకి వస్తాయి.

   ఈ కొత్త సదుపాయాలతో రైతులు మండీలకు రాకుండానే తమ ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు విక్రయించుకునే వీలు కలుగుతుందని శ్రీ తోమర్‌ చెప్పారు. అలాగే భారీ/టోకు కొనుగోలుదారులతోపాటు ఆహార తయారీ సంస్థల ప్రతినిధులు మండీలకు వెళ్లే అవసరం లేకుండా నేరుగు కొనుగోలు చేసే వీలు కల్పించాలని రాష్ట్రాలకు సూచించినట్లు తెలిపారు.

 

*******



(Release ID: 1610517) Visitor Counter : 173