Social Welfare
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్
భారతదేశ అసాధారణ బాలలకు గౌరవం
Posted On:
23 JUN 2026 12:44PM
కీలకాంశాలు
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అనేది 5 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల యువ పౌరుల అసాధారణ పట్టుదల, ధైర్యం, సృజనాత్మకత, అజేయమైన స్ఫూర్తిని కొనియాడే భారతదేశ అత్యున్నత జాతీయ పురస్కారం. న్యూఢిల్లీలో జరిగే ప్రత్యేక వేడుకలో భారత గౌరవ రాష్ట్రపతి ప్రతి ఏటా ఈ అవార్డును అందజేస్తారు. శౌర్యం, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు-సంస్కృతి, శాస్త్ర-సాంకేతికత అనే ఆరు విభిన్న రంగాలలో సాధించిన అత్యుత్తమ విజయాలకు గాను ఈ గుర్తింపు లభిస్తుంది. గురు గోవింద్ సింగ్ చిన్న కుమారుల చారిత్రక త్యాగాన్ని, నైతిక బలాన్ని గౌరవించే 'వీర్ బాల్ దివస్' (డిసెంబర్ 26) నాడు ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రధానోత్సవాన్ని నిర్వహించడం ద్వారా భారత ప్రభుత్వం నేటి యువత ప్రతిభను కాలాతీతమైన చారిత్రక వారసత్వంతో ముడిపెడుతోంది.
భారత అసాధారణ బాలలు
భారతదేశం వీరుల భూమి. ఇక్కడి యువత ప్రదర్శించిన తరతరాల ధైర్యం, మేధో సంపత్తి, త్యాగాలతో ఈ నేల గుర్తింపు పొందింది. చిన్న వయస్సులోనే వేదాలను ఔపోసన పట్టిన ఆదిశంకరుల నుంచి పురాణ పురుషుల వంటి చిన్నారి స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ వరకు బాల్యంలోనే అసాధారణ పట్టుదలను ప్రదర్శించే స్ఫూర్తి దేశ చరిత్రలో లోతుగా పెనవేసుకుపోయింది.
ఈ కాలాతీత స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రభుత్వం 5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల అసాధారణ పిల్లలను ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారంతో గౌరవిస్తోంది. వివిధ రంగాలలో అసాధారణ విజయాలు సాధించిన పిల్లలను గుర్తించి, గౌరవించడమే ఈ అవార్డు ముఖ్య ఉద్దేశం. జాతీయ స్థాయిలో వారి సహకారాన్ని అభినందించడం ద్వారా యువ ప్రతిభను ప్రోత్సహించడానికి, ఉత్తమ ఫలితాల సాధన దిశగా ఇతరులను ప్రేరేపించడానికి ఈ పురస్కారం ఉపయోగపడుతుంది.
గౌరవ భారత రాష్ట్రపతి డిసెంబర్ 26న జరుపుకునే వీర్ బాల్ దివస్ నాడు ఈ అవార్డును అందజేస్తారు. ఒక పతకం, సర్టిఫికేట్, ప్రశంసా పత్రంతో కూడిన ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారం మార్పును తీసుకువచ్చే భారతదేశ యువ రథసారధుల పట్టుదలకు, ధైర్యానికి, సృజనాత్మకతకు, అజేయమైన స్ఫూర్తికి లభించే నివాళి.
2019లో ఈ పురస్కారం ప్రారంభమైనప్పటి నుంచి 203 మంది పిల్లలు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ చొరవ ద్వారా ప్రభుత్వం పిల్లలను కేవలం చదువులోనే కాకుండా వ్యక్తిగత ప్రవర్తన సహా ఇతర రంగాలలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచేలా ప్రోత్సహిస్తోంది.
వీర్ బాల్ దివస్ నాడు అవార్డుల ప్రధానం
ప్రభుత్వం ప్రతి సంవత్సరం డిసెంబర్ 26ను వీర్ బాల్ దివస్గా నిర్వహిస్తోంది. పదో సిక్కు గురువు, గురు గోవింద్ సింగ్ కుమారులు సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్లను ఈ రోజు స్మరించుకుంటుంది.
జోరావర్ సింగ్, ఫతే సింగ్ వయస్సు వరుసగా 9, 7 సంవత్సరాలు ఉన్నప్పుడు డిసెంబర్ 26, 1704న బలవంతం చేసినప్పటికీ తమ మతాన్ని వదులుకోవడానికి నిరాకరించినందుకు వారు అమరులయ్యారు. వారి అమరత్వం చిన్న వయస్సులోనే ధైర్యం, నైతిక బలం, భక్తికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లో వారు ప్రదర్శించిన త్యాగం, శౌర్యం అసాధారణమైనవి. అవి నేటికీ పిల్లలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.
