ఆర్థిక మంత్రిత్వ శాఖ
మానిటైజేషన్ కార్యక్రమం పురోగతిని సమీక్షించిన ఎన్ఎల్ఎంసీ 21వ బోర్డు సమావేశం ... వేగవంతమైన ఆస్తుల మానిటైజేషన్కు ప్రాధాన్యత
మానిటైజేషన్ కోసం రూ.5000 కోట్లకు పైగా విలువైన ప్రతిపాదనలు
2025-26 వార్షిక ఆర్థిక నివేదికలు, డైరెక్టర్ల నివేదికను ఆమోదించిన బోర్డు
నాడు పోస్టు చేయడమైనది:
19 SEP 2026 10:54AM by PIB Hyderabad
నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎల్ఎంసీ) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల 21వ సమావేశం సెప్టెంబర్ 18, 2026న జరిగింది. కార్పొరేషన్లో కొనసాగుతున్న ఆస్తుల మానిటైజేషన్ కార్యక్రమ ఆర్థిక పనితీరు, కీలక సంస్థాగత కార్యక్రమాలపై ఈ సమావేశంలో సమీక్షించారు.
సమావేశంలో రూ.5000 కోట్లకు పైగా విలువైన ఆస్తుల మానిటైజేషన్ ప్రతిపాదనల పరిశీలన, సిపార్సులు జరిగాయి. మానిటైజేషన్ కోసం గుర్తించిన మిగులు భూమి, భవన ఆస్తులు ఈ ప్రతిపాదనల్లో ఉన్నాయి. తక్కువగా వినియోగిస్తున్న, మిగులు ఆస్తుల విలువను వెలికితీయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లటంలో ఇది కీలక ముందడుగును సూచిస్తుంది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈలు), ఇతర ప్రభుత్వ సంస్థలకు చెందిన మిగులు ఆస్తుల మానిటైజేషన్ను వేగవంతం చేయటంలో ఎన్ఎల్ఎంసీ సాధించిన పురోగతిని బోర్డు సమీక్షించింది. పారదర్శకత, సమర్థత, గరిష్ఠ విలువను సాధించటంపై ప్రత్యేక దృష్టి సారించి, తగిన ఆస్తులను గుర్తించటం, అవసరమైన పరిశీలన చేయటం, విలువను అంచనా వేయటంలో సహాయపడటం, తగిన మానిటైజేషన్ విధానాలను రూపొందించటం కోసం కార్పొరేషన్ ఆస్తులు గల సంస్థలతో కలిసి పనిచేస్తోంది.
వివిధ ఆస్తుల యాజమాన్య సంస్థల పరిధిలో కొనసాగుతున్న ప్రయత్నాలతో సహా ఎన్ఎల్ఎంసీ చేపట్టిన ఆస్తుల మానిటైజేషన్ వేగం, పురోగతిని బోర్డుకు వివరించారు. మానిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయటం, అమలుకు సంబంధించిన అవసరాలను పరిష్కరించటం, గుర్తించిన ఆస్తులను సరైన, పారదర్శక విధానాల ద్వారా ముందుకు తీసుకెళ్లటంపై ఈ చర్చలు జరిగాయి.
పురోగతిని అభినందించటంతో పాటు మిగులు ఆస్తుల విక్రయాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు వేగాన్ని కొనసాగించటం, భాగస్వామ్య సంస్థలతో సమన్వయాన్ని బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను బోర్డు స్పష్టం చేసింది.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎన్ఎల్ఎంసీ వార్షిక ఆర్థిక నివేదికలను, డైరెక్టర్ల నివేదికను బోర్డు ఆమోదించింది.
సమర్థతను పెంపొందించుకోవటానికి, ఆస్తుల కోసం మరింత వ్యవస్థీకృత వ్యవస్థను రూపొందించటానికి, కొనసాగుతున్న ఎన్ఎల్ఎంసీ కార్యక్రమాలను సమీక్షించటానికి ఈ సమావేశం అవకాశాన్ని కల్పించింది.
రూ. 5,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులకు సంబంధించి బోర్డు సిఫార్సులు చేయటం వల్ల ప్రభుత్వ ఆస్తుల మానిటైజేషన్ కార్యక్రమంలో ఎన్ఎల్ఎంసీ పాత్ర పెరుగుతోందని స్పష్టమవుతోంది. మిగులు భూమి, భవన ఆస్తుల ఉత్పాదక వినియోగాన్ని సులభతరం చేయటం ద్వారా, వృథాగా ఉన్న ఆస్తుల నుంచి విలువను రాబట్టేందుకు ఎన్ఎల్ఎంసీ ప్రయత్నిస్తుంది. పారదర్శకమైన, వాణిజ్యపరంగా తగిన మానిటైజేషన్ అవకాశాలను అన్వేషించటంలో ఆస్తులున్న సంస్థలకు ఇది మద్దతిస్తుంది.
భారత ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మిగులు ఆస్తులను సమర్థవంతంగా, పారదర్శకంగా, విలువ ఆధారంగా మానిటైజేషన్ చేయటంపై ఎన్ఎల్ఎంసీ దృష్టి సారిస్తుందని బోర్డు స్పష్టం చేసింది. మిగుల ఆస్తుల మానిటైజేషన్ను సులభతరం చేయటానికి, ప్రభుత్వ వనరుల సమర్థవంతమైన వినియోగానికి సహకరించేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సీపీఎస్ఈలు, ఇతర ప్రభుత్వ సంస్థలతో కలిసి కార్పొరేషన్ పనిచేస్తుంది.
నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (NLMC) గురించి
నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎల్ఎంసీ)... కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ. ఇది ఆర్థిక మంత్రిత్వశాఖలోని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ (డీపీఈ) పరిపాలనా నియంత్రణలో పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈలు), ఇతర ప్రభుత్వ సంస్థలకు చెందిన మిగులు భూములు, భవనాల ఆస్తులను మానిటైజేషన్ చేయటానికి ప్రోత్సహించేందుకు ఎన్ఎల్ఎంసీని ఏర్పాటు చేశారు.
మిగులు ఆస్తులను గుర్తించి, విలువను అంచనా వేసి, సరైన, పారదర్శక పద్ధతుల ద్వారా వాటిని ఆదాయ వనరుగా మార్చేందుకు ఆయా సంస్థలతో కలిసి ఎన్ఎల్ఎంసీ పనిచేస్తుంది. ప్రభుత్వ ఆస్తుల విలువను వెలికితీయటం, ప్రభుత్వ ఆస్తుల మానిటైజేషన్ లక్ష్యాలకు మద్దతివ్వటమే దీని ప్రధాన ఉద్దేశం.
***
(రిలీజ్ ఐడి: 2312454)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8