ప్రధాన మంత్రి కార్యాలయం

‘ప్రగతి’ ద్వారా ప్రధానమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష

ఆకాంక్షభరిత జిల్లాల లో యువ అధికారుల ను నియమించాలి; నిర్దిష్ట కాలంలో ఆ జిల్లాలను జాతీయ సగటు స్థాయికి చేర్చేలా గడువు విధించాలి: ప్రధాన మంత్రి

వ్యవసాయోత్పత్తుల కు రవాణా మద్దతు కోసం రవాణా, వ్యవసాయ మంత్రిత్వ శాఖ లు సంయుక్తం గా ‘ఇ-నమూనా’ను రూపొందించాలి: ప్రధాన మంత్రి

Posted On: 06 NOV 2019 7:11PM by PIB Hyderabad

పొలాల్లో దుబ్బు దహనం సమస్య పరిష్కారం దిశ గా పంజాబ్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ ల రైతుల కు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రాధాన్యం ప్రాతిపదిక న పరికరాల ను పంపిణీ చేయాలి: ప్రధాన మంత్రి


‘దార్శనిక పాలన-సకాలం లో అమలు’ కోసం సమాచార- భావ ప్రసార సాంకేతిక పరిజ్ఞానం ఆధారం గా రూపొందించిన బహముఖ వేదిక ‘ప్రగతి’ 31వ కార్యక్రమాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అధ్యక్షత వహించారు.  ఇంతకు ముందు నిర్వహించిన ‘ప్రగతి’ కార్యక్రమాల సందర్భం గా 12.15 లక్షల కోట్ల రూపాయల విలువైన 265 పథకాల తో పాటు 17 రంగాల కు సంబంధించి (22 అంశాల లో) 47 కార్యక్రమాలు/పథకాలు/ఫిర్యాదుల ను సమీక్షించడం జరిగింది.  ఈ నేపథ్యం లో నేడు నిర్వహించిన ‘ప్రగతి’ సమావేశం లో 16 రాష్ట్రాల లోను,  కేంద్రపాలిత ప్రాంతం జమ్ము- కశ్మీర్ లోను 61,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన 9 పథకాల ను సమీక్షించారు.  అలాగే విదేశాల లో పని చేసే భారత పౌరుల కు సంబంధించిన సమస్య లు సహా జాతీయ వ్యవసాయ విపణి, ఆకాంక్ష భరిత జిల్లా ల కార్యక్రమం తదితరాల పైన సైతం చర్చించారు.

ఆకాంక్షలను నెరవేర్చడం

ఆకాంక్ష భరిత జిల్లాల పై సమీక్ష సందర్భం గా 49 పనితీరు సూచీ లు ప్రాతిపదిక గా గల డాశ్ బోర్డు ను గురించి ప్రధాన మంత్రి కి నివేదించారు.  పౌష్టికాహార స్థాయి వంటి మందగమన సూచీ లలో అద్భుత వేగం నమోదు కావడం ఈ సందర్భం గా స్పష్టమైంది.  ఉత్తర్ ప్రదేశ్ లో కొన్ని జిల్లాల లో గణనీయ వృద్ధి నమోదు అయినట్లు గుర్తించారు.  ఈ సందర్భం గా ఆదివాసీ  బాలల విద్య కు, ఆరోగ్య సంరక్ష కు ప్రాధాన్యాన్ని ఇవ్వవలసిన అవసరాన్ని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, ఈ కార్యాచరణ ఒక జాతీయ సేవ అంటూ  అభివర్ణించారు.  వెనుకబడిన జిల్లాల ను జాతీయ సగటు స్థాయి కి చేర్చడం కోసం గడువు ను నిర్దేశించవలసిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.  అంతేకాకుండా ఆకాంక్ష భరిత జిల్లాల లో తప్పనిసరి గా యువ అధికారుల ను నియమించవలసివుందని పేర్కొన్నారు.