వీర్ బాల్ దివస్ నాడు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాన్ని అందజేయడం అనేది చరిత్రలోనూ, నేటి కాలంలోనూ భారతదేశ యువత ప్రతిభను, సృజనాత్మకతను, విజయాలను ఘనంగా చాటుతుంది.
అవార్డు వివరాలు
అసాధారణ శౌర్య సాహసాలు, ఆరు రంగాలలో కనబరిచిన ప్రతిభకు గాను పిల్లలకు దాదాపు 25 అవార్డులను అందజేస్తారు:
- శౌర్యం: తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ స్వార్థం లేకుండా చేసిన సేవను గుర్తించడానికి; లేదా ప్రకృతి వైపరీత్యాలు లేదా మానవ నిర్మిత ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా అత్యుత్తమ ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు; లేదా తనకు, సమాజానికి తీవ్రమైన ప్రమాదం పొంచి ఉన్నప్పుడు మానసిక బలం, సమయస్ఫూర్తిని ప్రదర్శించిన పిల్లలకు ఈ అవార్డు ఇస్తారు.
- సామాజిక సేవ: మహిళలు, పిల్లలు, ఇతరుల హక్కుల సాధన దిశగా సమాజాన్ని ప్రేరేపించడంలో, నిర్వహించడంలో, సమీకరించడంలో నాయకత్వ నైపుణ్యాలు చూపినందుకు.
- పర్యావరణం: వివిధ స్థాయిలలో పర్యావరణ సమస్యలపై నిరంతర కృషి/విజయాలు సాధించినందుకు.
- క్రీడలు: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో క్రీడల్లో సాధించిన నిరంతర విజయాలను ప్రోత్సహించడానికి.
- కళలు - సంస్కృతి: సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించడానికి నిరంతర కృషి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో కళలు, సంగీతం(గానం & వాయిద్యం), నృత్యం, పెయింటింగ్ లేదా మరేదైనా కళ/సంస్కృతి రూపంలో సాధించిన విజయాలకు.
- శాస్త్ర - సాంకేతికత: సమాజంపై సానుకూల ప్రభావం చూపిన, జీవన నాణ్యతను మెరుగుపరిచిన లేదా నిజ జీవిత సవాళ్లను పరిష్కరించడానికి దోహదపడిన కొత్త ఆవిష్కరణలు/పరిశోధనలు చేసినందుకు.

బాట చూపిన బాలలు —పీఎంఆర్బీపీ గత పురస్కార గ్రహీతలు
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారం తమ వయస్సుకు మించిన ధైర్యం, సృజనాత్మకత, కరుణను ప్రదర్శించిన పిల్లలను గౌరవించింది. ఇటీవల అవార్డు పొందిన వారిలో కొందరు:
- అర్ణవ్ అనుప్రియ మహర్షి (శాస్త్ర & సాంకేతికత, 2025) – మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన 17 ఏళ్ల శారీరక వికలాంగుడు. ఇతడు చేతి పక్షవాతం ఉపశమనం కోసం ఏఐ ఆధారిత పునరావాస సాధనాన్ని అభివృద్ధి చేశాడు.
- కరీనా థాపా (శౌర్యం, డిసెంబర్ 2024) – మహారాష్ట్రలోని అమరావతికి చెందిన 17 ఏళ్ల బాలిక. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో మంటలు చెలరేగిన ప్రాంతం నుంచి గ్యాస్ సిలిండర్ను తొలగించి 36 మంది ప్రాణాలను కాపాడింది. మున్సిపల్ కార్పొరేషన్ ఈమెను ఫైర్ బ్రాండ్ అంబాసిడర్గా గుర్తించింది.
- ఆదిత్య విజయ్ బ్రాహ్మణే (శౌర్యం, 2024) — మహారాష్ట్రలోని నందుర్బార్కు చెందిన 12 ఏళ్ల బాలుడు. ఈత సరిగ్గా రాకపోయినప్పటికీ నీటిలో మునిగిపోతున్న తన బంధువులను రక్షించడానికి నదిలోకి దూకాడు. ఈ రెస్క్యూలో తన ప్రాణాలను త్యాగం చేశాడు. మరణానంతరం ఇతనికి ఈ గౌరవం లభించింది.
- అనుష్క పాఠక్ (కళలు & సంస్కృతి, 2024) — నాలుగేళ్ల వయసులోనే కథా వాచకం ప్రారంభించి, 22కి పైగా రాష్ట్రాలు, నగరాలలో శ్రీమద్ భాగవద్గీత కథ, రామచరితమానస్ పారాయణాలు చేసింది.