వ్యవసాయం – అనుబంధ కార్యకలాపాలు

రైతు కు గిట్టుబాటు ధర కల్పించడం లో విశేషం గా తోడ్పడుతున్న ‘జాతీయ వ్యవసాయ విపణి’ (ఎన్ఎఎమ్) వేదిక ప్రగతి ని గురించి సంబంధిత శాఖ ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు వచ్చింది.  అలాగే ఇలెక్ట్రానిక్ చెల్లింపు లు కూడా రైతుల బ్యాంకు ఖాతాల లో నేరు గా జమ అవుతున్నట్లు వివరించింది.  జమ్ము- కశ్మీర్ లో రెండు ఏకీకృత ఇలెక్ట్రానిక్ మండీ ల రూపకల్పన లో పురోగతి పైనా ప్రధాన మంత్రి సమీక్షించారు.  సమీకృత గిరాకీ సంబంధిత ఇలెక్ట్రానిక్ నమూనా ల ప్రాతిపదిక న రవాణా మద్దతు కోసం ఒక స్టార్ట్- అప్ ఏర్పాటు పై సంయుక్తం గా కృషి చేయాలని రోడ్డు రవాణా- జాతీయ రహదారుల శాఖ, వ్యవసాయం- రైతు సంక్షేమ శాఖల ను ప్రధాన మంత్రి ఆదేశించారు.  ప్రత్యేకించి వ్యవసాయ ఉత్పత్తుల ను ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రాని కి రవాణా చేయడానికి ఇటువంటి ఏర్పాటు అవసరం అని పేర్కొన్నారు.  సదరు సంస్థ కార్యకలాపాలు సజావు గా సాగే విధం గా అన్ని రాష్ట్రాలు ఒక ఉమ్మడి, ఏకీకృత వేదిక వినియోగం కోసం ముందుకు రావాలని ఆయన సూచించారు.  అలాగే గడ్డి దుబ్బుల కాల్చివేత సమస్య పై ప్రధాన మంత్రి స్పందిస్తూ- అటువంటి సంఘటన ల నివారణ దిశ గా ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా ల  రైతుల కు ప్రాధాన్యం ప్రాతిపదిక న పరికరాలను పంపిణీ చేయాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖ ను ఆదేశించారు.

మౌలిక సదుపాయాలతో కూడిన సంధానాన్ని అభివృద్ధిపరచడం

దేశం లో కొనసాగుతున్న పలు అనుసంధాన మౌలిక వసతుల పథకాల తాలూకు పురోగతి ని ప్రధాన మంత్రి సమీక్షించారు.  ఈ సందర్భం గా ‘కట్ రా-బనిహాల్’ రైలు మార్గం పై ప్రత్యేకం గా దృష్టి సారించడం తో పాటు వచ్చే సంవత్సరానికల్లా దీని ని పూర్తి చేసే దిశ గా పనుల ను వేగిరపరచడం పై విస్పష్ట సూచనలు ఇచ్చారు.  అలాగే ఐజావల్- తుయిపాంగ్ జాతీయ రహదారి వెడల్పు-ఉన్నతీకరణ సహా ఈశాన్య భారతం లో కొనసాగుతున్న అనేక పథకాల పైనా చర్చించారు.  ఢిల్లీ-మేరఠ్ ల మధ్య సువేగ- సురక్షిత సంధానం లో భాగంగా ‘ఢిల్లీ-మేరఠ్ ఎక్స్ ప్రెస్ వే పనుల ను సవరించిన గడువు 2020 మే నెల లోగా పూర్తి చేయాలని ప్రధాన మంత్రి చెప్పారు.  సుదీర్ఘ కాలం నుండి ఆలస్యం అవుతున్న ప్రాజెక్టుల ను సంబంధిత రాష్ట్రాలు వేగవంతం చేయాలని ప్రధాన మంత్రి కోరారు.  అటువంటి ప్రాజెక్టు ల ప్రగతి పై ఎప్పటికప్పుడు తమ కార్యాలయాని కి నివేదిక లు పంపవలసింది గా ఆయన ఆదేశించారు.

ఇంధన అవసరాలు తీర్చడం

పునరుత్పాదక విద్యుత్తు కు సంబంధించి- ఈ రంగం లో సుసంపన్నమైన 8 రాష్ట్రాలు... తమిళ నాడు, రాజస్థాన్, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ మధ్య ‘అంతర్ రాష్ట్ర విద్యుత్తు సరఫరా వ్యవస్థ’ రూపకల్పన పై చర్చల కు ప్రధాన మంత్రి అధ్యక్షత వహించారు.  సౌర, పవన విద్యుదుత్పాదన కు కొత్త ప్రాజెక్టుల ను ప్రారంభించడం లో భూ సేకరణ ప్రక్రియ సహా సంబంధిత కంపెనీ లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల ను గురించి ఆయన అడిగి తెలుసుకొన్నారు.  వేమగిరి కి ఆవల విద్యుత్తు ప్రసార వ్యవస్థ ను బలోపేతం చేసే ప్రాజెక్టు ను సకాలం లో పూర్తి చేయడం లో పురోగతి కి గాను ఆంధ్ర ప్రదేశ్ మరియు కర్నాటక  ప్రభుత్వాల ను ప్రధాన మంత్రి అభినందించారు.


**
 



(Release ID: 1590938) Visitor Counter : 172