- అర్మాన్ ఉభ్రాణి (కళలు & సంస్కృతి, 2024) — ఛత్తీస్గఢ్కు చెందిన ఆరేళ్ల "గూగుల్ మ్యాథ్ బాయ్". ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో 100 గుణకార లెక్కలను పరిష్కరించిన అతి పిన్న వయస్కుడు, మూడు పుస్తకాల సిరీస్ రాసిన అతి పిన్న వయస్కుడైన రచయిత.
- హేత్వి కాంతిభాయ్ ఖింసూరియా (కళలు & సంస్కృతి, 2024) — తీవ్రమైన సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న వడోదరకు చెందిన ఈ కళాకారిణి 250 ఫ్రీ-హ్యాండ్ పెయింటింగ్లను రూపొందించింది. తన వికలాంగ పెన్షన్ను ప్రత్యేక పిల్లల సంరక్షణ సంస్థకు విరాళంగా ఇస్తుంది.
- చార్వి ఎ (క్రీడలు, 2024) — బాలికల అండర్-8, అండర్-10 చెస్లో భారతదేశ నంబర్ 1 క్రీడాకారిణి; 2022లో అండర్-8 ప్రపంచ, కామన్వెల్త్ చెస్ ఛాంపియన్.
- ఆర్ సూర్య ప్రసాద్ (క్రీడలు, 2024) — ఐదేళ్ల వయసులోనే పర్వతారోహణ శిక్షణ ప్రారంభించి, ఏప్రిల్ 2022లో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. అవార్డు అందుకునే సమయానికి ఇతని వయసు తొమ్మిదేళ్లు.
- ఆదిత్య ప్రతాప్ సింగ్ చౌహాన్ (ఆవిష్కరణ, 2023) — తాగునీటి నుంచి మైక్రోప్లాస్టిక్లను గుర్తించి, వడకట్టడానికి తక్కువ ఖర్చుతో కూడిన "మైక్రోప" సాంకేతికతను అభివృద్ధి చేశాడు.
- అనుష్క జాలీ (సామాజిక సేవ, 2023) — "యాంటీ బుల్లీయింగ్ స్క్వాడ్ కవచ్" యాప్ను రూపొందించింది. ఇది నాలుగేళ్లుగా విద్యార్థులకు మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్ను అందిస్తోంది.
- అవనీష్ తివారీ (సామాజిక సేవ, 2024) — డౌన్ సిండ్రోమ్తో బాధపడుతున్న తొమ్మిదేళ్ల బాలుడు. ఏడేళ్ల వయసులోనే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను అధిరోహించాడు. టెడెక్స్ టాక్స్లో పాల్గొని, అందరినీ కలుపుకుపోయే తత్వంపై జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపాడు.
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026
అర్హత & నామినేషన్ వివరాలు
ఈ అవార్డుకు నామినేట్ అయ్యే పిల్లలు తప్పనిసరిగా:
- భారతీయ పౌరులై ఉండాలి. భారతదేశంలో నివసిస్తూ ఉండాలి.
- 5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. (31 జూలై 2026 నాటికి)
- గతంలో ఏ విభాగంలోనూ ఈ అవార్డును పొంది ఉండకూడదు.
ఆయా అసాధారణ చర్య, సంఘటన లేదా విజయం 31 జూలై 2026 నామినేషన్ గడువుకు ముందు రెండు సంవత్సరాల లోపు జరిగి ఉండాలి.
ఈ అవార్డు సాధారణంగా మరణానంతరం ఇవ్వరు. కానీ కొన్ని మినహాయింపులు ఉండవచ్చు.
ఒక బిడ్డను ఒకటి కంటే ఎక్కువ విభాగాలకు నామినేట్ చేయవచ్చు. అయితే ఒక దరఖాస్తును మాత్రమే ఆమోదించే విచక్షణ కమిటీకి ఉంటుంది.
ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా ఒకరిని నామినేట్ చేయవచ్చు. పిల్లలు స్వంతంగా కూడా నామినేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల నుంచి కూడా సిఫార్సులు ఆహ్వానించడమైనది. వీటిలో చేరినవి:
- కేంద్ర మంత్రులు
- ముఖ్యమంత్రులు
- గవర్నర్లు
- లెఫ్టినెంట్ గవర్నర్లు
- కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు (అడ్మినిస్ట్రేటర్లు)
- పార్లమెంటు సభ్యులు
- కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు
- రాష్ట్ర ప్రభుత్వాలు
- కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు
- జిల్లా మేజిస్ట్రేట్లు, కలెక్టర్లు
- మహిళా శిశు అభివృద్ధి లేదా సాంఘిక సంక్షేమ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు
- కేంద్రీయ విద్యాలయ సంఘటన్ లేదా నవోదయ విద్యాలయ సమితి పరిధిలోని విద్యా సంస్థలు, పాఠశాలలు.
దరఖాస్తుదారులు తమ వ్యక్తిగత వివరాలను, అవార్డు విభాగాన్ని పూర్తి చేసి, ఇటీవలి ఫోటోను, సహాయక పత్రాలను అప్లోడ్ చేయాలి. వారు సాధించిన విజయం, దాని ఫలితానికి సంబంధించిన సంక్షిప్త వివరణను గరిష్టంగా 1,000 పదాలలో సమర్పించాలి.
అన్ని నామినేషన్ ఎంట్రీలను గడువు లోపు https://awards.gov.in వెబ్సైట్లో సమర్పించాల్సి ఉంటుంది.
అవార్డుల కమిటీ
కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అవార్డుల కమిటీని ఏర్పాటు చేసి, అవార్డులకు తుది ఆమోదం తెలుపుతారు. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షత వహించే ఈ కమిటీలో అవార్డు విభాగాలకు చెందిన నిపుణులు ఉంటారు. ఇది నామినేషన్లను సమీక్షించి, అవార్డు గ్రహీతలను సిఫార్సు చేస్తుంది.
అయ్యే ఖర్చులు
మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అవార్డు గ్రహీతలకు, గరిష్టంగా ఇద్దరు తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు రానుపోను ఎకానమీ క్లాస్ ప్రయాణ ఖర్చులు, స్థానిక రవాణా, భోజన, వసతి సౌకర్యాలను కల్పిస్తుంది. అవార్డు గ్రహీత నివాసం లేదా చదువుకునే సంస్థ నుంచి న్యూఢిల్లీ వరకు ప్రయాణ ఖర్చులు భరిస్తుంది. అయితే ఇది ఎకానమీ క్లాస్ టికెట్ ధర లేదా అసలు ఖర్చు, వీటిలో ఏది తక్కువైతే అంతవరకు మాత్రమే పరిమితం అవుతుంది. శారీరక శ్రమను తగ్గించడానికి దివ్యాంగులైన పురస్కారగ్రహీతలకు బిజినెస్ క్లాస్ టిక్కెట్లు అందించవచ్చు.
అవార్డులను వ్యక్తిగతంగానే అందుకోవాలి. ఒకవేళ అవార్డు గ్రహీత హాజరు కాలేకపోతే లేదా మరణానంతరం ఇచ్చే సందర్భాల్లో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారి తరపున దీనిని అందుకోవచ్చు.
దేశ భవిష్యత్తును కొనియాడడం
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్(పీఎంఆర్బీపీ) అనేది కేవలం ఒక పతకం, ప్రశంసా పత్రం మాత్రమే కాదు. యువ పౌరుల ధైర్యం, సృజనాత్మకత, కరుణ దేశానికి ఎంతో ముఖ్యమని చెప్పే మార్గమిది. ఈ అవార్డు మన పిల్లల సంకల్పాన్ని, సామర్థ్యాన్ని, ఉత్సాహాన్ని, ఉత్సాహాన్ని వేడుకగా జరుపుకుంటుంది.
వీర్ బాల్ దివస్ నాడు వారిని గౌరవించడం ద్వారా ప్రభుత్వం నేటి విజేతలను ఒక కాలాతీత వారసత్వంతో అనుసంధానిస్తోంది. సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్ త్యాగం వారి వయస్సుకు మించిన పట్టుదలను ప్రతిబింబించింది.
ఈ దాగి ఉన్న రత్నాలను గుర్తించడానికి ఈ దృక్పథం మీ అందరి కళ్లు, చెవులపై ఆధారపడి ఉంటుంది. అకస్మాత్తుగా ప్రదర్శించిన వీరత్వం కావచ్చు లేదా సైన్స్, కళలు, సామాజిక మార్పుల పట్ల సంవత్సరాల తరబడి నిశ్శబ్దంగా చేసిన కృషి కావచ్చు — జాతీయ గుర్తింపునకు అర్హమైన అసాధారణ ప్రయాణం సాగించిన ఏవరైనా పిల్లలు మీకు తెలిసి ఉంటే, వారి కథను జాతీయ వేదికపైకి తీసుకురావడం మీ ఒక్క నామినేషన్తోనే ప్రారంభమవుతుందని గుర్తుంచుకోండి. ఒకవేళ ఆ చిన్నారి మీరే అయితే, ఇంకా మంచిది. వెంటనే క్లిక్ చేయండి!
ఇప్పుడే నామినేట్ చేయండి
***
(Explainer ID: 159028)
आगंतुक पटल : 52
Provide suggestions / comments